Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజాగుట్ట స్టీల్ బ్ర్రిడ్జి ప్రారంభోత్సవంలో
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రూ.17 కోట్ల వ్యయంతో పంజాగుట్ట గ్రేవ్ యార్డ్కు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్అలీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... స్టీల్ బ్రిడ్జితో శ్మశానవాటికకు వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగి పోతాయన్నారు. పాతగేట్ నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున నాగార్జున సర్కిల్ నుంచి కేబీఅర్ పార్క్ జంక్షన్కు వెళ్లే వాహనాలకు ఆటంకం లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందని చెప్పారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం రోడ్డు విస్తీర్ణం 140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్ 57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లై ఓవర్ మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేసినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ కోసం అండర్పాస్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఫుట్పాత్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అనేక రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వీటితో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పించే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ మన్నే కవితారెడ్డి, చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ రవీందర్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.