Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
'నగర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా నేను ఎన్నికైన సమయంలో సిబ్బందిలో అనేక సమస్యలున్నాయి. వాటి పరిష్కారం కోసం అప్పటి సీపీ, ప్రస్తుత డీజీపీ మహేందర్రెడ్డి గారికి వినతి పత్రం అందిం చడం జరిగింది. వారి చొరవతో చాలా సమస్యలను పరిష్కరించు కోగలిగాం. అప్పట్లో సిబ్బంది కొరత, షిఫ్ట్ డ్యూటీలు లేక 24గంటల సమయం పోలీసులు విధుల్లో గడిపే వారు. ఆ విషయంపై కమిషనర్గారి దృష్టికి తీసుకెళ్లడంతో షిఫ్ట్ డ్యూటీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ముగ్గురు సీపీల వద్ద పనిచేశాను. ఒక్కొక్కరి ఒక్కొక్క విజన్లో ముందుకు వెళ్లారు. ప్రస్తుత సీపీ అంజనీకుమార్ గారు చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం సత్ఫాలితాలనిస్తోంది' అని హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు నల్లా శంకర్రెడ్డి నవతెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు..
మీ అధ్యక్ష్యతన సాధించిన విజయాలేంటి?
ఏదైనా సాధించాలంటే అధ్యక్షుని ఒక్కడితోనే సాధ్యంకాదు. అందరి సహకారం అవసరం. తోటి ఉద్యోగులు, మా సంఘం సభ్యుల తోపాటు ఉన్నతాధికారుల సహకారంతో ముందుకెళ్తున్నాం. గత పీఆర్సీలో సిబ్బందికి రావలసిన అడిషనల్ హెచ్ఆర్ఏ తీసేశారు. అయితే అప్పటి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిగారి దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. తిరిగి అడిషనల్ హెచ్ఆర్ఏతోపాటు సిబ్బంది ఫీడింగ్ చార్జింగ్ రూ.90 నుంచి రూ.200 రూపాయలు మంజూరు చేయించుకోగలిగాం. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అదనపు అలవెన్సులు, స్టేషన్ల నిర్వహణ ఖర్చులకు అదనంగా మంజూరు చేయించుకున్నాం. శిథిలా వస్థలో ఉన్న పోలీస్ అధికారుల సంఘం భవనాన్ని తిరిగి ఆధుణీకరించుకోగలిగాం.
ఎంత మంది కమిషనర్ల వద్ద పనిచేశారు?
నగర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా 2 జూన్ 2013న ఎన్ని కయ్యాను. అప్పటి సీపీ అనురాగ్శర్మ, ప్రస్తుత డీజీపీ, మాజీ సీపీ మహేందర్రెడ్డి గారితోపాటు శ్రీనివాస్ రావు, ప్రస్తుత
సీపీ అంజనీకుమార్ గార్ల వరకు పనిచేసిన అనుభవముంది. ఒకొక్కరు ఒక్కొక్క విజన్తో పనిచేశారు. వారి వద్ద పనిచేసిన నేను వృత్తి పరమైన క్రమశిక్షణ అలవర్చుకున్నాను.
సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వారి సహకారంతో పరిష్కరించుకో గలిగాం.
సిబ్బంది మౌలిక సదుపాయాల సంగతేంటీ?
పోలీస్ సిబ్బందికి అవసరమైన వసతులను గుర్తించి పోలీస్ స్టేషన్స్లో కావాల్సిన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయించాం. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది విధి నిర్వాహణలో చాలా ఒత్తిడికి లోనవుతుంటారు. వారు విశ్రాంతి తీసు కునేందుకు వీలుగా అన్ని సదుపాయాలతో కూడిన విశ్రాంతి గదు లను ఏర్పాటు చేయించాం.మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులను కేటాయించే విధంగా సంఘం పరంగా కృషి చేశాం.
పోలీసుల ఆరోగ్యంపై తీసుకున్న జాగ్రత్తలు?
పోలీస్ ఉద్యోగం అంటేనే అధిక సమయం విధుల్లోనే గడపాల్సి వస్తోంది. సమయానికి భోజనం, నిద్ర సాధ్యం కాదు. దాంతో చాలమంది పోలీసులకు చిన్నవయస్సులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని చెబుతూనే భద్రత విషయంలో వారికి భరోసా కల్పించేందుకు మేళా నిర్వహించి ఆరోగ్య భద్రత కార్డులను ఇప్పించగలిగాం. వాటితో పాటు పాస్పోర్టు, ఆధార్ కార్డు, 1600 మందికి డ్రైవింగ్ లైసెన్స్లను కూడా ప్రత్యేకంగా మేళాను ఏర్పాటుచేసి ఇప్పించగలిగాం. అంతేకాకుండా పోలీసులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా శారీరక మానసిక ధృడత్వం కోసం ప్రతి పోలీస్ స్టేషన్లలో ఆథునాతన జిమ్లను ఏర్పాటు చేసుకోగలిగాం. జీవో నెంబర్ 74 ప్రకారం పోలీస్ అధికారుల సంఘం పర్యవేక్షణలో హెల్త్ చెకప్ చేయించడంలో విజయం సాధించాం. ఇదిలావుండగా హైదరాబాద్ సిటీ పోలీస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ సెక్రటరీగా పనిచేసిన సమయంలో సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.3లక్షలుగా ఉన్న వ్యక్తిగత రుణాలను రూ.5లక్షలకు పెంచడం జరిగింది. రుణంపై వడ్డీ గతంలో 10శాతం ఉండగా, 8.5శాతానికి తగ్గించడంలో పోలీస్ సంఘం ప్రముఖ పాత్ర పోషించింది.
నగరంలో సీపీ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనంపై మీ అభిప్రాయం?
నగరంలో పోలీస్ కమిషనర్ గారు చేపట్టిన 'ఆత్మీయ సమ్మేళనం' సత్ఫాలితాలనిస్తోంది. ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఉన్నతాధికారులకు, సిబ్బందికి మధ్య ఆత్మీయ బంధం ఏర్పడింది. చిరు ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరు ఒకే కుటుంబసభ్యులుగా కలిసిమెలిసి ఉండే విధంగా తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది సమస్యలను సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పోలీస్ అధికారుల సంఘం ముఖ్యపాత్ర పోషిస్తోంది. సీపీ గారు సైతం విధుల్లో ప్రతిభకనబర్చిన సిబ్బందిని ప్రోత్సాహించేందుకు రివార్డులు, అవార్డులను అందిస్తున్నారు. దాంతో సిబ్బంది మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ విధానం నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేయడంలో కీలక పాత్రపోషిస్తోందనేది నా అభిప్రాయం.
కానిస్టేబుళ్ల ప్రమోషన్ల సమస్య ఎంతవరకు వచ్చింది?
కానిస్టేబుళ్ల ప్రమోషన్ల అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో పరిష్కారం కాగానే కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు వచ్చే అవకాశముంది.