Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్రావు
నవతెలంగాణ - రాజేంద్రనగర్
రెతులకు నాణ్యమైన విత్తనాలందించి, వారి దిగుబడులు పెంపొందించాలనే లక్ష్యంతోనే రేపటి నుంచి విత్తనమేళాలు నిర్వహిస్తున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ వీ.ప్రవీణ్రావు తెలిపారు. రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయం ఆవరణలో ఈ మేళాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. నాగర్కర్నూలు జిల్లా పాలెం, వరంగల్, జగిత్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కార్యాలయ ఆవరణ ల్లోనూ విత్తనమేళాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ మేళాల్లో కొనుగోలు చేసే విత్తనాలకు ప్రభుత్వం అందించే విత్తన రాయితీ వర్తిస్తుందని తెలిపారు. రాయితీ పొందగోరు రైతులు పట్టదారు పాస్ పుస్తకం, జిరాక్స్ కాపీ తప్పకుండా తమవెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ విత్తనమేళాల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనాల్ని అందించడంతోపాటు వాటి గుణ గణాలను, నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా అందించడానికి వీలుగా సుమారు 24 స్టాళ్ల ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు మేలైన యాజమాన్య పద్ధ్దతులు, పంట ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచుకోవడానికి సంబంధించిన సూచనలు ఇవ్వడానికి చర్చాగోష్టులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాలు, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనుబంధ సంస్థలైన భారతీయ వరి పరిశోధన సంస్థ, భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ, భారతీయ చిరుధన్యాల పరిశోధన సంస్థలు సంయుక్తంగా ఈ విత్తనమేళాల్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు.