Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు విధ్వంసం సృష్టించారు. మేయర్ ఛాంబర్లోకి దూసుకెళ్లి డోర్ను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్పొరేటర్లు, కార్యకర్తలు మేయర్ ఛాంబర్లోకి దూసుకెళ్లారు. మేయర్ కార్యాలయానికి సంబంధించిన మెయిన్ డోర్ను పగులగొట్టారు. నేమ్ప్లేట్ తొలగిం చారు. ఎన్నికల కోడ్ ఉన్నందున సమావేశం నిర్వహించలేమని అధికారులు బీజేపీ నేతలకు సూచించారు. అధికారులు చెప్పినా పట్టించుకోకుండా కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సిందేనని బీజేపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే మేయర్ ఛాంబర్లోకి బీజేపీ కార్పొరేటర్లు దూసుకెెళ్లి డోర్కు స్టిక్కర్లు అంటించారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. జీహెచ్ఎంసీ బోర్డుపై బ్లాక్ స్ప్రే చల్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే బీజేపీ కార్పొరేటర్లను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ధర్నా సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, నేతలపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.
హేయమైన చర్య : మేయర్ గద్వాల విజయలక్ష్మి
బీజేపీ కార్పొరేటర్లు వారి అనుచరులతో జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధ్దతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఆస్తులను ధ్వంసం చేయడం సరియైన చర్య కాదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ విధమైన దాడులకు పాల్పడటం వల్ల ప్రజలకు వ్యవస్థలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుందని మేయర్ తెలిపారు. తనను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చినప్పటికీ రాలేదని, బీజేపీ కార్పొరేటర్లు ఎందుకురాలేదో సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎల్బీనగర్ జోన్లోని సరూర్నగర్ ప్రాంతంలో ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్బాడీ మీటింగ్ నిర్వహించలేక పోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయం సహించరాదని, ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.