Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ ఉత్తమ చిత్రం
కొందరి జీవితాలు తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. అటువంటి గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే మన జీవితానికీ ఓ అర్థం పరమార్ధం ఉంటుందని తెలియజేసిన బెంగాలీ చిత్రం 'దాదా ఠాకూర్'. ప్రముఖ రచయిత, పబ్లిషర్ ముఖ్యంగా సామాజిక విమర్శకుడు శరత్చంద్ర పండిట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సమాజంలోని అవినీతిని అంతమొందించేందుకు తన వ్యాసాలు, పద్యాల ద్వారా అవిరళ కృషి చేసి దాదా ఠాకూర్గా ప్రజల మనసుల్ని దోచుకున్న శరత్చంద్ర జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. అంతేకాదు 10వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది
చిత్ర కథ
సమాజంలో పేరొందిన, పలుకుబడి ఉన్న ప్రముఖులందరూ కోలకతాలోని ఓ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం చాలా అట్టహాసంగా జరుగుతున్న తరుణంలో పంచె కట్టుకుని చొక్కా లేకుండా కేవలం భుజం మీద ఓ కండువా కప్పుకుని, ఒక చేతిలో గొడుగు, మరో చేతికి హుక్కా పీల్చుకునే సరంజామాని తగిలించుకుని ఓ యాభై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి లోపలికి వస్తుంటే అక్కడి కార్యక్రమ నిర్వాహకులు అడ్డుకుని లోపలికి పంపనివ్వరు. నీలాంటి వాడికి ఇటువంటి కార్యక్రమానికి వచ్చే అర్హత లేదు. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వస్తారు. నువ్వు పక్కకి తప్పుకో లేదంటే బలవంతంగా బయటకు గెెంటేస్తాం అంటూ పెద్దగా అరిచినప్పటికీ ఆ యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి ముఖంలో ఎటువంటి కోపం కనిపించక పోగా ప్రశాంత వదనంతో చిరునవ్వు చిందిస్తూ తన చేతిలో ఉన్న విఐపీ పాస్ని కూడా చూపిస్తున్నప్పటికీ నిర్వాహకులు లోపలికి పంపించేందుకు నిరాకరిస్తారు. కొద్ది క్షణాల తర్వాత ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు బయటికి వచ్చి ఆ యాభై సంవత్సరాల వ్యక్తిని చూస్తూనే పరుగెత్తుకుంటూ వచ్చి సాదరంగా చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకెళ్ళడాన్ని చూసి ఇంతకుముందు హడావుడి చేసిన నిర్వాహకులు విస్తుపోతారు. ఆయనెవరో తెలుసుకోవాలనే ఉత్సుకతతో లోపలికి వెళ్ళినప్పుడు ఆధునికత తెలియని గ్రామస్థుడిగా కనిపించే ఆ మహావ్యక్తి ఎవరో కాదు దాదా ఠాకూర్ (ఛాబీ బిశ్వాస్) అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరూ దాదా ఠాకూర్ గురించి గొప్పగా చెప్పడాన్ని విని సిగ్గుతో తలదించుకుంటారు. అంతేకాదు కార్యక్రమం చివర్లో దాదా ఠాకూర్ అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన తీరుని చూసి ఆశ్చర్యపోతారు.
దాదా ఠాకూర్ (ఛాబీ బిశ్వాస్) చూడ్డానికి సాదాసీదాగా కనిపించినప్పటికీ ఆయన చేసే రచనలు, పాడే పద్యాలు సమాజంలోని అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటాయి. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు స్వయంగా ఓ దినపత్రికను నడుపుతుంటాడు. రచనలు చేయడంతోపాటు మాన్యువల్ ప్రింటింగ్ కావడంతో ఆయనే అక్షరాలను కూర్చి, రంగులను అద్ది పేపర్ను తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తాడు. ఈ ప్రయత్నానికి భార్య (ఛాయా దేవీ) ఎంతో సహకరిస్తుంది. ప్రతి రోజు ఆ పేపర్లను వీధి కూడళ్ళలో నిల్చుని దాదా ఠాకూర్ అమ్ముతుంటాడు. ఈ పేపర్ని కొనేందుకు చాలా మంది పాఠకులు ఎంతోఉత్సుకత చూపిస్తారు. ఈ పేపర్ ద్వారా సమాజాభివృద్ధి కోసం తన భావనలను, ఆలోచనలను ప్రజలతో పంచుకుంటున్నాననే సంతృప్తితో దాదాఠాకూర్ ఉంటాడు. వృత్తి నిర్వహణలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతతో ఉండటంతో ఈయనపై అందరికీ మంచి గౌరవం ఏర్పడుతుంది.
ఓసారి ఓ స్కూల్కి సంబంధించి ప్రశ్నాపత్రాల ముద్రణ బాధ్యతను దాదా ఠాకూర్ తీసుకుంటాడు. అనుకున్న సమయానికే ముద్రణ పూర్తి చేస్తాడు. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కాలువలు పొంగుతాయి. దీంతో రైళ్ళ రాకపోకలను నిలిపివేస్తారు. అనుకున్న సమయానికి ముద్రించిన ప్రశ్నాపత్రాలను స్కూల్ యాజమాన్యానికి ఇవ్వాలనే సంకల్పంతో ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న ఆ స్కూల్కి జోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా కాలువలను దాటుకుంటూ దాదా ఠాకూర్ అందజేసిన వైనం ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.
