Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చందన చెరువులో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం- అభివృద్ధి సమాన ప్రాతిపదిక అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వ సొంతం అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతన్నకు రైతు బంధు, బీమా, 24 గంటల విద్యుత్, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచటం, నకిలీ విత్తనాలపై పీడీ యాక్ట్ లాంటి చట్టాలు ప్రయోగించటం, గోదాంలు, కోల్డ్ స్టోరేజ్లు, రుణ మాఫీ వంటి పథకాలు వారి అభ్యున్నతి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు నిదర్శనంగా నిలుస్తాయని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రైతన్న ఎదిగారు అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతాంగ విధానం మాత్రమే అని కొనియాడారు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ను ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను నిర్మించారని తెలిపారు. సామాజిక అసమానతలు తొలిగించటానికి, దళితుల జీవితాల్లో వెలుగులు నింపటానికి తీసుకువచ్చిన అతి గొప్ప పథకం దళిత బంధు అని మంత్రి వెల్లడించారు.
ఆశా కార్యకర్తల సేవలు అభినందనీయం
కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటి జ్వర సర్వే, కేసీఆర్ కిట్లు తదితర వాటిలో వైద్య శాఖతో కలిసి బాగా పనిచేసిన ఆశా కార్యకర్తల సేవలు ఎంతో గొప్పవని మంత్రి అభినందించారు. వివిధ రకాల వైద్య సేవలు పొందిన వారికి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహకారం అందించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు..అనంతరం 30 మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈ గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంఎచ్ఓ, టీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.