Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో వున్న ప్రాచ్య లిఖిత గంథ్రాలయం మరియు పరిశోధనాకేంద్రం ఎంతో విశిష్టమైనది. 1891లో స్థాపించిన అసఫియా లైబ్రరీ తరువాత స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా మారింది. ఇది హైదరాబాదు రాజ్యంలోని ముద్రిత, అముద్రిత గ్రంథాలను ఎన్నింటినో సేకరించింది. ఈ పరిస్థితుల్లో ఇన్ని రాత ప్రతులను భద్రపరచి, జనానికి అందుబాటులో ఉంచడానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయాన్ని స్థాపించింది. అది 1975లో పరిశోధనను కూడా తన విధులను విస్తరించడంతో ప్రాచ్య లిఖిత గ్రంథాలయం పరిశోధనాలయంగా పేరు మార్చారు. రాష్ట్రప్రభుత్వం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమ్మడి కృషి వల్ల ఈ సంస్థకు సొంత భవనం అమరింది.
16 భాషల్లో 24 వేల రాతప్రతులు ఉన్నాయి. తాళపత్రాలు, కాగితపు రాతప్రతులు, ఉర్దూ, కాగితపు చుట్టలు, జంతుచర్మాలు, వస్త్రములపైన రాసిన ప్రతులు ఇక్కడ ఉన్నాయి. అరబి, పారశీక భాషల్లో 47 విషయాలపై 17వేల వ్రాతప్రతులున్నాయి. సంస్కృతంలో నాలుగువేల రాత ప్రతులు 38 విషయాలపై ఉన్నాయి. వేదం, వైదికం, న్యాయం, తర్కం వంటి 32 విషయాలపై తాళప్రత్రాలు, కాగితపు రాతప్రతులు ఉన్నాయి. తెలుగులో 1800 రాతప్రతులు 22 విషయాలపై ఉన్నాయి. ఇందులో యక్షగానాలు, కావ్యాలు, పురాణాలు వంటి 23 విషయాలపై రాతప్రతులు ఉన్నాయి.
దేశ విదేశాలనుంచి వచ్చే పరిశోధకులకు వారు అడిగిన విభాగంలో ఉన్న రాత ప్రతులను అందుబాటులో ఉంచడం. అపరిష్కృత రాతప్రతులను పరిష్కరింపచేసి వాటి రాత ప్రతులను తయారు చేయించి ముద్రించడం. సర్వే నిర్వహించి ఎవరి దగ్గరైనా రాత ప్రతులు ఉన్నట్లు తెలిస్తే వాటిని తీసుకు వచ్చి భద్రపరచడం అది సాధ్యం కాకపోతే కనీసం ఆ రాతప్రతుల్లో ఉన్న సమాచారాన్ని తీసుకు రావడం. రాతప్రతుల పట్ల అవగాహన కల్పించడం కోసం సంస్థలోపల, ఇతర విద్యా సంస్థలు, ఆసక్తి ఉన్న సంస్థల్లో అవగాహనా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించడం ఈ పరిశోధనాలయం చేసే ప్రధానమైన పనులు.
విదేశాల నుంచి ఉర్దూ, అరబిక్, పారశీక భాషల్లో పరిశోధన కోసం వస్తూ ఉంటారు. 133 శీర్షికలతో ఈ పరిశోధనా సంస్థ ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయి. వీటిలో రాతప్రతుల పట్టికలు పుస్తక రూపంలో తెచ్చినవీ ఉన్నాయి. తెలుగులో రాతప్రతుల వివరణాత్మక సూచికలు 5 సంపుటాలుగా ప్రచురితమై ఉన్నాయి. ఇదేవిధమైన సూచికలు ఉర్దూ, అరబి భాషల్లోనూ ప్రచురించారు.
తెలుగు భాష, లిపులతో దాదాపు 70 శీర్షికలతో పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇంగ్లీషు, హింది, అరబిక్, ఉర్దూ, పారశీక భాషల శీర్షికలతో 130 వరకు పుస్తకాలు ప్రచురితమైనాయి.
అరుదైన రాత ప్రతులు
పరవస్తు వేంకట రంగాచార్యులు 1859 నుంచి 1873 వరకు ఒక్క చేతి మీదగా రాసిన లక్ష పుటల మహాగ్రంథం 'లఘుశబ్దార్థసర్వస్వం' 159 విభాగాలుగా ఈ గ్రంథాలయంలో ఉన్నది. అట్లాగే కాగితపు చుట్ట ఆకారంలో బొమ్మలతో ప్రారంభమయ్యే భగవద్గీత మూడు అంగుళాల పరిమాణంలో ఉండి ఇక్కడ ఉన్న రాత ప్రతులన్నింటిలోనూ అతిచిన్నదిగా గణుతికెక్కింది. మూడు అంగుళాల పరిమాణంలో ఉన్న తాళపత్రం మరోటి ఉన్నది. దానిపేరు 'కీర్తనలు పాటలు'.
మహమ్మద్ ప్రవక్త చెప్పిన వైద్యవిధానం పారశీక భాషలో 'టిబ్బె మహమూద్ షాహీ' పేరుతో ఈ సంస్థలో ఉన్నది. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఈ వ్రాత ప్రతి ప్రపంచంలో మరెక్కడా లేదంటారు. అట్లాగే జింక చర్మంపై రాసిన హౌలీ ఖురాన్ రాత ప్రతితో పాటు క్రీ.శ.1227లో రాసిన పవిత్ర ఖురాన్ ప్రతి సంస్థ గ్రంథాలయంలో ఉంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కుతుబ్షా, మొగల్ వంశానికి చెందిన మహమ్మద్ షా చక్రవర్తి రాజముద్రలు ఈ ఖురాన్ ప్రతి మీద ఉన్నాయి.
- పాలెపు సుబ్బారావు,
అస్టిస్టెంట్ డైరెక్టర్(తెలుగు), తెలంగాణ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం మరియు పరిశోధనాలయం