Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటాపోటీగా కార్మిక సంఘాల ధర్నాలు
- ఉలుకు, పలుకు లేని ప్రభుత్వం
- ఏపీ నివేదిక తర్వాత స్పందించనున్నట్టు ప్రచారం
- రానున్న రోజుల్లో ఉధృతం కానున్న ఉద్యమాలు
- విలీనం అంశం ఎజెండాగా పోరాటాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్తగా ఏర్పాటయిన ఏపీ ప్రభుత్వం తీసుకున్న విలీనం నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీలోని కార్మికుల్లో ఆశలు చిగురించాయి.తెలంగాణ ప్రభుత్వం పక్క రాష్ట్రం మాదిరాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనుందా.. లేక మరో కొత్త ప్రతిపాదనను ముందుకు తేనుందా అని కార్మికల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఆర్టీసీ కార్మికులే..అప్పటి ఉద్యమ నాయకులు దీన్ని కాదనలేరు కూడా...తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు అప్పటి ఉద్యమ నాయకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే గాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇప్పిస్తాననని హామీ కూడా ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఈ అంశం అటకెక్కింది. ఇటీవల ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆర్టీసీ పట్ల తీసుకున్న సానుకూల నిర్ణయంతో టీఎస్ ఆర్టీసీలో ప్రకంపనలు మొదలయ్యాయి.
కార్మికుల్లో నూతనోత్సాహం..
నిన్నటి వరకు ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియ ఉత్తేజాన్ని నింపింది. నూతన శక్తిని కూడగట్టుకున్న కార్మికులు నేడు విలీనం కావాలని బలంగా కోరుకుంటున్నారు.దీనిపై కార్మిక సంఘాలపై కార్మికులు ఒత్తిడిని కూడా పెంచుతున్నారు.రానున్న ఎన్నికల్లో విలీనానికి కృషిచేసే సంఘానికే పూర్తి మద్దతును ఇస్తామని కార్మికులు చెబుతున్నారు.దీంతో విలీనం మరోసారి రాజకీయం కానుంది.
ప్రభుత్వం ఏం చేయబోతుంది.?
ఏపీ ప్రభుత్వం విలీనంపై ఒక ఉన్నత స్థాయి కమీటీని వేసింది.కమిటీ ఇచ్చే నివేదికను బట్టి తమ నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని ప్రకటిస్తామని చెప్పింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించనున్న నిర్ణయంపై వేచి ఉన్నట్టు సమాచారం. అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారా..లేక కొత్తగా ప్రతిపాదన చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
టీఎంయూ గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియడంతో రానున్న రోజుల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రభుత్వం తమకు అనుబంధంగా ఉన్నా గుర్తింపు సంఘాన్ని ఎన్నుకుంటేనే విలీనం చేస్తామని ప్రకటిస్తుందా.. లేక మరో నూతన ప్రతిపాదనను తెరమీదకు తెస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడున్న గుర్తింపు సంఘానికి కార్మికుల మద్దతు తగ్గిందన్న ప్రచారం కార్మిక వర్గాల్లో జోరందుకంది. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం విఫలమైందని పలువురు కార్మిక సంఘాల నాయలకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. నిజానికి గుర్తింపు సంఘం నాయకులపై కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది.దీంతో ప్రభుత్వం ఆర్టీసీకి లాభం చేకూర్చాలనే ఆలోచనలో బాగంగా ఇప్పుడున్న గుర్తింపు సంఘం నాయకుల మార్పునకు శ్రీకారం చుట్టనున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. వీటిలో నిజమెంత అన్నది తెలియాలంటే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.
పోటా పోటీగా ఉద్యమాలు
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా.. ఆర్టీసీ కార్మిక సంఘాలు నాయకులు నిరసన కార్యక్రమాలను ఉధృతం చేశారు. పోటా పోటీగా కొనసాగుతున్న ఉద్యమాల్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొంటూ తమ మద్దతును తెలుపుతున్నారు. వీటిలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజెఎంయూ), తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయూస్ యూనియన్తో పాటు టీఎంయూలు ఉన్నాయి. కార్మికులు సంఘాల నాయకులతో కలిసి డిపోల ఎదుట ధర్నాలు చేసిన, నిరసనలను తెలిపిన ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం కార్మికులను భాగస్వామ్యం చేస్తూ తమ నిరసనలను మరింత ఉధృతం చేయాలని చూస్తున్నాయి.ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదంటూ చెబుతున్నారు.