Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్
నవతెలంగాణ-ముషీరాబాద్
గాంధీనగర్ డివిజన్లోని ఎస్ఆర్టీ కమ్యూనిటీ హాల్లో అకారణంగా మూసేసిన వ్యాయామశాలను తిరిగి కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ డిమా ండ్ చేశారు. గురువారం ఎస్ఆర్టీ జవహర్ నగర్ వ్యాయామశాల, ఆటస్థలము, కల్యాణ మండపం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వ్యాయామశాల వద్ద చేపట్టిన నిరసన దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గాంధీ నగర్లో అనేక మంది పేద విద్యార్థులు పల్లెల నుంచి నగరానికి వచ్చి ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ ఉంటారని, వారందరికీ ఈ వ్యాయామశాల ఎంతో ఉపయోగంగా ఉండేదన్నారు. ఈ వ్యాయామశాలకు చిన్న చిన్న మరమ్మతులుంటే వాటిని కూడా స్థానికులే సరిచేసుకుని కొనసా గించుకుంటుంటే.. ఎవరో ఫిర్యాదు చేశారనే వంకతో, రాజకీయ పరమైన కారణాలతో దానిని మూసేయడం సరికాదన్నారు. జీహెచ్ ఎంసీ అధికారులే కావాల్సిన పరికరాలు ఏర్పా టుచేసి వ్యాయామశాలను ఆధునీకరించాలి కానీ అకారణంగా మూసేయకూడదని హితవు పలికారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్తో కూడా దీనిపై చర్చించానని, వ్యాయామశాలను తిరిగి ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రత్నసాయిచంద్, పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మల్లేష్, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, సలహాదారు జయేందర్ బాబు, నాయకులు పాల్గొన్నారు.