Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.700 కోట్ల నిధులు మంజూరు
-రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ - ఏఎస్రావునగర్
రాష్ట్రంలో పోలీసు విభాగాన్ని పటిష్ఠ చేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధగా రూ. 700కోట్ల నిధులను మంజూరు చేయనున్నామని రాష్ట్ర హోంమంత్రి మహామూద్ అలీ తెలిపారు. శుక్రవారం సాయంత్రం చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహిస్తున్న ప్రిజన్స్ స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో 50 శాతం క్రైం రేటు తగ్గిందని అన్నారు. నగర వ్యాప్తంగా 2 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు, అల్లర్లు జరగడం లేదన్నారు. ప్రజలు సంతోషంగా జీవించేందుకు పోలీసు వ్యవస్థను మార్చినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జైల్లలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుల ద్వారా రూ.17 కోట్ల ఆదాయం వస్తుందని వివరించారు. వివిధ జైల్లల్లో వంద పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా మరో పదివేల మంది ఖైదీలకు ఉపాధి కల్పించనున్నామని పేర్కొన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించి, ఫలితాలను సాధిస్తున్నామని అన్నారు. ఖైధీల్లో మానసిక, శారీరకంగా ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్ధేశంతో క్రీడాపోటీలు నిర్వహించామన్నారు. క్రీడా పోటీలతో పాటు వ్యాయమంలో కూడా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. జైళ్ల అధికారుల పనితీరుతో దేశంలోనే తెలంగాణ జైలు శాఖ మంచి గుర్తింపు పొందిందన్నారు.క్షమాబిక్ష ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నందున, అది రాగానే వివిధ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో 400ల కోట్లతో పోలీస్ కంట్రోల్ టవర్ నిర్మిస్తున్నామన్నారు. ఈ క్రీడా పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జైళ్ళ శాఖ డీజీ వీకే.సింగ్, డీఐజీ ఆకుల నర్సింహ, సైదయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, సూపరిండెంట్ లు ఎంఆర్ భాస్కర్, రాజేష్, మురళీబాబు, కీసర ఆర్డీఓ లచ్చిరెడ్డి, ఎంఆర్ఓ నాగరాజు, ఏఎస్రావునగర్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి, డిప్యూటీ సూపరిండెంట్లు దశరథం, పాల్గొన్నారు.