Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర ఉత్కంఠలో అభ్యర్థులు, నేతలు
- మల్కాజ్గిరి పార్లమెంట్ లెక్కింపు కోసం అధికారుల ఏర్పాట్లు
- గెలుపు ధీమాతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ మొదలైంది. గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నడుమ ప్రధాన పోటీ ఉంటుందని తోలుత భావించినప్పటికీ పోలింగ్ తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమే ద్విముఖ పోటీ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మేడ్చల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు సవాల్గా మారనున్నాయి. జిల్లాలోని ఎమ్మెల్యేలు గెలుపు భారాన్ని తమ భుజస్కందాలపై వేసుకున్నారు. అసెంబ్లీ మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలనూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి రాంచందర్ రావులు పోటీలో ఉన్నారు. ప్రచారాలు హోరా హోరీగా నిర్వహించినప్పటికీి ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారో రేపు తెలియనున్నది.
కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో అధికారులు నిమగమయ్యారు. కీసర మండలం, భోగారం గ్రామంలోని హోళీమేరి కళాశాలలో స్ట్రాంగ్రూమ్ల్లో ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
పెరుగుతున్న ఉత్కంఠ
కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ పెరుగుతోంది. మల్కాజ్గిరి పార్లమెంట్ ఫలితం తిలకించేందుకు ప్రధాన పార్టీల నేతలు భోగారంలోని హాోళీమేరీ కళాశాలలో జరిగే కౌంటింగ్ను తిలకించేందుకు ఆయా పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.
కౌంటింగ్కు సర్వం సిద్ధం: మేడ్చల్ కలెక్టర్
మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం చేసినట్టు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి తెలిపారు. హోళీమేరి కళాశాలలో భద్రపరిచిన ఈవీఎం, వీవీప్యాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్తో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి, ఎల్.బీ.నగర్, సికింద్రాబాద్ (కంటోన్మెంట్) ల పరిధిలో సూమారు 32 లక్షల ఓటర్లుండగా 15 లక్షల 60 వేల 108 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. 7 సెగ్మెంట్లకు గాను 2960 పోలింగ్ స్టేషన్లున్నాయన్నారు. 196 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ వద్ద 2000 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల అధికారులకు, పోలింగ్ ఎజెంట్లకు, పోటీచేసిన అభ్యర్థులకు తాగునీటి సౌకర్యం, ఎండ వేడి లేకుండా షామియానాలు తదితర ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు ఎన్నికల అధికారులు, ఎజెంట్లు కౌెంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతమంతా 1000 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ను విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని సూచించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు పక్కాగా ఉన్నాయన్నారు. భద్రత నిమిత్తం సూమారు 1000 మంది పోలీసులు విధులు నిర్వాహిస్తున్నారన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వాహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో మధుకర్ రెడ్డి, కీసర ఆర్డీవో లచ్చిరెడ్డి, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.