Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరుకుపోతున్న తుప్పు
- పట్టించుకోని ఆర్టీఏ అధికారులు
- తలలు పట్టుకుంటున్న ఆర్టీసీ సిబ్బంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆర్టీసీ డిపోల్లో ఆర్టీఏ వాహనాలు తిష్టవేశాయి. దీంతో డిపోలో రోజురోజుకూ స్థలాభావం సమస్య ఏర్పడుతోంది. సాధారణంగా ఒక్కో డిపోలో 150కి తగ్గ కుండా బస్సులు ఉంటాయి. వీటిని నిలిపేందుకే డిపోలో స్థలం సరిపోక ఇబ్బంది పడుతుంటే ఆర్టీఏ వాహనాలు నిలపడమేంటని ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ డిపోల్లో నిలిపిన ఆర్టీఏ వాహనాలను వెంటనే తరలించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు లేఖలు పంపించినా స్పందించడంలేదని ఆర్టీసీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాగా లేకనే..
వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను రోడ్డు ట్రాన్స్పోర్టు ఆధారిటీ అధికారులు ఒకదాని తర్వాత ఒకటిగా తీసుకొచ్చి అందుబాటులో ఉన్న ఆర్టీసీ డిపోల్లో పెడుతుంటారు. నగరంలోని అన్ని డిపోలలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా ఆర్టీసీ బస్సు డిపోలోనే బోలెడంత చెత్త పోగైతుంటుంది. చిరిగపోయిన సీట్లు, పాడైన టైర్లు, మరమ్మతులలో తొలగించిన విడిభాగాలు పేరుకుపోతుంటాయి.
నగరంలోని 28 డిపోలలో 3,850 బస్సులు ఉన్నాయి. ఒక్కో డిపోలో దాదాపు 150 బస్సులు ఉంటాయి. ఈ బస్సుల నిర్వహణకు డిపోల్లో ఉన్న స్థలం సరిపోవడంలేదు. బస్సులు శుభ్రం చేయడానికి, మరమ్మతులు నిర్వహించడానికి కొంత స్థలం పోగా..మిగిలిన చోట ఆర్టీఏ పట్టుకున్న వాహనాలను పేడేస్తున్నారు. దీంతో బస్సులను డిపో బయట పార్కింగ్ చేస్తున్నారు. నగరం మధ్యలో ఉన్న కూకట్పల్లి, రాణిగంజ్, బర్కత్పురా, కంటోన్మెంట్ కుషాయిగూడ వంటి బస్సు డిపోల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
నగరంలో ఆర్టీఏ అధికారులు పట్టుకున్న వాహనాలను పార్కింగ్ చేసేందుకు తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలాలు కబ్జా కోరల్లో ఉండడమే ఇందుకు కారణం. హైదరాబాద్లో కబ్జాదారులు ఏ చిన్న స్థలం కనిపించినా గద్దల్లా వాలి తన్నుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయా డిపోల్లో ఆర్టీఏ అధికారులు ఉంచిన కొన్ని పాత వాహనాలు స్క్రాపింగ్కు కూడా పనికిరాకుండా ఉన్నాయి.
దుర్వాసన..
డిపోల్లో పేరుకుపోయిన వాహనాలకు తోడు ఆర్టీసీ వ్యర్థాలు తోడవ్వడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మరోవైపు దుమ్ముకొట్టుకుపోయిన వాహనాలతో డిపోల్లో పందికొక్కుల సంచారం ఎక్కువైంది. కొన్ని చోట్ల పాములు తిరుగుతున్నాయని ఆర్టీసీ డిపోల సబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండికొక్కుల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ పాడై.. మురుగు పొంగే పరిస్థితి నెలకొంది.
ఆర్టీసీ డిపోలు, బస్సులను పరిశుభ్రంగా ఉంచడానికి గుట్టలుగా పడిన వాహనాలు అడ్డుగా మారాయని ఆర్టీస అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు.