Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధాలు, అనుబంధాల తాలూకా మాధుర్యాన్ని, విలువని, గొప్పతనాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించిన మలయాళ చిత్రం 'పిరవి'. ఈ చిత్రంలో కొడుకు కోసం ఓ తండ్రి పడే తపన, ఆరాటం మనసు పొరల్ని స్పృశిస్తే, తమ్ముడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడనే విషయాన్ని వృద్ధ తల్లిదండ్రులకు చెప్పలేక ఓ అక్కయ్య పడే మానసిక వేదన గుండెల్ని పిండేస్తుంది. ఓ వాస్తవిక సంఘటన స్ఫూర్తితో ఆద్యంతం భావోద్వేగభరితంగా తెరకెక్కిన ఈ చిత్రం 36వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగాల్లోనూ జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది.
'పిరవి' చిత్ర కథ..
భరించలేని చలిలోనూ తెల్లవారు జామున నాలుగు గంటలకే స్నానం చేసి వడివడిగా కాలువని దాటించే పడవ ఎక్కి, అవతలి ఒడ్డున ఆగే బస్ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూడటమనేది రాఘవ చకార్ (ప్రేమ్జీ) దినచర్యలో భాగమైపోయింది. ఏ రోజుకైనా తన కొడుకు ఆ బస్లో వస్తాడనే ఆశే ఆయన్ని అలా బస్స్టాండ్లో పడిగాపులు కాసేలా చేసిందనే సన్నివేశం నుంచి సినిమా ప్రారంభం అవుతుంది.
రాఘవ చకార్ (ప్రేమ్జీ) కుటుంబం త్రివేండ్రానికి దగ్గరగా ఉన్న ఓ గ్రామంలో నివసిస్తుంటుంది. రాఘవ చకార్ భార్యకు కళ్ళు కనిపించవు. వీరిద్దరి వయసు 60 ఏండ్లకు పైబడే ఉంటాయి. వీరికి ఓ కొడుకు రఘు, కూతురు (అర్చన) ఉంటారు. రఘు త్రివేండ్రంలో ఇంజనీరింగ్ చదువుతుంటే, అర్చన ఇంటికి దగ్గర్లోనే ఉన్న స్కూల్లో టీచర్గా పని చేస్తుంటుంది. వర్షాకాలం కావడంతో ఈ ఊరిలో ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. అర్చనకు పెళ్ళి కుదురుతుంది. నిశ్చితార్థ తేదీని కూడా ఖరారు చేస్తారు. అక్క పెళ్ళి విషయంతోపాటు నిశ్చితార్థం జరిగే రోజున తప్పకుండా రావాలని కొడుకు రఘుకి రాఘవ చకార్ ఉత్తరం రాస్తాడు. నిశ్చితార్థ తేదీ దగ్గర పడుతున్నా పట్నం నుంచి రఘు ఊరికి రాడు. మరో ఉత్తరం పంపించినా కొడుకు దగ్గర్నుంచి సమాధానం రాదు. తమ్ముడు లేకుండా నిశ్చితార్థం చేసుకోనని తల్లిదండ్రులకు అర్చన చెబుతుంది. నిశ్చితార్థ తేదీ వచ్చినప్పటికీ రఘు ఊరికి రాడు. తమ్ముడు పెళ్ళికొస్తాడు ఇప్పుడు మాత్రం నిశ్చితార్థం చేసుకోమని తల్లిదండ్రులు అడిగినప్పటికీ అర్చన నిరాకరిస్తుంది.
రోజులు గడుస్తున్న కొద్దీ రఘు ఊరికి రాకపోగా అతని దగ్గర్నుంచి ఎటువంటి సమాచారం ఉండదు. దీంతో రఘు వస్తాడనే ఆశతో రాఘవ చకార్ ప్రతీ రోజూ తెల్లవారుజామునే స్నానం చేసి బస్ ఆగే ప్రదేశం దగ్గరికెళ్ళి ఎదురు చూస్తుంటాడు. అలా రాత్రి అయ్యేంత వరకు వేచి చూసి ఉసురూమంటూ ఇంటికొస్తుంటాడు. ఇది రాఘవ చకార్కి ఒక దిన చర్యగా మారిపోతుంది. కొడుకు కోసం రాఘవ చకార్ పడుతున్న ఆవేదన చూసి ఆయన సన్నిహితులు, ఊర్లో వాళ్ళు అయ్యో పాపమనుకుంటారు.
తమ్ముడు త్వరగా ఇంటికి రావాలని అర్చన గుడిలో రకరకాల పూజలు చేయిస్తుంటుంది. దేవుడికి అనేక మొక్కులు మొక్కుకుంటుంది. అంధురాలైన తల్లి కొడుకు రాక కోసం ఆరాటపడుతుంటుంది.
