Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థుల ఎంపికపై పెంచిన వేగం
- తలనొప్పిగా మారిన గ్రేటర్ హైదరాబాద్ సెగ్మెంట్ల ఎంపిక
- పెరిగిన సీనియర్ల, జూనియర్ల విజ్ఞప్తులు
- నగరంలో గులాంనబీ ఆజాద్ పర్యటన
- గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు మానండి : గ్రేటర్ ఆశావాహులకు ఆజాద్ హెచ్చరిక
తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి ప్రతిపక్షాలకు సవాలు విసిరింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై వేగంగా పావులు కదుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్లోని 24 సెగ్మెంట్లలో పోటీచేసే ఆశావహుల జాబితా ఎక్కువగా ఉండటం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
నవతెంగాణ-సిటీబ్యూరో
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారితో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్పై పోటీ చేసి గెలిచినవారు, ఓడిన వారు సైతం తిరిగి పోటీ చేసేందుకు ఇప్పటికే టీపీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. తమ తమ సెగ్మెంట్ల పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారంలో లేనప్పటికీ ప్రజాభివృద్ధి పనులు చేయిస్తున్న వాటికి సంబంధించిన రికార్డులు, పత్రికల కటింగ్లు, బస్తీల్లో చేస్తున్న అభివృద్ధి, స్థానికంగా పేరు ప్రఖ్యాతలు పుష్కలంగా ఉన్నాయంటూ తమ కండక్ట్ సర్టిఫికెట్లన్నీ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ సారి కూడా టికెట్టు తమకే వస్తుందని ఆశపడ్డ తాజా మాజీలకు కొత్త నేతలు కూడా బరిలోకి దిగుతున్నట్టు దరఖాస్తు చేసుకోవడం తలనొప్పిగా మారింది. ఆశావహులు నిత్యం గాంధీభవన్ చుట్టూ తిరుగుతూ టీపీసీసీ అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ టికెట్ తమకే ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ఏఐసీసీ తెలంగాణ పీపీసీలో సీనియర్లకు చోటు కల్పించకుండా యువతకు ప్రాధాన్యత కల్పించడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్న సీనియర్లు భయపడుతున్నారు. టికెట్టు తమకు ఇస్తారో లేదోనన్న భయం వారిలో వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లోనే బుధవారం నుంచి రాష్ట్రంలో పర్యటిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ను గురువారం గాంధీభవన్ వద్ద గ్రేటర్కు చెందిన ఆశావహులు కలిశారు. గతంలో ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని, మరోసారి అవకాశం కల్పించాలని కోరుతూ ఆజాద్ను వేడుకుంటున్నారు. కాగా గతంలో ఒకటి రెండు సార్లు ప్రజా ప్రతినిధిగా గెలుపొందిన సీనియర్లు తమ తమ నియోజక వర్గాల్లో సక్రమంగా అభివృద్ధి పనులు చేయకపోవటం వల్లే 2014 ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈ సారి తమకు టికెట్టు కేటాయిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని జూనియర్లు ఆజాద్కు లేఖలు ఇస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్ల విజ్ఞప్తులతో తలనొప్పిగా మారిన వ్యవహారాన్ని ఏ విధంగా చక్కదిద్దాలనే విషయంపై ఆజాద్ టీపీసీసీ నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.
గాంధీభవన్కు తండోపతండాలుగా వస్తున్న ఆశావహులను ఉద్దేశించి ఆజాద్ మాట్లాడారు. టికెట్లు కేటాయించే విషయం తర్వాత చూసుకుందాం, అయితే ముందు పార్టీ కోసం పని చేయాలని వారికి పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ తరహాలో కాంగ్రెస్ పార్టీ ఇంత ముందుగా టికెట్లు ఇవ్వలేదని, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత టికెట్లు కేటాయిస్తామని, ముందస్తుగా అయితే కుదరదని ఆయన స్పష్టం చేశారు. నేతలు టికెట్ల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగడం కాదని, నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మలక్పేట, ఉప్పల్, అంబర్పేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేసేందుకు నలుగురు, ఐదుగురు చొప్పున ఆశావహులు రంగంలో ఉన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చే ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీని గ్రేటర్లోని మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్డు షోలు చేయించాలని ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఇబ్రహీప ట్నం నియోజక వర్గాలకు చెందిన ఆశావహులు టీపీసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. గోషామహల్, ఖైరతాబాద్, అంబర్పేట, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో రోడ్డు షో చేయించడంతో పాటు నిజాం కళాశాల మైదానంలో కానీ, ఎల్బీ స్టేడియంలో కానీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ అబద్ధపు పాలనకు పాతర వేయొచ్చని ఆయా నియోజక వర్గాలకు చెందిన పార్టీ సీనియర్లు, జూనియర్ నేతలు టీపీసీసీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.