Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళలతో వ్యాపారం చేయడం తెలంగాణీయులకు అచ్చిరాని విద్య. పాట, పద్యం, నాటకం, బాగోతం, బుర్రకథ అన్నీ ఆడి, పాడి ఒకరికొకరు పంచుకొనే కళారూపాలే. పనిలో పాటగా, శ్రమలోంచి సేద దీర్చుకునే క్రమంలో ఉల్లాస కాసారంగా కళలు తెలంగాణ జీవితంలో భాగమయ్యాయి.
పలు కళల సమాహారమైన కళలు ఒక వ్యాపారం. కళలను అమ్ముకొని సొమ్ముచేసుకోవడం విజ్ఞాన వ్యాప్తివల్ల 20వ శతాబ్దంలో వచ్చిన కొత్త ప్రక్రియ. కూలీ తీసుకొని కళాకారులు నిర్మాత చెప్పినట్లు ఆడాలి. దీంతో కళ ఒక వృత్తిగా మారిపోయింది. ఆదాయ వనరు అయింది. చివరికి వినోదం కొనుక్కొనే వస్తువు అయింది. అయితే సినిమా నిర్మాణంలో జయాపజయాలుంటాయి. ఆదరణ, నిరాదరణ రెండూ ఉంటాయి. ఇలా కళల ద్వారా కాసులు రాల్చుకోవడం తెలంగాణీయులకు నప్పని కార్యమే. అందుకే సినిమా తెలంగాణ జీవితాల్లోకి వారి వ్యాపారాల్లోకి అనుకున్నంతగా, సినిమా విస్తృతికి తగినంతగా చొచ్చుకుపోలేదు.
1931లో తెలుగులో తొలి టాకీ చిత్రం మొదలయింది. తెలుగు సినీ పరిశ్రమపై ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెత్తనం నడుస్తోంది. నటీనటులు, రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు అందరూ ఆంధ్రులే. ఆంధ్రప్రాంతానికి ఆనుకొని ఉన్న నల్గొండ జిల్లా నుండి టి.ఎల్.కాంతారావు, ప్రభాకర్ రెడ్డి మినహా తొలినాళ్లలో తెలుగు సినిమాలో తెలంగాణ నటులెవరూ కనిపించరు. 1951లో కాంతారావు సినీరంగంలో ప్రవేశించి, జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి ఎన్,టి.రామారావుకు సముజ్జీగా నిలిచారు. 400కు పైగా చిత్రాల్లో నటించి కాంతారావు చిత్ర నిర్మాణం చేపట్టి చివరి సమయంలో కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన భార్య హేమవతికి తెలంగాణ ప్రభుత్వం సాయపడుతోంది. 1960లో 'చివరికి మిగిలేది' సినిమాలో తొలిసారిగా నటించిన డా||ఎమ్.ప్రభాకరరెడ్డి సుమారు 500 సినిమాల్లో నటించారు. కథారచయిత, నిర్మాతగా ఈయన సినిమాలకు వన్నె తెచ్చారు. వీరిద్దరూ ఇప్పుడు కీర్తిశేషులే.
సి.నారాయణరెడ్డి, దాశరథి ఇద్దరూ పాటల రచయితగా సినిమాల్లో నిలదొక్కుకున్నారు. అట్లా నిలదొక్కుకోలేక తిరిగి వచ్చినవారిలో అచ్చి వేణుగోపాలా చార్యుల్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ''పట్నంలో శాలిబండ'' ఆయన రాసిందే. అచ్చిగారితో పాటలు రాయిస్తేతాము రాయమని ఆనాటి ప్రసిద్ధ గేయ రచయితలు చక్రం అడ్డం వేయడంతో నిర్మాతలు వీరి సేవలను వినియోగించుకోలేకపోయారు. అయితే ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన చందాల కేశవదాసును ప్రముఖంగా పేర్కొనాలి. తొలి తెలుగు టాకీ చిత్రమయిన భక్త ప్రహ్లాదకు సంభాషణలు, పద్యాలు రాసింది ఈయనే. శ్రీకృష్ణ తులాభారంలోని భలేమంచి చౌక బేరము ఈ రచయిత గేయరాజమే. తెలుగు నాట నాటక ప్రదర్శనకు ముందుగా పాడే 'పర బ్రహ్మ పరమేశ్వర' గీతం కూడా చందాల కేశవదాసు రాసిందే. అయితే వీరి చరిత్రను ఉద్దేశ పూర్వకంగా మరుగున పరిచారు. తెలంగాణ రావడంతో ఆయన వెలుగు చూస్తున్నారు.