అయితే ఇదే సమయంలో అనారోగ్యంతో ఉన్న పదేండ్ల కొడుకు చనిపోతాడు. స్కూల్లో ప్రశ్నాపత్రాలను ఇచ్చి ఇంటికి తిరిగి రావడం ఆలస్యమవడంతో కొడుకు దహన సంస్కారాలను బంధువులు నిర్వహిస్తారు. దీంతో కన్న కొడుకుని కడసారి చూసుకోలేని పరిస్థితిని తల్చుకుని దాదా ఠాకూర్ ఎంతో బాధపడతాడు.
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్వారిపై మన దేశీయులు బాగా ఉద్యమిస్తున్న తరుణంలో దాదా ఠాకూర్ రాసిన ఎన్నో రచనలు యువకుల్లో స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపుతాయి. అలాగే ఎంతో మంది యువతులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడానికి కూడా దాదా ఠాకూర్ రాసిన రచనలే కారణం. ఆ యువతుల్లో లతా (సుల్తానా చౌదరి) ఒకరు. దేశభక్తి మెండుగా ఉన్న యువతి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యమూ ఉన్న అమ్మాయి.
ఓ రోజు లోకల్ జమీందార్ దర్పనారాయణ (బిశ్వజిత్ ఛటర్జీ) లతని పాడు చేయాలని ప్రయత్నిస్తుంటే దాదా ఠాకూర్ కాపాడతాడు. అప్పట్నుంచి దాదా ఠాకూర్ అంటే లతకి గౌరవం మరింతగా పెరుగుతుంది. తాగుడుకి బానిసై దర్పనారాయణ చేయని చెడు పనులంటూ ఉండవు. అలాంటి దర్పనారాయణని సైతం దేశం కోసం ప్రాణాలను ఇచ్చే దేశభక్తుడిగా దాదా ఠాకూర్ మార్చేస్తాడు. ఒకప్పుడు తనని పాడు చేయాలనుకున్న దర్పనారాయణలోని మార్పు చూసి లత ఎంతో సంతోషపడుతుంది.
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనే యువతీయువకులను బ్రిటీష్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. వారిలో లత కూడా ఉంటుంది. జైల్లో పోలీసులు ఎన్ని చిత్ర హింసలు పెట్టినప్పటికీ లత మొక్కవోని ధైర్యంతో వందేమాతరం అంటూ నినాదాలు చేస్తుంది. ఇదిలా ఉంటే, సంఘ విద్రోహ శక్తులకు సహకారం అందిస్తున్నాడనే నెపంతో దాదా ఠాకూర్ సహచరుడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. సహచరుడి కోసం పోలీస్ స్టేషన్కి వచ్చి సరైన ఆధారాల్లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించిన దాదా ఠాకూర్కి బ్రిటీష్ పోలీస్ కమిషనర్ సమాధానమివ్వలేక క్షమాపణలు చెబుతాడు. అంతేకాదు దాదా ఠాకూర్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతాడు.
స్వాతంత్యం కోసం ఉధృత స్థాయిలో ఉద్యమిస్తున్న యువతీయువకులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తుంటారు. అయినప్పటికీ ఆ యువతీయువకులు తమ చేతుల్లో ఉన్న భారతీయ జెండాలను బ్రిటీష్ పోలీస్స్టేషన్పై ఎగురవేయాలని ప్రయత్నిస్తుండంతో పోలీసులు తుపాకులతో కాల్చడం ప్రారంభిస్తారు. అయినప్పటికీ లత తన చేతిలో ఉన్న జెండాని తీసుకుని పోలీస్స్టేషన్ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ పోలీస్ అధికారి తుపాకితో కాల్చడాన్ని చూసిన దర్పనారాయణ లతకి అడ్డుగా వెళ్ళి ప్రాణాలను కోల్పోతాడు. దర్పనారాయణ చనిపోవడాన్ని లత జీర్ణించుకోలేకపోతుంది.
జరిగిన పరిణామాలపై దాదా ఠాకూర్ తన పేపర్లో ఉద్వేగభరిత రచనలు చేస్తాడు. ఓ రోజు రోడ్డు కూడలిలో నిలబడి పేపర్లు అమ్ముతున్న తరుణంలో పోలీసులు వచ్చి ప్రజలను పక్క దారి పట్టించే రీతిలో రచనలు చేయడం నేరమని, అందుకు అరెస్ట్ చేస్తున్నామని దాదా ఠాకూర్కి చెబుతారు. అంతేకాదు తమతో పోలీస్స్టేషన్కి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నప్పుడు ఆ ఏరియా మున్సిపల్ కమిషనర్ వచ్చి పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తాడు. దాదా ఠాకూర్ రచనల గురించి ఎంతో గొప్పగా చెబుతాడు. అంతేకాదు కార్లో కూర్చోబెట్టుకుని దాదా ఠాకూర్ని ఇంటికి తీసుకెళ్తాడు. మున్సిపల్ కమిషనర్ సైతం దాదా ఠాకూర్ గురించి గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే.. ఒకప్పుడు ఓ సాధారణ షాపు యజమానిగా ఉన్న వ్యక్తిని దాదా ఠాకూర్ కాపాడతాడు. ఆ వ్యక్తే ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ స్థాయికి ఎదిగాడనే సన్నివేశంతో సినిమా ముగుస్తుంది.
- రెడ్డి హనుమంతరావు,
8332995426