Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అంతర్మథనం'' వచన శతకం.. ప్రేరణ కలిగిస్తాయి, స్ఫూర్తిని రగిలిస్తాయి. కాసేపు తరిచి చూసుకోమంటాయి. మనిషి మనుగడకు దారిచూపెడతాయి, మానవాళికి దార్శనికత నిస్తాయి. కవయిత్రి ''శేర్ భారతిమూర్తి'' మనో ఫలకంపై తారాడిన భావాలను, అంతరంగంలో మధించుకుని, ప్రోది చేసుకుని ''వచన శతకం'' రూపంలో అందించారు.
ఛందో నియమాలకు దూరంగా, శతకం నిర్మాణాన్ని అనుసరించకుండా, స్వేచ్ఛ తీసుకుని నాలుగు పాదాలుగా కూర్చిన ''వచన'' శతకం ఇది. సుమతి శతకము నీడలో వేమన శతకం జాడలో నవీన ప్రపంచానికి నీతిని అందిస్తుంది, ఆధునిక సమాజానికి ఆలంబనగా నిలుస్తుంది.
''క్రూరత్వ మన్నది మనిషినేలుతుంటే/ క్రూర మగాలైనా సిగ్గుతో తలవంచు'' అని స్త్రీల పట్ల జరిగే అమానుషాన్ని నిలదీస్తాయి. ''పాలవంటి మనసు పాపపంకిలమైన/ పరమాత్ముడు కూడా పాపిగా తోచు'' అని దండిస్తాయి. మనుషులను విడదీయు పద్ధతులను, మనసులను ముడివేయు మర్యాదలను ఎరుక పర్చుతాయి. జీవిత సత్యాలను వాక్యాలలో కూర్చి, విడమరచి, విశద పరిచి ఉద్భోదించిన తీరు రచయిత్రి సామాజిక పరిశీలనకు, దక్కోణాన్నికి తార్కాణం.
పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రుల మాట వినని పిల్లల దోరణి ధరణిలో ఎలా ఉంటుందో లక్ష్మణ రేఖ దాటిన సీత గాథతో పోల్చి చెప్పడం, అతి సామాన్యమైన ఉపమానాలతో అసామాన్యమైన హరిచంద్రుడి సత్య మార్గాన్ని వివరించడం, మరణాన్ని గెలిచిన ధ్రువుని వత్తాంతాన్ని , కురువంశ నాశనము కురురాజువలెనన్న మహాభారతం నీతిని, నేటి తరానికి అర్థమయ్యేలా అర్థవంతంగా అందివ్వడం, పురాణాలను ఇతిహాసాలను గుప్పెట పట్టిన రచయిత్రి పరిణతిని తెలియజేస్తాయి.
కలయికకు కూడనివి కలవవు అన్న నిజం, భూమి ఆకాశం అతికినట్టుగా తోచడం కంటి చూపు మర్మమే అనే వాస్తవికతను, నల్లబెల్లానికే తీపెక్కువ అనే లోకొక్తిని కవిత్వరికరించి కనువిప్పు కలిగేలా సమాజానికి సందేశాన్ని ఇచ్చారు. ''ఇనుప ముక్క విరగ మరల అతకవచ్చు/పాలు విరిగిన వన్న పనికిరావు'' అని, నిత్య జీవితంలో అనుభవైక విషయాలను పొందుపరిచి, జాగురుకతతో ఉండమంటూ జాగత పర్చుతున్నారు ''శేర్ భారతి మూర్తి''.
''కనులు మూసుకున్న కరుగునా వాస్తవం'' అని మనసును మెలిపెడుతారు, అవసరం కోసం చేసే పాలు నీళ్ళ వంటి స్నేహలు ''పాలు విషములాగ పగులు సుమ్మి'' అంటూ హెచ్చరిస్తారు. ''అల్లుడన్న వాడికి ఇచ్చుకునుటే గాని పుచ్చుకొనుట తెలియదు పుడమిలోన ''పారుతున్న నీరు పల్లమునకే జారు ఎదురెక్కుట ఎరుగగలమే..?'' అని ప్రశ్నిస్తారు, మార్పును ఆశిస్తారు.
భావోద్వేగాలతో అల్లుకున్న అక్షరాలతో, బంధాలతో పెనవేసుకున్న వాస్తవిక స్థితిగతులను అంతర్మథనంలో ఆవిష్కరించారు. తరిగిపోని అమ్మ ఉన్నతిని గుర్తు చేశారు. తరాల మధ్య అంతరాలను, అంతరంగాల మధ్య అపోహలను, గుచ్చుకునే మాటలను, మెచ్చుకునే రాతలుగా అందించారు. మనిషి మనిషితో సంఘర్షించు కునే వైనాన్ని, మనసులోని మాలిన్యాన్ని ఎత్తిచూపారు. సంఘజీవిగా ఉన్న మానవుడు ఒంటరిగా మిగిలిపోతే కలిగే విపరిణామాలను పర్యవసానాలను పొందుపరిచారు. మానవీయ విలువలు ఆర్థిక బంధాల చట్రంలో కుదేలవుతున్న విధానం విశద పరిచారు.
ఇక రచయిత్రి శైలిని పరిశీలిస్తే.. తొలిగా వేసిన అడుగులు అంటూనే ఆటవెలది చాయలతో ఆకట్టుకున్నారు. ఏ ఛందో నియమాలు పాటించలేదని ప్రకటించినా, పాదాల కూర్పును ఛందో పద్దతులతో నేర్పుగా అలరించారు. వేమన, సుమతి పద్యాల ఆనవాయితి అంతర్లీనంగా ప్రవహించినా తన ప్రత్యేకతను నిలుపుకున్నారు.. చాటుకున్నారు.! మకుటాలు లేకున్నా మకుటాయ మానంగా తీర్చి దిద్దారు. ''వచన శతకం'' ప్రక్రియగా నవీకరణ కు నాంది పలికారు. మనసుకు నచ్చిన రీతి అంటూ మనం మెచ్చిన రీతిలో అందించారు ''శేర్ భారతి మూర్తి''.
- రామకృష్ణ మనిమద్దె,
9494353828