Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైటెక్ యుగంలోనూ మహిళలపై దాడులు ఆగడం లేదు. చిన్నారులపైనా కొందరు మృగాళ్లు లైంగిక దాడు లకు, వేధింపులకు పాల్పడుతున్నారు. బడి, గుడి, ఆఫీసు, రైళ్లు, ఆటోలు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఎర్రగడ్డలో పట్టపగలే నడి రోడ్డులో ఓ మహి ళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన మర్చిపోక ముందే తనకు ఆస్తి బదలాయించాలంటూ భర్త వేధింపులు నగరంలో సంచలనం రేపింది. సైదాబాద్లో భార్యను వివస్త్రను చేసి కొన్ని రోజులపాటు ఓ గదిలో నిర్భందించాడు. భర్త నుంచి తనను రక్షించాలంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై ఓ యువకుడు చాక్లెట్ ఇప్పిస్తానంటూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్లో నిత్యం ఏదో ఒక చోట ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 2020తో పోలిస్తే 2021లో మహిళలపై దాడులు32 శాతం పెరిగాయి.
కరోనాలోనూ 95 శాతం పెరిగిన కేసులు
కరోనా కాలంలో మహిళలపై దాడులు మరింత పెరిగాయి. సిటీలో వరకట్న వేధింపులకు 2020లో 19 మహిళలు మృతి చెందగా 2021లో 15 మంది మరణిం చారు. 2020లో 14 మంది ఆత్మహత్యలకు పాల్పడగా 2021లో 13 ఆత్మహత్యలు చేసుకున్నారు. 2020లో 265 మంది, 2021లో 328 మంది లైంగిక దాడులకు గురయ్యారు. కరోనా సమయంలోనూ 95 శాతం లైంగిక దాడులు చోటు చేసుకోవడం అందోళన కలిగిస్తోంది. 2020లో 60 మంది కిడ్నాప్కు గురికాగా, 2021లో 90 మంది మహిళలు కిడ్నాప్కు గురయ్యారు. 2020లో మహి ళలను వేధించిన కేసులు 1043 నమోదుకాగా 2021లో 1474 కేసులు నమోదయ్యాయి.
పరిచయస్తులే అధికం..
చిన్నారులు, మహిళలపై అరాచకాలు, అత్యాచారాల కు పాల్పడుతున్న వారిలో అధిక శాతం తెలిసినవారే ఉంటున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇంటి సమీపంలోని వారు, పాత పరిచయం ఉన్నవారు, ఏదో ఒక బంధుత్వం ఉన్నవారు, పాత కక్షలను మనసులో పెట్టుకున్న వారు ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నట్టు అనేక ఘటనల్లో పోలీసులు నిగ్గు తేల్చారు. కుటుంబ సభ్యులు కాకుండా మూడో వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
అమల్లోకి కఠిన శిక్షలు
నిర్భయ ఉదంతం తర్వాత మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు అమల్లోకి వచ్చాయి. లైంగికదాడి బాధితులు నోరు తెరిస్తే తమకు ఇబ్బంది అనే భయంతో నిందితులు వారిని దారుణంగా హతమారుస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ అభివృద్ధి చెంది చిన్న క్లూతో పట్టే చాన్స్ ఉండటంతో ఆనవాళ్లు గుర్తించకుండా కాల్చేస్తున్నారు. కొన్ని కేసుల్లో పోలీసుల చొరవతో ఫాస్టుట్రాక్లో నిందితులకు జీవితకాలం జైలు శిక్షలు పడ్డాయి.