Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
హెచ్ఎండీఏకు ఉద్యాన వనాల నిర్వహణలో అవార్డుల పంట పండటంతోపాటు నంబర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పోటీ పడిన దాదాపు 24 కేటీగిరీల్లో 18 బహుమతులు గెలిచి ఔరా అనిపించింది. ట్యాంక్బండ్ సమీపంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్స్పల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు కలిసి సంయుక్తంగా బహుమతులను అందుకున్నారు. ఈ సందర్భంగా పిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో పట్టణ అటవీ విభాగం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించటం చేస్తున్న కృషి పట్ల హెచ్ఎండీఏ కమిషనర్ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన వన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే సంస్ధలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది జనవరి 25 నుంచి 31 వరకు ఏర్పాటు చేసిన ఉద్యానవన మహోత్సవ పోటీల్లో 18 బహుమతులు సాధించి హెచ్ఎండీఏ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 26 కేటగిరీల్లో హెచ్ఎండీఏ పోటీ పడింది. ఇందులో ప్రథమ- 11, ద్వితీయ- 5, తృతీయ-2 బహుమతులను పొందింది. పోటీ పడిన అన్ని సంస్ధల కన్నా అత్యధిక బహుమతులు సాధించిన ఓవరాల్ ఛాంపియన్గా నిలిచి రోలింగ్ కప్పును సైతం హెచ్ఎండీఏ సొంతం చేసుకుంది. అవుటర్ రింగ్ రోడ్ అవెన్యూ ప్లాన్టేషన్కు రాష్ట్ర హరితహారం - పచ్చదనం (గ్రీన్ బెల్ట్) విభాగంలో ప్రథమ బహుమతి పొందింది. అలాగే స్మారక ఉద్యానవనం(పార్క్), రాష్ట్ర నాయకులు విభాగంలో ఎన్.టి.ఆర్. మెమోరియల్ పార్క్, జాతీయ నాయకులు విభాగంలో పి.వి.ఘాట్, థీమ్ పార్కుకు నేచురల్ విభాగంలో బటర్ఫ్లై గార్డెన్కు, థీమ్ పార్క్ ఇన్నోవేటివ్ విభాగంలో రోజ్ గార్డెన్, బిగ్గెస్ట్ థీమ్ పార్క్ విభాగంలో రాక్ గార్డెన్, ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ లాండ్ స్కేపింగ్ విభాగంలో జాతీయ జెండా, పార్క్స్ విత్ ఎంటర్టేయిన్మెంట్ షో విభాగంలో లేజర్ షోకు అవార్డులు దక్కాయి. అంతేకాకుండా అత్యధిక ప్రజలు సందర్శించే పార్కుల కేటగిరీలో లుంబినీ పార్కు, ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కుల నిర్వహణ కేటగిరీలో సీఎం క్యాంపు కార్యాలయం, నివాస గృహం, హర్బల్ గార్డెన్- రాజ్ భవన్, పిల్లల వైజ్ఞానిక పార్క్ విభాగంలో సంజీవయ్య పార్క్లోని సైన్స్ పార్క్, తెలంగాణ నేటివిటి పార్క్ కేటగిరీలో బతుకమ్మ ట్రైల్స్- నెక్లెస్రోడ్డ్డు, బోన్సాయి గార్డెన్ కేటగిరీలో ఎన్టీఆర్ గార్డెన్, బోన్సాయి గార్డెన్, జపనీస్ గార్డెన్ కేటగిరీలో ఎన్టీఆర్ గార్డెన్లోని జపనీస్ గార్డెన్, రోటరీసే విత్ ప్లవర్ ప్లాంట్స్ ప్లాంటేషన్ కేటగిరీలో ఇందిరా రోటరీ, బెస్ట్ ఐ లాండ్ పార్క్ కేటగిరీల్లో తెలుగు తల్లి ఐ లాండ్కు ప్రథమ బహుమతులు వచ్చాయి. అలాగే హర్బల్ గార్డెన్ కేటగిరిలో సంజీవయ్య పార్కులోని హర్బల్ గార్డెన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలమెంట్ ఏరియా పార్క్ కేటగిరీలో ఉప్పల్ భగాయత్ లే అవుట్కు ద్వితీయ అవార్డులు దక్కాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కుల నిర్వహణ విభాగంలో సచివాలయం కు తృతీయ అవార్డు లభించింది. ఈ పోటీలో హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ, మెట్రో రైల్, డీర్డీఓ, డీఆర్డీఎల్, ఇన్ఫోసిస్, రైల్వేస్, ప్రగతి రిసార్ట్సు, ఉద్యాన శాఖ మిలటరీ తదితర 24 సంస్ధలు పాల్గొన్నాయి. శాస్త్రవేత్తలు, ఉద్యానవన విభాగానికి చెందిన రిటైర్డ్ ఉన్నతాధికారులు, లాండ్ స్కేప్ నిపుణులతో కూడిన 18 మంది సభ్యులు కలిగిన కమిటీ వ్యక్తిగతంగా పరిశీలించి విజేతలను నిర్ణయించింది. పార్కుల్లో పచ్చదనం, నాణ్యత, పూల దిగుబడి, ప్రజల స్పందన, వినూత్న ప్రయత్నాలు తదితర 24 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఇతర న్యాయనిర్ణేతలు కూడా హెచ్ఎండీఏ, పట్టణ ఉద్యానవన విభాగం ద్వారా నగరంలో పచ్చదనాన్ని పెంచడంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రధ్ధను పోటీ నిర్వహణాదారులు ప్రత్యేకించి కొనియాడారు.