Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా ట్రయల్ రన్స్ దశలోనే..!
- అందని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్
- సాంకేతిక కారణాలు, ఎన్నికల ఎఫెక్ట్తో ఆలస్యం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైటెక్సిటీ మార్గంలో మెట్రో సేవలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సాధారణ ప్రజలు మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ రూట్లో మెట్రో సేవలను డిసెంబర్ 15నాటికి అందుబాటు లోకి తేవాలని ఇప్పటికే గవర్నర్ నరసింహన్ అధికారులకు డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సాంకేతిక కారణాలకు తోడు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రభావం మెట్రోపై పడింది. దీంతో మెట్రో పనుల్లో జాప్యం ఏర్పడింది. ఇటీవల ఈ మార్గంలో మెట్రో ట్రయల్ రన్ను అధికారులు ప్రారంభిం చారు. 10 రోజులుగా ఈ ట్రయల్ రన్స్ జరగుతున్నాయి. మరో 15-20 రోజుల పాటు ట్రయల్ రన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమీర్పేట్-హైటెక్సిటీ(11 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు మరికొంత సమయం పట్టనుందని తెలుస్తోంది.
అమీర్పేట్-హైటెక్సిటీ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 15నాటికి ఈ రూట్లో మెట్రో సేవలను ప్రారంభించాలని సెప్టెంబర్ 24న అమీర్పేట్-ఎల్బీనగర్ మెట్రో ప్రారంభోత్సవంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మెట్రో అధికారులకు డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. గవర్నర్ డెడ్లైన్ నేటితో ముగిసింది. ఈ మార్గంలో మెట్రో సేవలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఈ మార్గంలో మెట్రో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రయల్స్ రన్లో భాగంగా ఈ రూట్లో మొత్తం 18 రకాల పరీక్షలు చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తయిన అనంతరం రైల్వే మంత్రిత్వశాఖ నుంచి కమిషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ భద్రత ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ సేఫ్టీ సర్టిఫికెట్ అందిన తర్వాతే మెట్రో రైళ్ల వాణిజ్య సేవలను ప్రారంభించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను డిసెంబర్ లేదా జనవరి మొదటివారంలో అందుబాటులోకి తీసుకోచ్చేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మార్గంలో మెట్రో పట్టాలెక్కిన పక్షంలో రోజూ సుమారు లక్షన్నర మంది నాగోలు-హైటెక్సిటీ(28) రూట్లో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే నాగోల్-అమీర్పేట్(17కి.మీ) మార్గంలో నిత్యం 60-70వేల మంది ప్రయాణిస్తున్నారు. ఇక ఎల్బీనగర్-మియాపూర్(29 కి.మీ) మార్గంలో నిత్యం సరాసరి 2లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. కారిడార్-3లోని నాగోల్-హైటెక్సిటీ రూట్లో మెట్రో సేవలు పూర్తిస్థాయిలోకి వస్తే.. నిత్యం మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య సుమారు 3.5-4 లక్షల మందికి చేరవచ్చునని అంచనా.
ట్విన్ సింగిల్ లైన్ విధానంలో మెట్రో రాకపోకలు..
అమీర్పేట్-హైటెక్సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకోచ్చేందుకు మెట్రో, ఎల్అండ్టీ అధికారులు అనేక సవాళ్లు అధిగమించి, ఎట్టకేలకు మెట్రో ట్రయల్ రన్ దిశగా అడుగులు వేశారు. దీనికి గవర్నర్ డెడ్లైన్ అదనం. 10 రోజులుగా ఈ రూట్లో మెట్రో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ మార్గంలో రివర్సల్ ట్రాక్ పనుల్లో జాప్యం కారణంగా మెట్రో పనులు ఆలస్యమయ్యాయి. దీంతో అధికారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఇందులో భాగంగా హైటెక్సిటీ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల కోసం ట్విన్ సింగిల్ లైన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అమీర్పేట నుంచి హైటెక్సిటీ వరకు ఒకే రైలు వచ్చి మళ్లీ తిరిగి అదే ట్రాక్పై వెళుతుంది. రెండో ట్రాక్పైనా ఇలాగే మెట్రో రైలు వచ్చి వెళ్తుంది. ఇలా ఏక కాలంలో రెండు ట్రాక్లపై మెట్రో రైళ్ల రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ట్రయల్స్ రన్స్ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల అనంతరం కమిషనర్ ఆఫ్ రైల్వే సేప్టీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయితే గాని ఈ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.