హింది సినిమాలు తీసిన కరీంనగర్వాసి
సినీ నిర్మాణ రంగంలో కాలు పెట్టడానికి తెలంగాణకు చాలా కాలం పట్టింది. హైదరాబాదు కేంద్రంగా వివిధ ప్రాంతాల వారు మూకీలు, టాకీలు నిర్మించినా తెలంగాణ జిల్లాలలోంచి చిత్ర నిర్మాణం చేపట్టడం 1960 దశకంలో మొదలైందనవచ్చు. కరీంనగర్కి చెందిన కృష్ణ కిషోర్ రెడ్డి కెకె రెడ్డిగా సినిమా రంగంలో అడుగుపెట్టాడు. ఆయన 1968లో 'ముజ్రిం కౌన్?' అనే హింది సినిమాను నిర్మించాడు. ఆరోజుల్లో కరీంనగర్ జిల్లా పట్టణాల్లో ఆ సినిమా పోస్టర్లలో కెకె రెడ్డి పేరు చూసి జిల్లావాసులు ఉప్పొంగిపోయారు. ఆ తర్వాత ఆయన హింది, తెలుగు భాషల్లో సినిమాలు తీశారు. 1987లో 'తేరా రబ్ మేరా ధం', 1988లో 'పాప్ కో జలాకర్ రాఖ్ కర్ దూంగా' అనే భారీ హందీ చిత్రాలను నిర్మించారు. యువనటి దివ్యభారతి మరణించేముందు నటించిన చిత్రమిది.
నిజామాబాద్కు చెందిన బిక్కులాల్ అగర్వాల్, జ్ఞాన్చంద్ గుప్తాలు కలిసి 1971లో హీరా కృష్ణతో జేమ్స్బాండ్ 777 సినిమా నిర్మించారు. ఈ సినిమా ప్రజాదరణ పొందినా ఈ నిర్మాతల ద్వయం సినీ రంగంలో కొనసాగనట్టుంది. 1975లో కాకతీయ పిక్చర్స్ వారు 'చిల్లరదేవుళ్లు' నిర్మించారు. దాశరథి రంగాచార్య రాసిన నవల 'చిల్లరదేవుళ్లు'కు ప్రతిరూపం ఈ సినిమా. సంభాషణలు పూర్తిగా నవల్లో మాదిరిగానే తెలంగాణ యాసలో ఉంటాయి. ఆత్రేయ పాటలకు కె.వి.మహదేవన్ స్వరకల్పన చేశారు. పాటలన్నీ హిట్. 'కలువకు చంద్రుడు ఎంతో దూరం', 'పాడాలనీ ఉన్నది' లాంటి ప్రజాదరణ పొందిన పాటలు ఇందులోనివే. ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకులు. ఈయన తెలంగాణ వాసియే. 1979లో జగిత్యాలకు చెందిన డి.హన్మాండ్లు 'గాలివాన' అనే సినిమా నిర్మించాడు. ఆర్.వి.ఎస్.రామస్వామి కథ, పాటలు సమకూర్చిన ఈ చిత్రానికి కొపెల్లె శివరాం పాటలు రాశారు. సంగీతం పెండ్యాల. దర్శకత్వం ఆదిరాజు ఆనందమోహన్. అదే సంవత్సరం మందమర్రికి చెందిన శ్రీపతిరావు 'ప్రియబాంధవి' అనే సినిమా నిర్మించారు. రంగనాథ్, శారద నాయకా నాయికలు. దురై దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పెండ్యాల సంగీతం అందించారు.
