Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పైన మెరుగు, లోపల మురుగు అన్నట్టుగా ఉంది గ్రేటర్ హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ. పెరిగిన జనాభాకు తగినట్టుగా లేని డ్రయినేజీలు, వందల ఏండ్ల కింద నిజాం కాలంలో నిర్మించిన పైపులైన్లు, తరచూ పగిలిపోతూ, పూడుకుపోతూ రోడ్లపైనే మురుగు నీరు పారుతోంది. నగరంలో చినుకుపడినా అంతే సంగతులు డ్రయినేజీలు పొంగిపొర్లి మురుగు నీరు ఇండ్లలోకి వెళ్తున్న దుస్థితి. మంచినీటి పైపులైన్లలోకి మురుగు నీరు చేరుతుంది. సమస్యలు తలెత్తినప్పుడు హడావుడి చేసే అధికారులు అద్భుతమైన సీవరేజీ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం మామూలైంది. గతేడాది కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది కురిసి వర్షానికి సైతం నగరం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. డ్రయినేజీలు పొంగి పొర్లాయి. తిరిగి అదే పరిస్థితి నెలకొంది. పలు బస్తీలు, కాలనీల్లో కలుషిత జలాల సరఫరా తదితర సమస్యలు తలెత్తుతున్నాయి.
రోజు విడిచి రోజు సరఫరా..
గతంతో పోలిస్తే పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ ప్రజా అవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మంచినీరుకు ఢోకా లేదని అధికారులు ప్రకటిస్తున్నా నగరంలో రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 10.6 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నా యి. ఇందులో 10 లక్షల వరకు డొమెస్టిక్ (గృహ) కనెక్షన్లు ఉన్నాయి. వాణిజ్య, పారిశ్రామిక కేటగిరిలో దాదాపు 45 వేల వరకు కనెక్షన్లు ఉన్నాయి.
సీవరేజీ పనులు చేపట్టినా అదే తీరు
నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ రెండింటినీ జలమండలినే నిర్వహిస్తోంది. అయితే అక్టోబర్ 1 నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు మున్సిపాలిటీల సీవరేజి నిర్వహణ బాధ్యతలను జలమండలి చేపట్టింది. తాగునీటి సరఫరాతోపాటు సీవరేజీ సమస్యలు ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జలమండలి ఎండీ పలుసార్లు వివరించారు. జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల్లో నమోదయ్యే మంచినీరు, సీవరేజీ సమస్యలను సైతం జలమండలి పరిష్కరిస్తుందని తెలిపారు. అయినా ఆశించిన తీరులో ఫలితాలు రావడం లేదు.
రోగాల బారిన బస్తీవాసులు
డ్రయినేజీ పైపులు, తాగునీటి పైపులు పక్కపక్కనే ఉండ టంతో ఒక్కోసారి పైపుల లీకేజీ కారణంగా రెండు కలిసిపోతు న్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొత్త పైపులు వేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో నగరంలో పలు బస్తీల్లో తాగునీటితోపాటు మురు గు నీరు వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో నల్లా వచ్చేముందు కొన్ని నిమిషాల వరకు మరుగు నీరు వస్తోందనీ, ఇంకొన్ని ప్రాంతాల్లో చివర్లో మురుగు నీరు వస్తోందని పలుకాలనీలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. ఇదిలావుండగా రెండు మూడు రోజులుగా వీఎస్టీ, అచ్చయ్యనగర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో మురుగు నీరు వస్తోంది. దుర్వాసనతో నీరు రావడంతో బస్తీ వాసులు రోగాల బారి పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఆస్పత్రి పాలయ్యారు. వీఎస్టీలోని ఓ కార్యాలయంలో వాంతులు, వీరేచ నాలతో దాదాపు 20 మంది వరకు చికిత్స పొందుతున్నారు.