Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నది కండ్లకు కనిపించని కరోనా వైరస్. తరతమ బేధాలకు తావు లేకుండా యావన్మందినీ భయభ్రాంతులకు ఇంకా గురి చేస్తూనే వుంది. లక్షలాది మంది మన కళ్ళ ముందే అదృశ్యమైపోయారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలో తీవ్రమైన మార్పులను తీసుకువచ్చింది ఈ కరోనా. అయితే మనుషుల అంతరంగాల్ని, అంతరంగాల్లోని మలినాల్ని, మల్లెల పరిమళాలనూ బహిర్గత పరిచింది. 'అన్నీ వున్నాయనుకున్న మనుషులనిప్పుడు, అరుగులు దాటి, అరడుగు వెయ్యలేని, అంధకారంలోకి నెట్టేసావు' అని మువ్వా శ్రీనివాసరావన్నట్లు మనుషుల్ని కట్టడి చేసిన పరిస్థితులపై విభిన్న కోణాలలో ప్రపంచ గమనాన్ని అక్షరాల్లోకి వంచేశాడు మువ్వా.
చదవడానికి తేలికగా అలవోకగా రాసినట్టు అనిపించినా లోతైన విషయాలను కూడా సింపుల్గా కవిత్వం చేయడం ఎలాగో వీరి 'వైరాయణం' మూడో ప్రపంచ యుద్ధ కవితను చూస్తే అర్థమవుతుంది. కరోనా కాలంలో అమెరికాలో ఇంటి గదుల్లోకే పరిమితమై కాలాన్ని గడిపినా తన మనోనేత్రంతో ప్రపంచాన్ని అక్షర దుర్భిణి వేసి వైరాయణాన్ని సృష్టించాడు.
'కరోనా నాతో తన డైరీ రాయించడం మొదలు పెట్టింది' అని చెపుతూ వచన శతకానికి పురుడు పోశాడు. శ్రీశ్రీ ఇప్పుడు బతికుంటే.. 'ఇటు చూస్తే ఆకలి చావు, అటు చూస్తే కరోనా మరణం, సమస్యగా ఘనీభవించిందోక వలస కూలీకి, కరోనా కారణ జన్మమే నీది' అంటూ వలస కూలీల బాధల్ని గానం చేసారు. 'సాగినంత కాలం తోటి మనుషులను అంటొద్దు ముట్టొద్దు అన్నోళ్ళం / అందుకే బాధేంటో అనుభవానికి వచ్చేలా అందరికీ అలాగే శిక్ష వేశావు కదా! కరోనా! అని సమాజంలోని వివక్షతను పోల్చి చూపారు. 'వనమున్నచోట, వర్షం వర్థిల్లినట్లు, నది పక్కన నాగరికత పెరిగినట్లు నీవిప్పుడు. ఎరుపు పాలన ఉన్న చోట / కట్టడో, తుది ముట్టడోనని, ఎరుక చేసావు కదా! కరోనా! కవిత్వంలోనూ రాజకీయ స్పృహతో విశ్లేషణ చేశారు. అంతేకాదు 'ప్రకృతి ఇచ్చిన ప్లేస్మెంట్ తప్పినందుకు, మనిషిని మరమ్మతు చేస్తున్నావు కదా కరోనా! అని పర్యావరణ సమస్యనూ ఎత్తి చూపారు.
వైరస్ చేస్తున్న దాడిని మూడో ప్రపంచ యుద్ధంలా భావించి ఆ యుద్ధ ప్రతిబింబాన్ని కవిత్వీకరించిన 'వైరాయణం' భిన్నమైన అభివ్యక్తితో సామాజిక ప్రయోజనాన్ని పొందుతున్న కవితగా నిలిచి కరోనా పరిణామాల రికార్డు చేసింది.
(వైరాయణం (కవిత్వం), రచయిత : మువ్వా శ్రీనివాసరావు, పేజీలు : 142, వెల : రూ.100, ప్రతులకు : నవోదయ, అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో..)
- కె.ఆనందాచారి