Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేశ్
- కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే కార్మికులకు అన్యాయం : సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ- ముషీరాబాద్
రెడ్హిల్స్ సెంట్రల్ వాటర్ కమిషన్లో తొలగించిన సీడబ్ల్యూసీ మహిళా కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరా పార్కు వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ... 12 ఏండ్లుగా పనిచేస్తున్న పదిమంది మహిళా కార్మికులను కుట్రపూరితంగానే తొలగించిందన్నారు. పాతవారిని తీసేసి ఆ పోస్టులను రూ.లక్షలకు అమ్ముకునేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి తిరిగి వారికి ఉపాధి కల్పించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా సీడబ్ల్యూసీలోనే కార్మిక చట్టాలు అమలు కావడం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్ మారితే.. కార్మికులను మార్చాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు.
కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ పాలనలోనే ఉన్న ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి కార్మికులకు ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కార్మికులను తొలగించటం చట్ట విరుద్ధమని, తక్షణమే వారిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉండి పోరాడుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సి.మల్లేష్, కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు.