Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెషల్ అధికారులు ఎక్కడా..?
- డ్యూటీ సాకుతో గ్రామాల్లో అడుగు పెట్టని అధికారులు
- ఎంపీడీవో, ఈవోపీఆర్డీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కార్యదర్శులు
- సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ - హయత్నగర్
దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలంటారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు అని జాతి పిత చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచినా రాష్ట్రంలో ఏ గ్రామం కూడా అభివృద్ధి చెందిన ధాఖలాలు లేవని చెప్పవచ్చు. కేసీఆర్ పాలనలో గ్రామ జ్యోతి ద్వారా రూ.10లక్షలతో ప్రతిగ్రామంలో ఉన్న శ్మశాన వాటికలను పూర్తిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం స్వచ్ఛ భారత్ పేరుతో బహిరంగ మల, మూత్ర విసర్జన లేకుండా అర్హులైన ప్రతి పేద వాడికి ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. కానీ అవి ఏ గ్రామాంలో కూడా పూర్తిస్థాయిలో కాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
హయత్నగర్ మండలంలో ఉన్న ఏ ఒక్క గ్రామంలో కూడా 100శాతం మరుగుదొడ్లు నిర్మించిన ధాఖలాలు లేవనే చెప్పవచ్చు. ఇక 2013లో గెలిచిన గ్రామ సర్పంచ్ల పదవి కాలం ముగియడంతో వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా అంతా సర్వం సిద్ధం చేసిన టీఆర్ఎస్ సర్కారుకు ఆయా నియోజక వర్గాల పరిధిలో ఉన్న అధికార టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు మనకు ప్రతి గ్రామంలో తీవ్ర వ్యతిరేఖత ఉన్నదని ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే ఘోర పరాభావం తప్పదని కేసీఆర్కు చెప్పడంతో కోర్టు కేసు ఉన్నదని పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా జూలై 4నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతుందని ప్రత్యేక జీఓను విడుదల చేశారు. ఇక గతంలో ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు తమ సమస్యలు పరిష్కరించాలని వారి ఇంటి ముందుకు వెళ్లి నిలదీసి అడిగే వారిమని ప్రజలు అంటున్నారు. స్పెషల్ అధికారుల పాలన వచ్చినప్పటి నుంచి అసలు వారు కార్యాలయాలకు ఎప్పడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో ఆ గ్రామ వాసులకే తెలియని పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్న 4మండలాల్లో హయత్నగర్ మండలానికి ప్రస్తుతం 18 గ్రామాలు మాత్రమే ఉన్నాయని అందులో కొందరు కార్యదర్శులకు క్లస్టర్ విదానంతో పనులు చేస్తున్నారని దానికి తోడుగా అనుభవం కలిగిన అధికారులను 18మందిని స్పెషల్ అధికారులుగా జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. కానీ అందులో ఉన్న ఏ ఒక్క స్పెషల్ అధికారి తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తుడో, లేడో ఏనాడైన ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన పాపాన పోలేదని దాంతోనే వారి గ్రామాలకు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వారిపై చర్యలు తీసుకునే సాహాసం ఏ ఒక్క ఉన్నతాధికారి చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. చాలా మంది గ్రామ కార్యదర్శులు కొంతమంది జిల్లా మంత్రుల అండదండలు ఉండటంతోనే చాలా మంది కార్యదర్శులు గ్రామాల్లో ఉండకుండా మండల అభివృద్ధి కార్యాలయంలో ఉండే ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. హయత్నగర్ మండల అభివృద్ధి అధికారికి నూతనంగా ఏర్పడిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్గా, తారామతి పేట గ్రామానికి స్పెషల్ అధికారిగా ఉండటంతో తాను ఎక్కువగా మున్సిపాలిటీలోనే ఉంటున్నట్టు, తమ గ్రామానికి అసలు రావడం లేదని దానికి తోడు అక్కడ విధులు నిర్వహించే కార్యదర్శి పరిస్థితి కూడా అంతేనని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా మరి కొన్ని గ్రామాల్లో చాలా మంది ఇండ్లమీదుగా కరెంటు తీగలు, ఇనుప విద్యుత్ స్థంబాలు తొలగించాలని ఎంతమంది అధికారులకు ఫిర్యదు చేసిన ఇప్పటికి వారి సమస్యలు తీరడం లేదని వారు చెబుతున్నారు. ఇక గ్రామంలో ఉన్న శ్మశాన వాటికను రూ.10లక్షలతో అభివృద్ధి చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ కొన్ని గ్రామాల్లో ఇప్పటికి శ్మశాన వాటికల పరిస్థితి గతంలో లాగానే ఉందంటున్నారు. మరి ఎన్నికల డ్యూటీ పేరుతో విధులకు వచ్చి ప్రజా సమస్యలపై స్పందిచని కార్యదర్శులపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
అధికారులు ఉన్నత కులానికి చెందిన వారి మాటలు మాత్రమే వింటున్నారు
ప్రతి గ్రామంలో చాలా మంది అధికారులు ఉన్నత కులానికి చెందిన నాయకుల, వ్యక్తుల మాటలు మాత్రమే వింటున్నారు. నాకు అధికారులతో పని ఉంటే దాదాపు వారం రోజులైన వారు అందుబాటులోకి రారు. బాచారం గ్రామంలో నేనొక్కడినే ఎరుకల కులస్తుడిని నాకు రైతుబంధు చెక్కు, పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చినా.. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు నాకు సహాయం చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంపై గతంలో ఆర్డీఓ, తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు.
- బిజిలి శంకర్, బాచారం గ్రామస్తుడు
ఎన్నికల డ్యూటీ పేరుతో గ్రామాలకు
వెళ్లని అధికారులు ఎందరో..
నగర శివారు గ్రామాలకు చాలా మంది కార్యదర్శులు, స్పెషల్ అధికారులు ఎన్నికల డ్యూటీ పేరుతో గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడం పూర్తిగా మరిచిపోయారు. ఎవరైన సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై కేసులు భనాయిస్తున్నారు. ఇక నిరుద్యోగులు, నిరక్షరాసులు కార్యాలయాలకు వారి పని నిమిత్తం వస్తే ఒక రోజు పని వదులు కొవాల్సిందే. ఉన్నతాధికారుల నిఘా కొరవడటంతో కార్యదర్శులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతుంది.
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
ఏర్పుల నర్సింహా