Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్ / నేరేడ్మెట్
ఉద్యోగాలు ఇప్పిస్తామన్న పేరుతో నిరుద్యోగులను నమ్మించి, ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారుచేసి మోసం చేస్తున్న నలుగురు నిందితులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఉండటం విశేషం. ఎల్బీనగర్లోని క్యాంప్ ఆఫీసులో రాచకొండ సీపీ మహేష్ మురళీధర్ భగవత్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. కర్మన్ఘాట్, సాయి ఎంక్లేవ్లో నివాసం ఉంటున్న మద్దెల మడుగు వరకుమార్ అలియాస్ వరుణ్, ఎల్బీనగర్ శివగంగాకాలనీకి చెందిన యాతాకుల ప్రమోద్ కుమార్, న్యూ మారుతి నగర్ చంపాపేట్కు చెందిన వెన్ను దినకర్రెడ్డి అలియాస్ దినేష్ రెడ్డి అలియాస్ దిన్నా. బీఎన్రెడ్డి నగర్, వనస్థలిపురానికి చెందిన విప్పర్తి ప్రకాష్ నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో వరకుమార్ అలియాస్ వరుణ్, యాతాకుల ప్రమోద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వుండే వారు. వరకుమార్, వెన్ను దినకర్ రెడ్డి అలియాస్ దినేష్రెడ్డి క్రిమినల్ చరిత్ర కలిగి ఉన్నవారు. వరకుమార్ 2016లో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జాబ్ ఇప్పిస్తానని మోసం చేసి జైల్కు వెళ్లాడు.
వెన్ను దినకర్రెడ్డి నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు తయారీ కేసులో సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టయి 2016లో జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా సులభంగా డబ్బు సంపాదన కోసం మోసాలకు పాల్పడుతున్నారు. యాతాకుల ప్రమోద్ అనే నిందితుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాతున్నాడు. వరకుమార్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. దినకర్రెడ్డి ఎంసీఏ మధ్యలో నిలిపివేశాడు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండటంతో మరో నిందితుడు రబ్బర్ స్టాంపులు తయారు చేసే విప్పర్తి ప్రకాష్తో కలిసి తనప్లాన్ వర్కవుట్ చేశాడు. ఒక్కో స్టాంప్కు రూ. వెయ్యి చొప్పున డబ్బులు తీసుకొని నఖిలీ స్టాంపులు 17 రౌండ్ స్టాంపులు, 31 రబ్బరు స్టాంపులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల ఐదు సంతకాల స్టాంపులు తయారు చేశారు. నలుగురు నిందితులూ కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు (పంచాయతీ రాజ్, న్యాయ శాఖ, ట్రాన్స్ కో, జెన్ కో, హెల్త్, ఇరిగేషన్, మెట్రో, రైల్వే) మొదలగు శాఖల్లో నిరుద్యోగుల నుంచి వేమిని కన్సల్టెన్సీ ద్వారా నకిలీ అపాయింట్ మెంట్లు తయారుచేసి నేరుగా బాధితులకు ఆర్డర్ కాపీలు అందజేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. హయత్నగర్కు చెందిన యడ్ల రోజా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మీర్పేట, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అబ్దుల్లాపూర్ మెట్లో రామోజీ ఫిల్మ్ వద్ద ఓ హోటల్లో ఉండగా అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల 70 వేల నగదు, 24 నకిలీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు, 53 నకిలీ రబ్బర్ స్టాంపులు, లాప్టాప్, ప్రింటర్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో సమావేశంలో ఎస్వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి, హయత్నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రవి కుమార్, ఎస్ఐ అవినాష్లు ఉన్నారు.