రోజు మాదిరిగానే రాఘవ చకార్ బస్ ఆగే ప్రదేశంలో వేచి ఉంటాడు. బస్ రాగానే అందులో నుంచి దిగే మనుషుల్ని ఆత్రంగా చూస్తాడు. అయితే ఆ రోజు కూడా దిగిన మనుషుల్లో కొడుకు కనిపించలేదు. కానీ పట్నంలో చదువుకునే హరి మాత్రం కనిపించాడు. హరి కనిపించగానే మా రఘు ఎక్కడైనా కనిపించాడా అని ఎంతో ఆశతో అడిగితే, కనిపించలేదనే హరి సమాధానం రాఘవ చకార్ను డీలా పడిపోయేలా చేస్తుంది. అంతేకాదు మరింత నిరాశ, నిస్పృహలకు లోనవుతాడు. అలా రోజులు గడుస్తున్నా రఘు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులతోపాటు అర్చన కూడా దిగాలు పడుతుంది. ఓ రోజు గుడికి వెళ్ళినప్పుడు అర్చనకి హరి కనిపిస్తాడు. మా తమ్ముని గురించి నీకేమైనా తెలుసా?, ఎక్కడైనా కనిపించాడా? అని అడిగితే, అతను సమాధానం చెప్పలేక తడబడుతుంటాడు. అతని తత్తరపాటుని గమనించి అసలేం జరిగిందని అర్చన గదమాయిస్తుంది. సిటీలో జరిగిన గొడవల్లో మీ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారని పేపర్లో చదివానని చెబుతాడు. గొడవలు జరిగితే తన తమ్ముడిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారో తెలుసుకుందామని పేపర్ కోసం ఇంటికొచ్చి అన్ని చోట్లా వెతుకుతుంది. కూతురు పేపర్ కోసం వెతకడాన్ని చూసిన రాఘవ చకార్ ఆ పేపర్ ఇదిగో అంటూ అర్చన చేతిలో పెట్టి భోరున ఏడుస్తాడు. తన కొడుకుని విడిపించమని మంత్రి దగ్గర్నుంచి ఓ సిఫారసు లెటర్ని తీసుకుని త్రివేండ్రం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఐజిని కలుస్తాడు. మంత్రి సిఫారసు లెటర్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత మీ కొడుకు ఎవరో మాకు తెలీదు. ఇందులో ఉన్న వివరాల ఆధారంగా మీ కొడుకు ఆచూకీ తెలిస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాం అని రాఘవ చకార్కి ఐజి చెప్తాడు. ఇంతదూరం వచ్చి కనీసం కొడుకుని కూడా చూడలేకపోయాననే బాధతో ఇంటికొస్తాడు. తండ్రి ముఖంలో సంతోషం కనిపించకపోయే సరికి అర్చనకు భయం కలుగుతుంది. రఘుని కలిశారా?, అసలు ఏమైందని అడిగితే, జరిగిన విషయం చెబుతాడు. దీంతో రఘు కోసం అర్చన మరుసటి రోజు త్రివేండ్రంలోని రఘు చదివే ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్కి వెళ్తుంది.
అక్కడ రఘు స్నేహితులను కలిసి రఘు గురించి అడిగితే, గొడవలు జరిగినప్పుడు రఘుని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు రఘు తట్టుకోలేక చనిపోయాడని తెలిసిందని చెబుతారు. తమ్ముడు ఇకలేడనే బాధతో అర్చన ఇంటికొస్తుంది. రఘుతో కాకుండా అర్చన మాత్రమే ఇంటికి రావడాన్ని చూసిన రాఘవ చకార్ షాక్ అవుతాడు. ఆ షాక్కి మతి స్థిమితం కోల్పోయిన రాఘవ చకార్ కూతురితోపాటు కొడుకు రఘు కూడా వచ్చాడని సంతోషంగా చెబుతుండటాన్ని చూసి అర్చన కన్నీటి పర్యంతం అవుతుంది. తమ్ముడు చనిపోయాడనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక తనలోతానే బాధ పడుతుండటంతో సినిమా ముగుస్తుంది.
నేషనల్ ఎమర్జెన్సీ (1976) సమయంలో కోజీకోడ్లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ కనిపించకుండా పోయిన తన కొడుకు రాజన్ కోసం ప్రొఫెసర్ టి.వి.ఈశ్వర వారియర్ చేసిన పోరాటం కేరళలో సంచలనం సృష్టించింది. రాజన్ కేసుగా ప్రసిద్ధి చెందిన ఘటన ఈ సినిమా ఇతివృత్తం కావడం విశేషం. ఈయన చేసిన పోరాటం న్యాయ వ్యవస్థకు గట్టి సవాల్ విసరడంతోపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. కనిపించకుండా పోయిన ప్రొఫెసర్ తనయుడిని అధికార పార్టీకి సంబంధించిన నేతలు హత్య చేయించారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. జాడ కనిపించని కొడుకు కోసం ఆరాటపడిన తండ్రి ఆవేదనకు అక్షర రూపంగా 'ఓరు అచ్చెంటే ఓర్మాకల్' పేరుతో పుస్తకం ప్రచురితమైంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని 1989లో షాజీ.కె.కరుణ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ప్రేమ్జీ, అర్చన, లక్ష్మీ కృష్ణమూర్తి, సి.వి.శ్రీరమణ, కె.గోపాలకృష్ణన్, ముల్లెంజీ వంటి తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈచిత్రానికి జి.అరవిందన్, మోహన్ సితార సంయుక్తంగా సంగీతమందించారు. వేణుగోపాల్ ఎడిటింగ్, సన్నీ జోసెఫ్ కెమెరా పనితనం సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ళుగా నటించిన ప్రేమ్జీ, అర్చనల నటన ప్రేక్షకుల్ని కంట తడిపెట్టిస్తుంది. అంతగా ఆయా పాత్రల్లో వాళ్ళు జీవించారు.
36వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు (షాజీ.కె.కరుణ్), ఉత్తమ నటుడు (ప్రేమ్జీ), ఉత్తమ ఆడియోగ్రఫీ (టి.కృష్ణన్ఉన్ని) విభాగాల్లోనూ అవార్డులను దక్కించుకోవడం ఓ విశేషమైతే, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలతోపాటు ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకోవడం మరో విశేషం.
- రెడ్డి హనుమంతరావు, 8332995426