Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగ సభలో సీపీఐ(ఎం) హైదరాబాద్ జిల్లా సౌత్ కమిటీ కార్యవర్గ సభ్యులు విఠల్
నవతెలంగాణ - ధూల్పేట్
దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) హైదరాబాద్ జిల్లా సౌత్ కమిటీ కార్యవర్గ సభ్యులు జి.విఠల్ అన్నారు. సుందరయ్య 34వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) కార్వాన్ డివిజన్ కమిటీ అధ్వర్యంలో గుడిమల్కాపూర్ సాయినగర్ బస్తీలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పుచ్చలపల్లి సుందరయ్య ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర సమర యోధుడన్నారు. కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడన్నారు. కులవ్యవస్థను నిరసించిన ఆయన సుందరరామిరెడ్డిగా ఉన్న అయన పేరులో రెడ్డి అనే కులసూచికను తొలగించుకున్నాడని గుర్తు చేశారు. ఆయన తన జీవితాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు అంకితం చేశారని చెప్పారు. నేటి రాజకీయ నాయకులు ప్రజా సేవ చేసేందుకు ఆయన జీవిత విశేషాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన పోరాటాలను గుర్తు చేస్తూ ప్రజా నాట్యమండలి కళాకారుల కళారూపాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్వాన్ జోన్ నాయకులు యాదన్న, కళాకారులు కళ్యాణ్, గోపాల్, సౌందర్య తదితరులు పాల్గొన్నారు.