Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవనీ, వాటిని వెలకట్టలేమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ పాన్బజార్లో గల అర్బన్ ఫ్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ముందుగా యూపీహెచ్సీలో వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 ఐసీయూ బెడ్స్ వార్డును ప్రారంభించారు. రూ.33 లక్షల విలువ చేసే సీఐయూ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, తదితర పరికరాలను అందజేసిన సంస్థ నిర్వాహకులను అభినందించారు. అనంతరం మంత్రి మాట్లా డుతూ హాస్పిటల్ అభివృద్ధి కోసం అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అయినా స్వచ్ఛంద సంస్థలు చేయూతను అందించడం అభినందనీయన్నారు. ఇక్కడికి వచ్చే వారి కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఈ హాస్పిటల్ను దత్తత తీసుకోవాలని వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఉపాధ్యక్షుడు భూషణ్ రెడ్డిని కోరారు. హాస్పిటల్ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు చేపడతామని ప్రకటించారు. కరోనా క్లిష్ట సమయంలో ఆశా వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది ఎంతో సేవలు అందించారని ప్రశంసించారు. వారి సేవలు గుర్తించి దేశంలో ఎక్కడా లేని వేతనాలు అందిస్తున్న గొప్ప నాయకులు సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కూడా ఆశా వర్కర్ల సేవలు ఎనలేనివన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం హైదరాబాద్ జిల్లాలో 1385 మంది ఆశా వర్కర్లకు రూ.కోటీ 25 లక్షల వ్యయంతో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్టు తెలిపారు. హాస్పిటల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కావాల్సిన పరికరాలకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక అందజేయాలని డీఎంఅండ్హెచ్ఓ వెంకట్ను మంత్రి ఆదేశించారు. హాస్పిటల్ను తమ ఇంటిలా భావించి పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇక్కడికి వచ్చే వారికి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, డిప్యూటీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.