కరీంనగర్కి చెందిన బిఎస్ నారాయణ సినిమా దర్శకుడిగా ఖ్యాతి గడించాడు. 1976లో ఆయన దర్శకత్వం వహించిన 'ఊరుమ్మడి బతుకులు' జాతీయ తెలుగు ఉత్తమ చిత్రం అవార్డు, స్వర్ణ నంది అవార్డు లభించాయి. 'నిమజ్జనం' (1979) సినిమాకి జాతీయ పురస్కారం వచ్చింది. 1963 నుండి తెలుగు సినిమా రంగంలో ఉంటూ ఆయన 12 సినిమాలకు దర్శకత్వం వహించారు.
80వ దశకంలో...
1980లో జగిత్యాలకు చెందిన కె.రాజయ్య 'శ్రీకన్యకాపరమేశ్వరి మహత్యం' నిర్మించారు. కమలాకర కామేశ్వరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. 1980లో రెండు నంది అవార్డులు ఈ సినిమాకు రావడం విశేషం. సంగీతానికిగాను రాజేశ్వరరావు, స్క్రీన్ ప్లేకి రచయిత చిల్లర భావనారాయణ నంది పురస్కారాలు అందుకున్నారు.
1980లోనే బి.నర్సింగరావు నిర్మించిన 'మా భూమి' వచ్చింది. తెలంగాణ సాయుధపోరాటం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు బెంగాలీ దర్శకుడైన గౌతం ఘోష్ దర్శకత్వం వహించారు. కిషన్ చందర్ రాసిన 'జబ్ ఖేత్ జాగీ' నవలికకు చిత్రరూపమిది. అపూర్వ ప్రజాదరణతో విజయవంతంగా నడచిన మాభూమి వివిధ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలందుకుంది. వంద గొప్ప భారతీయ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రాన్ని సిఎన్ఎన్ గుర్తించింది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్క్రీన్ప్లేగా రెండు నంది అవార్డులు అందుకుంది.
1983లో బి.నర్సింగరావు తన స్వీయ దర్శకత్వంలో 'రంగుల కల' నిర్మించారు. ఇందులో ఆయనే కథానాయకుడు. రూప్న నాయకి. చిత్రకారుల మానసిక సంఘర్షణ ఆధారంగా తయారైన ఈ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. కె.శకుంతల ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకున్నారు.
బి.నర్సింగరావు దాసి, మట్టిమనుషులు, మావూరు తదితర సినిమాలకు, డాక్యుమెంటరీలకు దర్శకత్వం వహించి దేశ విదేశీ చిత్రోత్సవాల్లో విజయుడుగా నిలిచారు. తెలంగాణ సినిమాకు దీపస్తంభమాయన.
1984లో కరీంనగర్కి చెందిన నారదాసు లక్షణరావు ఇతర మిత్రుల నిర్మాణంలో 'విముక్తికోసం' సినిమా వచ్చింది. శ్రీకాకుళ సాయుధపోరాటం ఈ చిత్ర నేపథ్యం. ఉదయకుమార్ దర్శకుడు. వంగపండు ప్రసాదరావు అందించిన పాటలకు బి.గోపాలం బాణీలందించారు. ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సరోజినీ దేవి జాతీయ సమైక్యత పురస్కారం లభించింది.
1990లో అల్లాణి శ్రీధర్ 'కొమురం భీం' సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారా శ్రీధర్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఉత్తమ జాతీయ సమైక్య చిత్రంగా కూడా కొమురం భీం నంది అవార్డు అందుకుంది.
1993లో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో జగిత్యాలకు చెందిన శివ ప్రొడక్షన్స్ వారు 'ప్రేమే నాప్రాణం' నిర్మించారు. మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీధర్ తెలంగాణ సినిమా క్షేత్రంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు.
1996లో 'పిట్టల దొర' సినిమా ద్వారా రంగప్రవేశం చేసిన సానా యాదిరెడ్డి ఈ రంగంలో ఎన్నో విజయాలను అందుకున్నారు.
