Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ కామ్రేడ్ సంధ్యపై హైదరాబాద్ పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో గత 40 ఏండ్లుగా కామ్రేడ్ సంధ్య భర్త రామకృష్ణారెడ్డి నిర్వహిస్తున్న నవ్య ప్రింటింగ్ ప్రెస్పై పోలీసులు దాడిచేసి భయబ్రాంతులకు గురిచేశారన్నారు. ప్రెస్లో పనిచేస్తున్న 50 మంది కార్మికుల సెల్ఫోన్లు గుంజుకుని చట్టబద్ధమైన పద్ధతులు అన్నింటిని పోలీసులు ఉల్లంఘించారన్నారు. రామకృష్ణ జ్ఞాపకార్థం అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో పత్రికలలో మీడియాలో వచ్చిన వ్యాసాల సంకలనం ప్రచురిస్తున్నారని పోలీసులు ఆరోపించటం అసమంజసమైనదని తెలిపారు. పుస్తకం, రచయితలు, ప్రచురణకర్తలు ఉంటాయని దానిలో అభ్యంతరకరమైనవి ఉంటే చట్టబద్ధ పద్ధతిలో చర్యలకు న్యాయస్థానాలను అనుసరించే అవకాశాలన్నీ ఉండగా.. పోలీసులు తప్పుడు పద్ధతిలో వ్యవహరించి రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టడం అప్రజాస్వామికమైనదని తెలిపారు. సంధ్యకు ఏమాత్రం సంబంధం లేకున్నా ఆమెపై కేసు బనాయించడం దుర్మార్గం అని వివరించారు. ఉద్దేశపూర్వకంగా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఆరేల్లి కృష్ణ, ఉపాధ్యక్షులు జె. సీతారామయ్య, కార్యదర్శి జి. అనురాధ పాల్గొన్నారు.