Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థాగతంగా బలం లేకపోవడమే కారణం
- పనిచేయని బీసీ కార్డు
నవతెలంగాణ-ఎల్బీనగర్
రాష్ట్రవ్యాప్తంగా కారు గాలి వీచినా ఎల్బీనగర్లో కారు బోల్తా పడింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్లోని 11 డివిజన్లలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు విజయం సాధించి సంచలనం సృష్టించారు. కాని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి ఓటమిని చవిచూసింది. 2009లో ఏర్పడిన ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా దేవిరెడ్డి సుధీర్రెడ్డి విజయం సాధించాడు. 2014 ఎన్నికల్లో ఆర్.కృష్ణయ్య టీడీపీ తరపున విజయం సాధించాడు. 2018 ఎన్నికల్లో తిరిగి రెండోసారి సుధీర్రెడ్డి 17 వేల ఓట్లతో విజయకేతనం ఎగురవేశారు. రెండుసార్లు టీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్ని కల్లో వరుసగా టీఆర్ఎస్ ఓటమి పాలైంది. టీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతంగా లేకపోవడంతోనే టీఆర్ఎస్ ఓటమికి దారి తీసింది. ఎన్నికల్లో సారు-కారు నినాదంతోనే ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలనే ఎజెండాగా తీసుకొని ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆకట్టుకోవడంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పవనాలు వీచినా ఎల్బీనగర్లో పవనాలు వీయకపోవడం టీఆర్ఎస్ అభిమానులకు మింగుడు పడడం లేదు. కొన్ని డివిజన్లలో టీఆర్ఎస్కు భారీగా మెజార్టీ వస్తుందని ఆశించి భంగపడ్డారు. ఎల్బీనగర్లో బీసీ కార్డు పని చేస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. బీసీ కార్డు ఎన్నికల్లో ఏమాత్రం పని చేయలేదు. ప్రజలు సుపరిపాలనకే పట్టం గట్టారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకొని ప్రజలకు దగ్గరకావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో విజయం సాధించిన సుధీర్రెడ్డి బలమైన నాయకునిగా ఎదిగాడు. కాంగ్రెస్ను మరింత బలోపేతం కావడానికి దారులు సుగమయ్యాయి. ఎల్బీనగర్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుధీర్రెడ్డి అభివృద్ధే తన ఎజెండాగా చేసుకొని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగనున్నట్టు తెలుస్తుంది. తన విజయాన్ని ప్రజల విజయంగా సుధీర్రెడ్డి అభివర్ణించారు. ఎల్బీనగర్ కాంగ్రెస్కు కంచుకోటగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.