Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్లమ్మబండలో నిత్యం డ్వాక్రా మహిళల వెతలు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
నిత్యం రైతులు, వ్యాపారులు, కొనుగోలు దారులతో కిటకిటలాడాల్సిన ఎల్లమ్మబండ రైతుబజారు వెలవెలబోతోంది. ఓవైపు మోడల్ మార్కెట్లు, మన కూరగాయల పేరుతో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు హంగామా చేస్తుంటే మరోవైపు 'నేతిబీరలో నెయ్యి' చందంగా రైతులు కానరాని రైతుబజార్లో డ్వాక్రా గ్రూప్, మహిళా సంఘాల స్టాళ్లు కొనుగోలుదారులు లేక నిర్మానుష్యంగా మారాయి. మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు రైతుబజార్లలో స్టాళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. అందుకు ప్రతిరోజూ ఉదయం ఇంటిపని, వంటపని ముగించుకుని ఎన్నో వ్యయప్రయాసలు పడుతూ తాజా కూరగాయలతో రైతుబజార్కు చేరి కండ్లుకాయలు కాచేలా ఎదురుచూసినా కొనేవారు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడపాదడపా అమ్మిన డబ్బులు ఖర్చులకూ సరిపోవడంలేదని పలువురు డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. ముఖ్యంగా బస్తీల్లో వారాంతపు సంతలు నెలకొల్పడంతో కొనుగోలుదారులు ఆయా సంతలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. తక్కువ ధరలకే తాజా కూరగాయలు వస్తాయనే నమ్మకంతో సాయంత్రం అయిందంటే వారాంతపు సంతలకు వెళ్తున్నారు. ఎల్లమ్మబండ పరిసర ప్రాంతాలైన ఆల్విన్ కాలనీ, తులసీనగర్, ఎన్టీఆర్నగర్ తదితర ప్రాంతాల్లోని బస్తీల్లో అమ్మకందారులు వారాంతపు సంతలు నెలకిల్పడంతో కొనుగోలు దారులు రైతుబజార్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచడంలేదు. దీంతో మహిళా సంఘాల వారు విక్రయాలు లేక తెచ్చిన కూరగాయలను తిరిగి తీసుకువెళ్లాల్సివస్తోంది. వర్షాబావ పరిస్థితుల వల్ల కూరగాయల ధరలు అమాంతం పెరిగి పోవడంతో తక్కువ ధరల్లో లభించే కూరగాయలనే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ ధరల కూరగాయలను ఎవరూ కొనుగోలు చేయక పోవడం వల్ల నిరుపయోగమై పాడవుతున్నాయి. రోజూ ఇలాంటి పరిస్థితే కొనసాగుతున్నదని వ్యాపారులు వాపోతున్నారు.
నష్టపోతున్నాం
రోజూ ఉదయం కూరగాయలు రైతుల వద్ద కొనుగోలు చేసి రైతుబజార్కు చేరుకుని వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించు కుంటున్నాం. వారాంతపు సంతలతో మాకుటుంబాలకు పూటగడవటం కష్టంగా మారుతున్నది. వినియోగదారులు రైతుబజార్లకు రాకుండా వారివద్దే కూరగాయలు కొనుగోలు చేసుకుంటున్నారు. బస్తీల్లో తమ పరిసర ప్రాంతంలో ఇండ్ల సమీపంలో ఉంటున్న కారణంగా దగ్గర సమీపంలో ఉంట్టున్నందున వారాంతపు సంతలకే వెళ్తున్నారు. మాగోడును ఏనాయకులకు చెప్పుకోవాలో తెలియడంలేదు. ఎస్టేట్ అధికారులు సైతం ఏమీ చేయలేక పోతున్నారు.
ఫుణ్యవతి, వ్యాపారి డ్వాక్రా సంఘం
సంతలను అనుమతించకూడదు
రైతు బజార్ ఉన్న ప్రాంతాల్లో వారాంతపు సంతలను పెట్టడానికి జీహెచ్ఎంసీ అను మతించకూడదు . రైతుబజార్లలో తాజా కూరగాయల ధరలు గిట్టుబాటు కావడంలేదు. లేదంటే అవి మురిగిపోతాయని భయం. వారాంతపు సంతల్లో ధరలు తక్కువగా ఉంటున్నాయనే నమ్మకంతో కూరగాయలు ఎలాఉన్నా కొనుగోలు చేస్తున్నారు. ధరలు మండుతున్న తరుణంలో ప్రజలు ఎక్కువగా ఆకుకూరలను తీసుకుంటున్నారు. మరికొందరు ఇంటి ముందుకు ఏకూరగాయల బండ్లు వస్తాయా అని చూస్తున్నారు. అధికారులు రైతుబజార్లో డ్వాక్రా మహిళల పట్ల దృష్టిసారించాలి.
- భాగ్యవతి - వ్యాపారి డ్వాక్రా సంఘం