Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలంటూ టీఆర్ఎస్ నాయకుల డిమాండ్
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు టీఆర్ఎస్లో 'కారు' చిచ్చును రగిలించింది. నాయకుల మధ్య కుమ్ములాటలు నెలకొన్నాయి. టీఆర్ఎస్ ఓటమిని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కార్పొరేటర్లు టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయకుండా కాంగ్రెస్కు పరోక్షంగా మద్దతు ఇచ్చారని డివిజన్ స్థాయి నాయకులు వాపోతున్నారు. కాంగ్రెస్కు అమ్ముడు పోయిన కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీనగర్లో కారు చిచ్చు వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొంత మంది కార్పొరేటర్లు కాంగ్రెస్కు ఓట్లు వేయించారని కార్పొరేటర్లందరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్బీనగర్ ఎస్సీ సెల్ చైర్మన్ జోగురాములు డిమాండ్ చేశారు. శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని రాజీవ్గాంధీనగర్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్గౌడ్ ఓటమి వెనుక వెన్నుపోటుదారులున్నారని, వారందరి భరతం పట్టాల్సిందేనన్నారు. ఎల్బీనగర్లో ఓ బీసీ నాయకుడిని కావాలనే కార్పొరేటర్లందరూ కలిసి ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 మంది కార్పొరేటర్లు ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని రామ్మోహన్గౌడ్ను ఓడించడానికి తీర్మాణించినట్టు తెలిపారు. ఎక్కడ కూడా కార్పొరేటర్లు కారు గుర్తుకు ఓటు వేయమని చెప్పలేదని వాపోయారు. ఓ కార్పొరేటర్ టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆడియో టేపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నట్టు తెలిపారు. రామ్మోహన్గౌడ్ ఎమ్మెల్యేగా గెలిస్తే తమ పప్పులు ఉడకవని, అమ్ముడు పోయి ఓడించారని ఘాటుగా విమర్శించారు. జనిగె విష్ణువర్ధన్ మాట్లాడుతూ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్ పల్లెపాక యాదగిరి మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి వెనుక ఉన్న కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలని కోరారు. హస్తినాపురం డివిజన్ నాయకులు బాలం ఈశ్వర్ మాట్లాడుతూ కార్పొరేటర్ పద్మానాయక్ రామ్మోహన్గౌడ్ గెలుపు కోసం పని చేయకుండా ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్రెడ్డి కోసం ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. హస్తినాపురంలో అనేక మంది ఇండ్లకు తాళాలు వేసి గ్రామాలకు తరలివెళ్లిపోయారని, పద్మానాయక్ పని చేయలేదని వాపొయ్యారు. చంపాపేట డివిజన్ టీఆర్ఎస్ నాయకులు రాఘవాచారి మాట్లాడుతూ కార్పొరేటర్ల అవినీతి అక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకెళ్తామన్నారు. కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలన్నారు. జిల్లా రాజశేఖర్రెడ్డి, సామ తిరుమలరెడ్డి, పద్మానాయక్లు టీఆర్ఎస్ గెలుపు కోసం పని చేయలేదని తెలిపారు. లింగోజిగూడ టీఆర్ఎస్ నాయకులు కందికంటి శ్రీధర్గౌడ్ మాట్లాడుతూ స్థానికేతరుడైనా ముద్రబోయిన శ్రీనివాసరావును కార్పొరేటర్గా గెలిపించామని గుర్తు చేశారు. శ్రీనివాసరావు ఎక్కడ కూడ కారు గుర్తు ఓటు వేయమని చెప్పలేదన్నారు. సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హస్తినాపురం టీఆర్ఎస్ నాయకుడు యాదయ్యగౌడ్ మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం పనిచేయని కార్పొరేటర్ను సస్పెండ్ చేయాలని కోరారు. కార్పొరేటర్లు సామ తిరుమలరెడ్డి, జిట్టా రాజశేఖర్రెడ్డి, సాగర్రెడ్డి, పద్మానాయక్, ముద్రబోయిన శ్రీనివాసరావు, భవానిప్రవీణ్కుమార్, సామ రమణారెడ్డిలను సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు సస్పెండ్ చేయకపోతే ప్రజల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. రామ్మోహన్గౌడ్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో ఎం.డీ. మోహిన్, ఎం.డీ. జానిమియా, సురేష్నాయక్, వసీన్భాయి, బాలు నాయక్, శ్రావణ్గుప్త, సీతారాంనాయక్, ఆనంద్కుమార్, తన్నీరు కళాపూర్ణ, రాఖీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.