Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
మానవుడు ఎదిగే పరిణామ క్రమంలో చక్రం పుట్టింది. ఆ చక్రంపైనే మట్టి పాత్రలు, కుండల తయారీ మొదలైంది. మొదట నీళ్లు నిల్వ చేసుకోవడానికి, ఆహారం ఉడకబెట్టడానికి మానవుడు వీటిని ఉపయోగించాడు. కాలక్రమేణా మట్టి పాత్రలు మనిషి జీవితంలో భాగమైపోయాయి. ప్రతి పనిలో వాటి అవసరం ఏర్పడింది. పని విభజనలో కుండలు తయారు చేసేవారు కుమ్మరులయ్యారు, చక్రం కాస్త కుమ్మరి చక్రం అయింది. ఆదిమ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు వాటి అవసరాల్లో మార్పొచ్చినా, ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నొచ్చినా..కనుమరుగయ్యే దశలోనూ కాలంతో అస్థిత్వ పోరాటం చేస్తున్న కుమ్మరి చక్రం, కుమ్మరుల కులవృత్తి గురించి ఈ వారం రీతి శీర్షికలో తెలుసుకుందాం..
మట్టి కుండలు, పాత్రలు మానవుని దైనందిన జీవితంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆహారం వండుకోవడానికి, నీటి నిల్వకు, దీపాలు వెలిగించడానికి, దైవ కార్యాలకు, శుభకార్యాలకు, గౌడ కులస్తులకు కల్లు తీయడానికి, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి పనిలో వీటి అవసరం విస్మరించలేనిది. మట్టి పాత్రల్లో వండుకున్న వంటకాలేవైనా ఎంతో రుచిగా ఉండేవి. వీటిల్లో కాగబెట్టిన పాలు, పెరుగుల రుచి గురించి ముందు తరంవాళ్లు ఎంతో గొప్పగా చెబుతుంటారు. జాతర్లలో బోనాలకు, పెండ్లిళ్లలో అరివేణి కుండలకు..ఇలా ఒక్కటేమిటి ఎన్నో విధాలుగా నిత్య జీవితంలో మన అవసరాలెన్నో తీర్చాయి.
పూర్వం గ్రామాల్లో కుమ్మరుల స్థితిగతులు..
మూడు దశాబ్దాల క్రితం వరకు తమ కుల వృత్తిని నమ్ముకొని జీవించే కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఊరి చెరువుల కింద శిఖం భూముల్లో మట్టిని తెచ్చుకుని, రెండు మూడు రోజులు బాగా నానబెట్టిన తర్వాత సదరు మట్టిని మెత్తగా తొక్కి చక్రంపైన వేసి కుండలు, నీటి తొట్లు, కూజాలు, దీపాంతలు, గళ్లగురిగిలు, కల్లు ముంతలు, ఇంటి పైకప్పుకు ఉపయోగించే గూన పెంకులు, ధాన్యం నిల్వ చేసుకునే పెద్ద పెద్ద గావులు సైతం తయారు చేసేవారు. గ్రామదేవతల పూజల్లో, శుభకార్యాల్లోనూ కుమ్మరులకు మొదట ప్రాముఖ్యతనిచ్చేవారు. ఊరంతటికీ వీరు తలలో నాలుకలా మెలిగేవారు.
బహుళజాతి కంపెనీల రాకతో..
ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న గరిట నుంచి పెద్ద నీటి ట్యాంకుల వరకు ప్లాస్టిక్ వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధి అవకాశాలు కోల్పోయి కూలీలుగా మారారు. కాస్తో కూస్తో చదుకున్నవారు చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అక్కడక్కడా ఈ వృత్తిని కొనసాగిస్తున్న అతి కొద్దిమంది భారంగా బతుకీడుస్తున్నారు. తాతల తండ్రుల నుంచి బతికిస్తున్న వృత్తిని వదిలేయలేక, మరో ఉపాధి మార్గం కనిపించక తల్లడిల్లుతున్నారు. ఇంతదాకా ఎందుకు ? కుండల తయారీకి ముడి సరుకైన బంకమట్టే దొరకడం లేదు. పూర్వం కుమ్మరులకు మట్టి కోసం కేటాయించిన చెరువులు, కుంటలు కనుమరుగైపోయాయి. ఉన్నవాటిల్లో మట్టి తీసేందుకు అనుమతి ఇవ్వటం లేదు. కుల వృత్తులకు అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతోన్న ప్రభుత్వాలు..కుండల తయారీతో సమాజంలో తమదైన ముద్రవేసిన కుమ్మరులను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు. కనబడటం లేదు. ఇప్పటికైనా కనుమరుగవుతున్న కుమ్మరి వృత్తికి పునరుజ్జీవం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కుమ్మరులు కోరుతున్నారు.
కులవృత్తే ఆధారం
తన ఇద్దరు కొడుకులతో సహా అందరం ఈ వృత్తి లోనే కొనసాగుతు న్నాం. రెండో కొడు కు రామకృష్ణ కరెంట్ యంత్రం ద్వారా మట్టితో కూజాలు తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం కుండల తయారీకి మట్టి దొరకడం లేదు. పాత్రల తయారీకి బంక మట్టి మాత్రమే అణువైనది. కానీ అటువంటి మట్టి ఇప్పుడు శంషాబాద్ దాటిన తరువాత గానీ దొరకడం లేదు. అక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకుచ్చేందుకు రూ. 8 వేల వరకు ఖర్చవుతున్నది.
-నర్సింహ, కుండల తయారీదారుడు, బౌరంపేట
అక్కడే మట్టి దొరుకుతుంది
చిన్నతనం నుంచి కుల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాము. మా నియోజక వర్గంలో సూరా రం పంతులు చెరువులో మాత్రమే అణువైన మట్టి దొరుకుతోంది. కానీ ఆ గ్రామస్తులు మట్టిని తీసుకు రానివ్వడం లేదు. దూరప్రాంతం నుంచి కొనుగోలు చేస్తే 1 డీసీఎంకు 12 వేల నుంచి 14 వేలు ఖర్చవుతోంది. ఇప్పటి వరకు కలెక్టర్తో సహా అందరికీ మట్టి కోసం వినతి పత్రం అందించాం. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆలోచించాం
-నరహరి, పాత్రల తయారీదారుడు
ఉద్యోగాల్లేక మళ్లీ వృత్తిలోకి
నేను పాలిటెక్నిక్ పూర్తి చేసాను. ఉద్యోగం దొరక్కపోవడంతో మా తాతల నుంచి వస్తున్న కుల వృత్తిని నేర్చు కున్నాను. కరెంటు యంత్రం ద్వారా నా చేతి నైపుణ్యంతో మట్టి పాత్రలు చేసి కుటుంబానికి అండగా ఉంటున్నాను. మట్టి సమస్య మాకు అడ్డంకిగా మారుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని మట్టి అందించే చర్యలు చేపట్టి, కుల వృత్తిని బతికించాలి.
-నరేష్, కుండల తయారీదారుడు