Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎటు చూసినా చెత్తకుప్పలే..
- వెదజల్లుతున్న దుర్వాసన..
- సవ్యంగా సాగని చెత్త తరలింపు
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, పాదచారులు
నవతెలంగాణ-అడిక్మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎటు చూసినా చెత్తే కనిపిస్తోంది. అంతా చెత్తయేనా.. అని అనిపిస్తోంది. ఎప్పటి నుంచో చెత్త తొలగించక పోవడంతో చెత్తకుప్పలు పేరుకు పోతున్నాయి. ప్రధాన రహదారుల వెంట చెత్త కుప్పలుగా పడి ఉంది. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్తకుండీలు సైతం చెత్తతో నిండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అడిక్మెట్ డివిజన్లోని రాంనగర్ గుండు ప్రాంతంలో చాలా చోట్ల చెత్తకుండీలలో చెత్త నిండిపోయింది. దారిపొడవునా చెత్త ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అంతే కాకుండా చెత్తకుండీల వద్ద వీధి కుక్కల గుంపులుగా చేరి ఆహారం కోసం అన్వేషిస్తూ చెత్తను చిందర వందర చేస్తున్నాయి. చెత్త కుండిల నుంచి వచ్చే దుర్వాసనతో దోమలు వ్యాప్తి చెంది తాము అనారోగ్యాల బారిన పడే ప్రమాదముందని ఆ డివిజన్ స్థానికులు చెబుతున్నారు.
స్వచ్ఛత ఏది..?
పలు ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారులతో పాటు హోటల్ షాదీఖానా నిర్వాహకులు చికెన్ వ్యాపారులు వ్యర్థాలను తెచ్చి రోడ్లపై చెత్త కుండీలలో వెస్తున్నారు. దీనితో ఆ ప్రాంతం అధ్వానంగా మారుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛభారత్ స్వచ్ఛ హైదరాబాద్ - షాన్దార్ హైదరాబాద్, స్వచ్ఛ సంరక్షణ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే పాలకులు అధికారులు కేవలం మాటలేనా.. ఆచరణలో పనులేవీ కనిపించడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనా పట్టించుకోవడం లేదంటూ ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్క్స్ భవన్ఎదురుగా గల రోడ్డు పై చెత్త చెట్ల కొమ్మల వ్యర్థాలతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చెత్త తరలించాలి
అడిక్మెట్ డివిజన్ లోని రాంనగర్ గుండు ప్రాంతంలో చెత్త కుండిలో చెత్త తరలించకపోవడ ంతో భారీ స్థాయిలో చెత్త పేరుకుపోయింది. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందెలు దుర్కుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త తరలింపు చర్యలు తీసుకోవాలి.
- శ్రీను, అడిక్మెట్ వాసి
అధికారుల నిర్లక్ష్యం..
జీహెచ్ఎంసీ అధికా రుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చెత్తను తరలించే విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. రోడ్లపై, బస్తీల్లో చెత్తను తరలించక పోవడం వలన ప్రజలు, చిన్నారులు అస్వస్థతకు గురికావాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
- కష్ణ సాయి, స్థానికుడు
అధికారులకు తెలిపాం..
డివిజన్లో చెత్త తరలింపుపై జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపాం. వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రజలు చెత్తను కేవలం కుండిలో మాత్రమే వేయాలి, రోడ్డుపై వేయొద్దు. చెత్త తరలింపుపై అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించా.
- అడిక్మెట్ డివిజన్ కార్పొరేటర్, హేమలత