Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.756 కోట్లతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు
- నవంబర్ నాటికి పూర్తి
- ఓఆర్ఆర్ వరకు విస్తరించిన జలమండలి
- రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న ఏడీబీ బ్యాంకు
- రూ.4వేల కోట్లతో రింగ్మెయిన్ డీపీఆర్ సిద్ధం
- జలమండలి ఎండీ దానకిషోర్
నవతెలంగాణ-హైదరాబాద్
నగర శివారు ఓఆర్ఆర్ వరకు తాగునీటిని జలమండలే నిర్వహించనుందని జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ తెలిపారు. గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాడ్కో ప్రాజెక్టులో 56 రిజర్వాయర్ల నిర్మాణం, 2,200 కిలోమీటర్ల పైపులైను విస్తరణ పనులను నిర్ణీత గడువు కంటే ముందే చేపట్టి నగర శివారు ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. రూ.756 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 183 గ్రామాలు, మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేందుకు ఓఆర్ఆర్ ప్రాజెక్టు పనులు చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 162 రిజర్వాయర్లు, 2వేల కిలో మీటర్ల పైపులైను విస్తరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. ఇప్పటికే 62 రిజర్వాయర్ల నిర్మాణం, 612 కిలో మీటర్ల పైపులైను విస్తరణ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకోచ్చామన్నారు. 11 నెలల ముందే ప్రాజెక్టు పూర్తి చేసినట్టు వివరించారు. వర్షాకాలంలో కొంత ఇబ్బంది తలెత్తడం వల్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టులో భాగంగా దాదాపుగా 1.5 లక్షల నూతన నల్లా కనెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. రూ.350 కోట్లతో రింగ్ మెయిన్ పనులు చేపడుతున్నామన్నారు. 1800 ఎంఎం డయా పైపులను దాదాపు 40 కిలో మీటర్లు వేశామన్నారు. రైల్వే క్రాసింగ్, హైవేల క్రాసింగ్లు ఉండడం వల్ల పనులు కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు.
అలాగే దాదాపు రూ.4 వేల కోట్లతో రింగ్మెయిన్-2 ప్రాజెక్టు డీపీఆర్లు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు తెలిపారు. 12 మెగా బాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించనున్నట్టు వివరించారు. ఈ రింగ్ మెయిన్ అందుబాటులోకి వస్తే నీటి లభ్యతను బట్టి కష్ణా, గోదావరి, మంజీరా నీటిని ఒక్క ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సులభంగా సరఫరా చేయవచ్చన్నారు. ఓఆర్ఆర్ వరకు సివరేజీ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. జలమండలి చేపడుతున్న పనుల్లో నాణ్యత, పనులు త్వరగా పూర్తిచేస్తున్నందుకు గాను ఎడిబి (ఎషియన్ డెవలప్మెంట్ బ్యాంకు) బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.
గణేష్ నిమజ్జనం, మొహార్రం సందర్భంగా మురుగునీరు రోడ్డుపై పారకుండా చర్యలు చేపట్టినట్టు వివరించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 101 ప్రదేశాల్లో భక్తులకు తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు 30లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న బస్తీలను గుర్తించి రూ.35 కోట్లతో పైపులైను పనులు చేపట్టినట్టు తెలిపారు. తద్వారా దాదాపుగా 30-40 శాతం ట్యాంకర్లు తగ్గినట్లు తెలిపారు.
నూతనంగా చేపడుతున్న బిల్లింగ్ విధానం వల్ల నెలకు 5కోట్ల మేర ఆదాయం పెరిగిందని తెలిపారు. అక్రమ నల్లాకనెక్షన్లపై జలమండలి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కమర్షియల్ కనెక్షన్లపై మొదట దష్టి సారించినట్టు తెలిపారు. అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నట్టు రుజువైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హాడ్కో ప్రాజెక్టులో భాగంగా వేసవికి ముందు 35,000 నూతన నల్లా కనెక్షన్లు, వేసవి తర్వాత 12,000 నూతన నల్లా కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ నుంచి రోడ్డు తవ్వకాలకు అనుమతులు లభిస్తే నూతన నల్లా కనెక్షన్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. సత్యనారాయణ, సెకండరీ ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ పీ.ఎస్. సూర్యనారాయణ, ప్రాజెక్టు -2 డైరెక్టర్ డి. శ్రీధర్ బాబు, ఆపరేషన్ డైరెక్టర్లు అజ్మీరా కష్ణ, పి.రవి, పీ అండ్ ఏ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ ఎం.బి. ప్రవీణ్ కుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, రెవెన్యూ డైరెక్టర్ బి. విజరు కుమార్ రెడ్డిలతో పాటు సీజీఎమ్లు, జీఎమ్లు పాల్గొన్నారు.