Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు జీఎం జాన్థామస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను సమయపాలనతో నడిపినందుకు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్ రైల్వే అధికారులు, సిబ్బందిని అభినందించారు. జోన్లోని అన్ని స్టేషన్ల నుండి అధికారులు సమయపాలనతో రైళ్లు నడపడం వల్ల సంక్రాంతి పండగకు దాదాపు 4.49 లక్షల మంది ప్రయాణికులు సువిధ, జనసాధారణ్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ తదితర రైళ్లల్లో తమ సొంతూళ్లకు వెళ్లారన్నారు. అధికారులు, సిబ్బంది సమయస్పూర్తి, సమిష్టి కృషి, పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షించడం, సమయపాలనతో రైళ్లు నడపడం, ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేయడం వల్ల దక్షిణ మధ్య రైల్వేకు రూ.3.99 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. మంగళవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ఆయన సమయపాలన, శుభ్రత విషయాలపై జోన్లోని రైల్వే ఉన్నతాధికారులు, డీఆర్ఎంలతో జాన్ థామస్ సమీక్షించారు.
పండగ సీజన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడతో పాటు మిగితా మేజర్ స్టేషన్లలో ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు, ఇతర అవసరాల కోసం కోచుల్లో నీళ్లు నింపడం కోసం గతంలో ఎక్కడ పడితే నీళ్లు నింపేందుకు రైళ్లను గంటల తరబడి నిలిపేవారు. ప్రస్తుతం మేజర్ రైల్వే స్టేషన్లలో క్విక్ వాటరింగ్ సిష్టమ్ను ఏర్పాటు చేయడం వల్ల కొంత వరకు సమస్య తీరిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు అవసరైన స్టేషన్లలో క్విక్ వాటరింగ్ సిష్టమ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన డీఆర్ఎంలకు సూచించారు. క్విక్ వాటరింగ్ సిష్టమ్ను ప్రవేశపెట్టడం ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే కోచ్లకు స్వచ్ఛమైన నీటిని పంపింగ్ చేయవచ్చన్నారు. దీని ద్వారా రైళ్లు నిలుపుదల సమయం తగ్గించవచ్చన్నారు. రైళ్ల కోచ్ల్లో పరిశుభ్రతపై సమీక్షిస్తూ ఆన్బోర్డ్ హౌస్ కీపింగ్కి సంబంధించిన శుభ్రత పనులను పర్యవేక్షించి తనఖీలు నిర్వహించి ఉన్నత ప్రమాణాలు సాధించాలని సూచించారు. భద్రతను సంబంధించిన బ్రేక్ బైండింగ్, హాల్ యాక్సిల్, యార్డుల్లో రైళ్లు పట్టాలు తప్పే సమస్యలపై సమీక్షిస్తూ ప్రయాణికుల ఆకాంక్షల మేరకు ముందస్తు ప్రణాళికలతో సరుకు రవాణాలో ప్రగతి సాధించాలని సలహా ఇచ్చారు.