Authorization
Fri March 21, 2025 09:27:08 am
- సీఐటీయూ నగర అధ్యక్షుడు ఈశ్వరరావు పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 28,29న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు ఈశ్వరరావు పిలుపునిచ్చారు. అదివారం సనత్నగర్ జోన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివేయాలనీ, మోనిటైజేషన్ పైప్లైన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. ప్రతికార్మికునికి 26వేల కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలని ఆయన కోరారు. స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలనీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైమ్, కంటింజెంట్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. భనవ నిర్మాణ, హామాలి, ఆటో, ట్రాన్స్పోర్టు కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలనీ, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్దరించాలన్నారు. పీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ పది వేలు ఇవ్వాలన్నారు. సంయుక్త కిసాన్ మోర్చాకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, మెరుగైన వేతనాలు ఇవ్వాలనీ, పట్టణాలకు విస్తరించాలన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు.