Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పు చేసివారికి శిక్ష పడాల్సిందే
- ఆస్పత్రి నుంచి మాధవి డిశ్చార్జ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రేమ వివాహం చేసుకుందని మాధవి అనే యువతిపై ఆమె తండ్రి మనోహరచారి సెప్టెంబర్ 19న కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవికి. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారు. బాధితురాలు పూర్తిగా కోలుకోవడంతో.. ఆమెను బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఎర్రగడ్డకు చెందిన సందీప్, బోరబండకు చెందిన మాధవి సెప్టెంబర్ నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో మాధవి తండ్రి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 19న గోకుల్ థియేటర్ వద్ద తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో మాధవి, సందీప్పై మనోహరచారి దాడి చేశారు. సందీప్ తృటిలో తప్పించుకోగా, మాధవిని విచక్షణారహితంగా మనోహరచారి నరికాడు. తీవ్రంగా గాయపడిని యువతిని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్సపొందుతున్న యువతి డిశ్చార్జ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను భర్తతోనే ఉంటానని స్పష్టం చేశారు. తప్పు చేసినవారిని చట్టపరంగా శిక్షించాలన్నారు. దాడి కారణంగా తనకు కాళ్లు, చేతులు సరిగా పని చేయడం లేదని, నా బాధ వర్ణనాతీతం అన్నారు. నా లాంటి బాధలు మరెవ్వరికీ రావొద్దన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనను రక్షించిన డాక్టర్లకు, మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.