Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకటిత విద్యుత్ కోతలకు అడ్డుకట్ట పడేదెప్పుడు..?
- పునరుద్ధరణ సేవలపై వీడని నిర్లక్ష్యం
మా ప్రభుత్వ హయాంలో నాణ్యమైన విద్యుత్ తీసుకొచ్చామని చెబుతున్న కేసీఆర్ మాటాలు కాగితాల్లోనే వెలుగుతున్నాయి. దానికి నిదర్శనం మలక్పేట నియోజకవర్గంలోని ప్రారతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు, తరుచూ కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నేలకు తాకే స్తంబాలు తదితర సమస్యలు. దీంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అంతేకాదు.. ఎప్పుడు విద్యుత్ తీస్తారో తెలియదు.. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలతో పాటు నిరంతర వెలుగులు ఉండేందుకు వీలుగా విద్యుత్శాఖ తగిన చర్యలు చేపట్టని కారణంగా నిత్యం అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
నవతెలంగాణ-మలక్పేట
మలక్పేట నియోజకవర్గం పరిధిలోని అస్మాన్ ఘాడ్, చంచల్గూడ, మలక్పేట, మూసారాంబాగ్, మలక్పేట గంజ్, దుర్గానగర్, మలక్పేట బీ బ్లాక్, తీగలగూడ 33/11కేవీ ఉపకేంద్రాలలో సాంకేతిక ఇబ్బందులపై అధికారులు సరైన దృష్టి సారించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమస్యలతో సతమతం
విద్యుత్ సరఫరాకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం కలుగడంలేదు. చిన్న చిన్న సమస్యలతో సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ లైన్లు దూరంగా ఉండటం, తీగల వేలాడడం, అవసరం మేరకు ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీధి దీపాలకు ఆన్, ఆఫ్ విధానం సక్రమంగా లేకపోవడంతో నిరంతరం వెలుగుతూ వందల యూనిట్ల విద్యుత్ వృథా అవుతుంది. పలు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏ, బీ స్విచ్లు ఏర్పాటు చేయకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినా దాని చుట్టూ రక్షణ కవచాలు లేకపోవడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాలలో వినియోగానికి మించి కనెక్షన్లు ఉండటంతో సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ప్రజలు వాపోతున్నారు.
మంద గమనంలో 220/33 కేవీ పనులు
నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. చంచల్గూడ ప్రింటింగ్ప్రెస్ స్థలంలో 220/33 ఉప కేంద్రనిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఇమ్లిబన్, 220/33 ఉప కేంద్రాల ద్వారా మలక్పేట నియోజకవర్గంలోని 33/11కేవీ ఉపకేంద్రాలకు సరఫరా అవుతుంది. తాజా నిర్మాణంతో అస్మాన్ఘాడ్ పరిధిలోని 33/11 కేవీ ఉపకేంద్రాలకు మెరుగైన విద్యుత్ సరఫరా కొనసాగే అవకాశాలున్నాయి. ఇది పూర్తయితే నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలున్నా పనులు మాత్రం మందగమనంగా సాగుతున్నాయి. నియోజకవర్గం పరిధిలో ఉన్న 8 ఉపకేంద్ర పరిధిలో సుమారు 50 11కేవీ ఫీడర్లున్నాయి. వీటి నిర్వాహణ బాధ్యతలు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయి. అనుభవజ్ఞులైన సిబ్బంది, ప్రమాదాలకు గురికావడం, ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అవగాహన రాహిత్యం కారణంగా పలుమార్లు మరమ్మతులలో కాలయాపనలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది తగినంత అవగాహన కల్పించి పనులు చేయించడంలోనే అధికారులు తరుచూ విఫలమవుతున్నారు. దీంతో సరఫరాలో ఆటంకాలు నెలకొంటున్నాయి. సాంకేతికంగా నెలకొంటున్న ఇబ్బందులపై తక్షణ చర్యలు చేపడితే విద్యుత్ ఇబ్బందుల నుండి గట్టెక్కె అవకాశాలున్నాయని వినియోగదారులు సూచిస్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో వెచి చూడాలి.