Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
- మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరువేల మందితో భద్రత కట్టుదిట్టం
నవతెలంగాణ - సిటీబ్యూరో
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కౌటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరు వేల మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. నేటి ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. మూడు కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకూ 144 సెక్షన్ విధించారు. ప్రదర్శనలు, ఊరేగింపులు, బాణసంచా కాల్చటం, రంగులు చల్లుకోవడం, మద్యం విక్రయాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లరాదు. అదనపు బలగాలతోపాటు ఫ్లై స్వ్కాడ్స్, షీ బృందాలను రంగంలోకి దించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లల కదలికలపై ప్రత్యేక నిఘాను ఉంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును ముమ్మరం చేశారు. కింది స్థాయి అధికారి నుంచి అదనపు సీపీ స్థాయి అధికారి వరకు బందోబస్తులో పాల్గొని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. చిన్నపాటి గొడవ జరిగినా క్షణాల్లో పోలీసులు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రా వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి, ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పూర్తింగా చెకింగ్ చేసిన అనంతరమే పోలీసులు లోనికి అనుమతిస్తారు. వదంతును సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మూడు కమిషనరేట్ల కమిషనర్లు అంజనీకుమార్, మహేష్భగవత్, సజ్జనార్ హెచ్చరించారు. ఏ ప్రాంతంలోనైనా చిన్నపాటి గొడవ జరిగినా వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ప్రజలను కోరారు.