Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దత్తత గ్రామంలో అడ్డుకున్న ప్రజలు
- మైనింగ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
నవతెలంగాణ-హయత్నగర్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండు దఫాలుగా గెలిచిన మంచిరెడ్డి కిషన్రెడ్డికి దత్తత గ్రామాల నుంచి నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆయన అబ్దుల్లాపూర్మెట్ మండలం గువ్వలేటి, చిన్నరావిర్యాల, బండరావిర్యాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చిన్న రావిర్యాల గ్రామంలో మాట్లాడుతుండగా ఆ గ్రామ మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. 'మాకేం చేశారని ప్రచారానికి వచ్చారు' అంటూ నిలదీశారు. అక్కడి నుంచి తన దత్తత గ్రామమైన బండరావిర్యాలకు వచ్చిన ఆయన్ను ప్రజలు అడ్డుకున్నారు. 'బండ రావిర్యాల, చిన్న రావిర్యాల గ్రామాలకు చెందిన 268 సర్వే నెంబర్లో దాదాపు 215 మంది మైనింగ్ బాధితులకు సర్కారు నుండి నష్ట పరిహారం రావాల్సి ఉంది.ఒక్కో ఎకరాకు రూ.7.04 లక్షలు ఇస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు' అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రశ్నించారు.
గ్రామ పంచాయతీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన యువత 'ఇక చాలు.. ఏ సాధించారని మా గ్రామానికి వచ్చి మాట్లాడుతున్నారు' అని మంచిరెడ్డిని ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న మంచిరెడ్డి కుమారుడి అనుచరులు ఆ యువకులపై దాడికి యత్నించారు. వెంటనే కిషన్ రెడ్డి ఆపివేయించారు. ఆ తర్వాత సభలో నిలుచున్న టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్ గ్రామస్తులపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న పోలీసులకు హుకుం జారీ చేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువుర్నీ శాంతింపజేశారు.