Authorization
Fri March 21, 2025 08:03:10 am
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశంలో 98 శాతం ప్రజలకు నష్టం కలిగించే విధానాలను అమలు చేస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎ.అశోక్ అన్నారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం జీడిమెట్ల రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద రాస్తోరోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జీడిమెట్ల గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అధ్యక్షులు కీలుకాని లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉమామహేష్, కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి స్వామి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఐలయ్య, ఐఎఫ్టీయూ నాయకురాలు పద్మ, ఐద్వా రాష్ట్ర కమిటి సభ్యురాలు లక్ష్మి, టీయుడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు రంగు వెంకటేష్గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధించుకున్న 44 చట్టాలను నిర్విర్యం చేసి యజమానులకు లాభం చేకూర్చే విధంగా చట్టాలను మార్చి 4 కోడ్ల రూపంలో తీసుకోస్తున్నారన్నారు. ధరలు హద్దు అదుపు లేకుండా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ప్రజలు మరింత దుర్బరపరిస్ధితులను ఎదుర్కోరటారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచవలసిన తరుణం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దేవదానం, అంజయ్య, జాకీర్, వెంకయ్య, ఏఐటీయూసీ నాయకులు హరినాథ్, రాములు, సుంకిరెడ్డి, ఐఎన్టీయూసీ నాయకులు సృజన్, ఐఎఫ్టీయూ నాయకులు వజ్రమని, హమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.