Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్
- లోక్సభకు కొనసాగుతున్న నామినేషన్లు
నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి
జిల్లాలో ఈ వారం పూర్తిస్థాయిలో ఎన్నికల మయ మైంది. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అదే సమయంలో మరోవైపు లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఒకే సమయంలో నిర్వహిస్తున్న రెండు రకాల ఎన్నికల నేపథ్యంలో అధికారులు తమ ఏర్పాట్లలో తాము ఉన్నారు. నాయకులు మాత్రం కాలికిబట్టకట్టకుండా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా రకరకాల ఎన్నికలతో ఓటర్లకు ఆయోమయం ఏర్పడింది.
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ, పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఉపాధ్యాయులకు సంబంధించి 83.54 శాతం, పట్టభద్రుల నియోజకవర్గంలో 59.3 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ నియోజవకర్గానికి సంబంధించి టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఈ క్రమంలో మరోమారు పోటీలోకి దిగిన ప్రస్తుత ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి తానే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నారు.
పార్టీ శ్రేణులు మాత్రం రఘోత్తంరెడ్డికి మద్దతు పలికాయి. పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీలోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కిసాన్మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్కు చెందిన సుగుణాకర్రావు తానే బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగినట్టు చెప్పుకున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాకు చెందిన రణజిత్మోహన్ సైతం బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ బలపర్చిన మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ మద్దతుతో రాష్ట్ర గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్ పోటీపడ్డారు. పోలింగ్ పూర్తైన నేపథ్యంలో 26న వెలువడనున్న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు లోక్సభ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ వినోద్కుమార్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్లు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా బండి సంజరు పోటీపడుతున్నారు. నామినేషన్ల పర్వం ఈ నెల 25తో ముగుస్తున్న నేపథ్యంలో ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే భారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులపై వేశారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన మంత్రి ఈటల రాజేందర్ ఆ భారాన్ని తన భుజాన వేసుకున్నారు. ఎంపీ, మంత్రి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో పర్యటిస్తున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమ వంతు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
వివేక్ దారెటు
పెద్దపల్లి ఎంపీ స్థానానికి మాజీ ఎంపీ వివేక్కు టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామానికి ఆయన ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందుగా ఆయన కొనసాగుతున్న ప్రభుత్వ సలహాదారు పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. పార్టీకి సైతం శనివారం రాజీనామా చేయడంతో పాటు ఆయన అనువాయులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన మరోపార్టీ నుంచి పోటీచేస్తారా లేక స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతారా అనేది తేలాల్సి ఉంది.