Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రయివేటు భూముల్లో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీలో ప్రయివేటు భూముల్లో డిఫెన్స్ జోక్యంపై ఆయన పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ధరాత్రి సమయంలో జేసీబీలు, అనేక మంది జవాన్లతో కలిసీ డిఫెన్స్ వారు కాలనీలోని ఓపెన్ ప్లాట్లలో తవ్వకాలు జరపడంతో భయబ్రాంతులకు గురవుతున్నామని కాలనీ వాసులు ఎమ్మెల్యేకు వివరించారు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి స్థలాలను కొనుగోలు చేస్తే ఇప్పుడు డిఫెన్స్ జోక్యంతో తమలో తీవ్ర అందోళన వ్యక్తం అవుతుందన్నారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కాలనీ వాసులు భయపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డిఫెన్స్ వారితో వెంటనే సమావేశమై సమస్య పరిస్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాలనీ స్థల యజమానులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాలని వినతి
గాజులరామారం డివిజన్ పరిధిలోని శంకరయ్య భవాని జీబి ఎన్క్లేవ్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సంక్షేమ సంఘం సభ్యులు కోరుతూ సోమవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలో భూగర్భ డ్రయినేజీ, తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయ ప్రణాళికలు రూపొందించి త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.