Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ భాష అయినా మాట్లాడడం, వినడం చేసినంత సులభంగా రాయలేరు. చదవలేరు. చదువురాని వారు సరే. చదువు వచ్చినవారు కూడా వారి మాతృభాషను నేర్చుకోలేక నాణ్యమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. కళ్ళ ముందున్న ఈ వాస్తవాన్ని మనం కాదనలేం.
ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలు ఈ విధంగానే అంతరించిపోపతున్నాయి. అందులో మన తెలుగు భాషకూ ప్రమాద ఘంటికలు మోగుతున్న విషయం తెలిసిందే.
తెలుగు భాష పట్ల అనురక్తి కలిగించేందుకు, మమతానురాగాలు పంచేందుకు యువభారతి వారు 'తెలుగు సొగసులు' (విద్యార్థి యువతకై పరిచయ వ్యాసాలు) ప్రచురించారు.
ప్రముఖ కవి, ఆకాశవాణి పూర్వ కార్యక్రమ నిర్వహణాధికారి అయిన శ్రీ సుధామ గారు 2012లో నాటి ఆంధ్రభూమిలో 'నుడి' శీర్షికన ధారావాహికంగా ప్రచురించిన వ్యాసాలను ఈ చిరు పుస్తకంగా విడుదల చేసారు. ఇవి ఆనాటి ఆకాశవాణి ప్రసంగ వ్యాసాలు కూడా. శ్రోతలను విశేషంగా ఆకర్షించాయి.
'తెలుగు భాషను పరిరక్షించుకోవడమంటే నాలుగు చెరుగులా ఉన్న మాండలికాలన్నింటినీ గౌరవించి, సమాదరించి భావ వినిమయం చేసుకోవడమేనని యువభారతి అధ్యక్షులు ఆచార్య ఫణీంద్ర ముందు మాటలో పేర్కొన్నారు.
'మాతృభాషా సాహిత్య పఠనమే ప్రథమ కర్తవ్యం' అనే భావం బలంగా మనసులో నాటుకోవడానికి గాను వీలైనంత ఎక్కువ మందికి, వీలైనంత తక్కువ వెలకు ఉత్తమ సాహిత్యం అందించేందుకు యువభారతి పూనుకున్నదని తెలపడం అభినందనీయం.
తెలుగు భాషా సొగసులు చూసి తరించాలన్నా.. ఆ భాసా మాధుర్యం అనుభవించాలన్నా.. పుస్తకం పఠించాల్సిందే..!
(తెలుగు సొగసులు, రచయిత : సుధామ, పేజీలు : 40, వెల : 50/-, ప్రతులకు : యువ భారతి, తెలంగాణ సారస్వత పరిషత్ భవనములు, తిలక్రోడ్, హైదరాబాదు - 01)
- కె.శాంతారావు, 9959745723