Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనీ, ఈ విషయంలో వారిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్, 1098 వారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకుని దానికి అనుగుణంగా చదువుకుని సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించు కోవాలన్నారు. ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం బాలికల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బాగా చదువుకుని నచ్చిన రంగంలో ప్రవేశించి ఉన్నతంగా జీవించాలన్నారు. తల్లిదండ్రులు బాలికల పట్ల వివక్ష చూపకూడదన్నారు. 18 ఏండ్లలోపు బాలబాలికలకు రక్షణ కోసం జాతీయ స్థాయిలో 24 గంటలపాటు నిర్వహిస్తున్న 1098 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎన్.ఎస్ ఎస్ ప్రసాద్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా కో-ఆర్డినేటర్ ప్రేమ్కుమార్, జిల్లా బాలల సంరక్షణ విభాగం సభ్యులు భానుప్రకాష్, సభ్యులు శ్రీకాంత్, నరేష్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.