Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
'నిరుద్యోగులారా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్లు సాధించడానికి నిరుద్యోగులంతా ఉద్యోగ సాధన పోరాటానికి సిద్ధం కావాలి' అని టీజేఏస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సలీంపాష పిలుపునిచ్చారు. మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో డిసెంబరు 3 వ తేదీన యువజన, విద్యార్థి జన సమితిల ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగే తెలంగాణ యూత్ డిమాండ్స్ డే సదస్సు కరపత్రాన్ని వేలాది మంది నిరుద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా సలీంపాష మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఏడున్నర ఏండ్లుగా నిరుద్యోగం మూడింతలు పెరిగిందని, దీనికి కేసీఆర్ ప్రభుత్వం వహిస్తున్న తీవ్ర నిర్లక్ష్యమే కారణమన్నారు. టీజేఏస్ పార్టీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు బాబూ మహజన్ మాట్లాడుతూ ఉద్యోగ నోటిషికేషన్ లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న 2 లక్షల 76 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. టీజేఏస్ హైదరాబాదు జిల్లా అధ్యక్షులు నర్సయ్య మాట్లాడుతూ కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ప్రయివేటు టీచర్లు, కార్మికులు, యువకులకు ప్రభుత్వం తరపున భరోసా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం టీజేఏస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. డిసెంబరు 3 వ తేదీన హైదరాబాదులో జరిగే తెలంగాణ యూత్ డిమాండ్స్ డే కార్యక్రమానికి నిరుద్యోగులు, యువకులు భారీగా తరలిరావాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజేఏస్ యూత్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కొత్త రవి, యూత్ హైదరాబాదు జిల్లా అధ్యక్షుడు సుశీల్ కుమార్, విద్యార్థి జన సమితి హైదరాబాదు జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి నరేందర్, విద్యార్థి యువజన సమితి నాయకులు పవన్ సింగ్, డప్పు గోపి, పాంచాల శ్రీను, జాషువా, గోవింద్, రాబర్ట్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.