ఎల్.శ్రీనాథ్ దర్శకత్వం వహించిన 'కుబుసం', టి.ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చిన 'బతుకమ్మ' కూడా ప్రశంసనీయ సినిమాలే.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కూడా ఉద్యమానికి అనుకూలంగా సినిమాలు వచ్చాయి. వీటిలో ఎన్.శంకర్ దర్శకత్వంలో 'జై బోలో తెలంగాణ' ప్రజాదరణ, ప్రశంసలందుకుంది. రఫీ నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఇంకెనాళ్లు' మరో తెలంగాణ ఉద్యమ చిత్రం.
గమనించవలసిన విషయం ఏమిటంటే పైన పేర్కొన్న ప్రతి సినిమాకు ఒక ఉద్దేశం ఉంది. సామాజిక ప్రయోజన లక్ష్యం ఉంది. తెలంగాణ ముద్ర ఉంది. ఈమధ్య కాలంలో తెలుగు సినిమా రంగంలో కొందరు తెలంగాణవారు నిలదొక్కుకుంటున్నారని చెప్పవచ్చు. దిల్రాజుగా చిత్ర నిర్మాతల్లో ముందున్న వెంకటరమణారెడ్డి నిజామాబాద్ వాస్తవ్యులు. చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, కందికొండ, వరికుప్పల యాదగిరి వంటివారు పాటల రచయితలుగా కొనసాగుతున్నారు. గతేడాది దివంగతులైన చక్రి సంగీత దర్శకుడుగా పేరు పొందారు. ఎన్.శంకర్, హరిశంకర్, వెన్నెల కిశోర్, వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, సంపత్ నంది, దశరథ్ తదితరులు దర్శకులుగా విజయ పథాన ఉన్నారు. 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్ రెడ్డి, 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత రాజ్ కందుకూరి, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఇక్కడివారే. తెలంగాణ ప్రాంతంలో చిత్రీకరించిన 'ఫిదా' సినిమా అలరించింది. తెలంగాణ రాష్ట్ర సాధన వెలుగులో ఈ విజయాలు సాధ్యమయ్యాయని అనుకోవచ్చు.
తెలుగు సినిమా రంగం ఇప్పుడు కొత్త ఆలోచనలో పడింది. తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించే దిశగా కళ్లు తెరుస్తోంది. ఈ దిశలో తెలంగాణ స్థానికులతో చిత్ర నిర్మాణం, వివిధ విభాగాల నేతృత్వం జరగవలసిన ఆవశ్యకత ఉన్నది.
సింహ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2017లో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర మండలిని ఏర్పరుస్తూ పి.రామమోహనరావును చైర్మన్గా నియమించింది. కె.వి.రమణాచారి చైర్మన్గా 'సింహ' అవార్డుల కమిటీని వేసింది. జూన్ 2014 నుండి డిసెంబర్ 2015 వరకు నిర్మించిన సినిమాలు ఎంట్రీలు వచ్చాయి. వాటికి సింహ పురస్కారాలు ప్రకటించాల్సి ఉంది.
అయితే చిత్రసీమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి అంశం లోనూ 'మన' సినిమాను రక్షించే దిశ ఉండాలి. వ్యాపార చిత్రాలను, భారీ బడ్జెట్ చిత్రాలను కాకుండా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకు ప్రాధాన్యత నీయాలి. అవార్డుల ఎంపిక విషయంలోనూ ఈ గీత పెట్టుకోవాలి.
తెలంగాణ జీవన సంస్కృతులను ప్రతిఫలించే చిత్రాలను ప్రోత్సహించేవిధంగా ఆకోణంలో తయారైన స్క్రిప్టులను ఆహ్వానించి లోబడ్జెట్లో చిత్ర నిర్మాణానికి తోడ్పడాలి. పుంఖానుపుంఖాలుగా వస్తున్న తెలుగు సినిమాల్లో తెలంగాణ సినిమా విడిగా కనబడేట్టుగా దిశానిర్దేశం చేయాలి. తెలంగాణ భాష, వంటలు, పండుగల మాదిరి తెలంగాణ సినిమా అని చెప్పుకొనే స్థాయిలో మన సినిమా ఎదగాలి.
(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా...)
- బి.నర్సన్, 9440128169