Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
స్టేట్ హోంలోని శిశువిహార్లో పనిచేస్తున్న 120 మంది ఆయాలకు చెల్లించాల్సిన మూడు నెలల ఓటీ వేతనాలను వెంటనే ఇవ్వాలని బుధవారం శిశువిహార్ ఎదుట సిబ్బంది ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు శిశువిహార్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఆయాలకు ఓవర్టైం వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. చాలిచాలనీ జీతాలతో అనాధ పిల్లలకుసేవలు చేస్తూ, సిబ్బంది కొరతతో ఓవర్ టైం డ్యూటీలు చేస్తే వారి పొట్టకొట్టడం అన్యాయమన్నారు. ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు వేల వరకు ఓవర్ టైం వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం ఇబ్బందికి గురిచేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాన డిమాండ్లతో కూడిన బ్యానర్ను పట్టుకొని ఆయాలు నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరికీ రూ.18 వేల కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. తమ సమస్యలన్నింటిపై స్థానిక ఆర్జేడీ అధికారి లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ ధర్నా చేస్తే ఉపయోగం లేదని, కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్లి ధర్నా చేసి మీ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రమణ, శిశువిహార్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తార, ప్రధాన కార్యదర్శి సుజాత, లక్ష్మీ బాయి, 120 మంది ఆయాలు ధర్నాలో పాల్గొన్నారు.