Authorization
Fri March 21, 2025 01:01:26 pm
నవతెలంగాణ-అంబర్పేట
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మలను కించపరుస్తూ ఆదివాసీ దళిత గిరిజనుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన చినజీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) అంబర్పేట నియోజకవర్గ కార్యదర్శి మహేందర్, సీఐటీయూ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్, కేవీపీఎస్ నగర అధ్యక్షులు సుబ్బారావు, గిరిజన సంఘం నాయకులు వెంకయ్య, నరసింహ డిమాండ్ చేశారు. శనివారం తిలక్నగర్ చౌరస్తాలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చినజీయర్ స్వామి శవయాత్ర నిర్వహించి పిండ ప్రదానం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దళిత గిరిజనులను అవమానించుడే పనిగా పెట్టుకున్న చినజీయర్ స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే కోట్లాది మంది భక్తులు కొలిచే సమ్మక్క సారమ్మలను అవమానపరచి ఆదివాసీ దళిత గిరిజనుల మనోభావాలను చినజీయర్ దెబ్బతీశారని ఆరోపించారు. ఇదివరకే కులాలపై, ఆహారపు అలవాట్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ కూడా వ్యాపారం చేస్తున్నాడన్నారు. ఇలాంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.