Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రజిత్కుమార్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ఓట్లు వేయడానికి వచ్చే వికలాంగులకు పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రజిత్కుమార్ జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఆయన గురువారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్తో వికలాంగులకు కావలసిన వీల్చైర్లు, ర్యాంప్లు, రవాణా సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాల వారిగా కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మమైన పోలింగ్ కేంద్రాలు, వెబ్క్యాస్టింగ్కు అవసరమైన ప్రాంతాలను గుర్తించడంలో సంబంధిత ఎస్పీలతో సంప్రదించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సదరం సర్టిపికెట్ల ఆధారంగా 36873 మంది వికలాంగులు ఉన్నారని గుర్తించగా వీరిలో 14379 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వీరిలో 2289 మందిని గుర్తించి సర్వే చేయగా 184 మంది మృతి చెందారని, 471 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు. జిల్లాకు 1218 వీల్చైర్లు అవసరం కాగా 115 అందుబాటులో ఉన్నాయని మిగిలిన వాటి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వీసీలో నోడల్ అధికారులు కౌటిల్యా, రవీంద్ర, స్వరూప, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.