Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మసకబారిన అద్దంలాగా మసక చీకటి, పచ్చి తునికి ఆకు పొగచూరినట్టు చిక్కటి మంచు, ఇప్పుడే పదును పెట్టిన కత్తివలె వాడైన చలి.. ఈ మూడింటి కరబంధనాల్లో ఊపిరాడక నేలమ్మ పెనుగులాడుతూ... సింహాలకు చిక్కిన గున్న ఏనుగులాగా పెడబొబ్బలు పెడుతోంది. రావి వృక్షం పక్షుల గొంతుల్ని దోచుకొని అరుస్తోంది.. తూర్పు ఆకాశం మందార తోటయి మొగ్గవిచ్చుకుంటోంది.
మూసిఉన్న షట్టర్.. అరుగుమీద ఇద్దరు మగపిల్లలు, తల్లి గర్భంలో పిండాల్లాగా ముడుచుకు పడుకున్నారు. పిరుదులూ కాళ్ళూ అగుపడుతున్నాయి. వారు కప్పుకున్న ఎరుపు చీర తలలు దాటిపోయి అరుగు కిందకు ఈదురుగాలికి మేడే నాటి జెండావలె ఊగుతోంది. పందిగున్న ఒకటి ముక్కుచాచి వాసన చూస్తోంది.
షట్టర్ పక్కనే గల దర్వాజ తలుపులు తెరుచుకున్నాయి. ధనుస్సులాగా వంగిపోయిన శాంతమ్మ ఊతకర్ర పట్టుకొని బయటకు వచ్చింది. వయస్సు ఎనభై పైనే ఉంటాయి. మెడ ఢమరుకం లాగా ఊగుతోంది. మెడ చాచి పరిశీలనగా చూస్తూ ''ఓ..పోరగాండ్లు లేవున్ద్రి.. ఏ లేవున్ద్రి.. ఏ లేవున్ద్రి...'' కుక్క మొరిగినట్టుగా అరుస్తూ కర్రతో వారిని పిరుదుల మీద పొడిచింది.
పక్కింటి వాకిలి ఊడుస్తూ ఉన్న లక్ష్మీ ''అమ్మమ్మ! పండుకోనీతీ... పాపం పొరగాండ్లు.. వాళ్ళని చూస్తే గోసనిపిత్తాంది'' అంది.
''గోసనిపిత్తె నీ ఇంట్ల పండవెట్టుకో.. అరే పంటే పండనీ.. ఉచ్చలు పోసుడేందువ్వా నిర్దలా.. గబ్బు ఆసన లెవవట్టే... ఏదో గూడులేని పచ్చులు అనుకుంటే... నీ సంతమిల్లైతే ఏర్పడూ.. కిరాయికి ఉండవడితివీ...'' లోపలికి వెళ్ళిపోయింది శాంతవ్వ.
''ఓ..పోరాగాండ్లు లేవుర్ర.. ముసల్ది లోపలికి ఎందుకో పోయింది'' అంది లక్ష్మి.
శాంతవ్వ వణుకుతూ బకెట్తో వచ్చింది. మగ్తో నీళ్లు పిల్లల మీద బయ్యబయ్య పోసింది.
పెద్దవాడు కళ్ళు తెరిచాడు ''అరే అరే లేరా లేరా'' అరిచాడు. ఇద్దరు దూరం పరుగెత్తి వెనక్కి తిరిగి, దెబ్బలుతిన్న పిల్ల నక్కల్లాగా చూస్తూ కళ్ళు నలుపుకుంటున్నారు. కాళ్ళు ఎండిపోయిన కఱ్ఱపుల్లల్లాగా వణుకుతూ ఉన్నాయి.
''అయ్యో..అయ్యో..'' అంది లక్ష్మి.
పిల్లలు తడిచిన పక్షిపిల్లల్లాగా పరుగెత్తి గోడ చాటుకు ముడుచుకు కూర్చోని వణుకుతూ, తలా ముఖంపైన గల నీళ్లను తుడుచుకుంటున్నారు.
శాంతవ్వ అరుగుమీద చీరని కాలువలోకి కఱ్ఱతో నెట్టింది.
చీరవైపు చూస్తూ ఉన్న పెద్దవాడు ''నీతల్లీ.. ముస్సల్దాన.. నాలుగొద్దులాగు నీ పుర్రె గాలియ్యకపోతే నేనెవ్వన్నో సూడు'' అంటూ పళ్ళు కొరికాడు. పెద్దవాడికి పదేళ్లు, చిన్నవాడికి ఎనిమిది ఉంటాయి.
లక్ష్మి పిల్లల్ని పిలిచి అగ్గిపెట్టె ఇస్తూ ''ఆ చెత్త కుప్పేసి సలికాగుర్రి.. ఒనుకుడు పట్టి సచ్చిపోతరు'' అంది.
రోడ్డుమీద పసుపు నీళ్లు చల్లినట్టుగా నీరెండ పరుచుకున్నది.
''పొరగాండ్లూ.. మొకాలు కడుక్కోండ్రి చాయి పొత్తా'' అంది లక్ష్మి.
పిల్లలు బోరింగునుండి దోసిళ్ళతో నీళ్లు తెచ్చి చలిమంట నిప్పులు చల్లార్చి బొగ్గులు పరపరా నమిలి పళ్ళు తోముకున్నారు.
పిల్లలు చారు తాగుతూ ఉంటే ''మీ అమ్మా నాయన కండ్లవడతలేరూ'' అంది.
''రొండు దినాల సంది ఎటు పోయిండ్రో'' అన్నాడు చిన్నవాడు.
''మరి ఏం తింటాన్రు''
''అవుతలి ఆడకట్టుకు పోయి అడుక్కొచ్చుకుంటాన్నం''
లక్ష్మి జాలిగా చూస్తూ ''ఆ ఎదురుంగ అరుగు మీద పండుకొండ్రి, పక్కబట్టలిత్త సలి బాగున్నది.. మీ పేర్లేందిరా'' అంది.
''మా అన్న పేరు చిరంజీవి, నా పేరు ప్రభాస్'' నవ్వారు.
''ఓ... హీరోలు... మీ అమ్మానాయన పేర్లు''
''ఆ.. మా అమ్మ పేరు పోషవ్వ, మానాయన పేరు శంకరి''
చెవులు కనిపించకుండా మసిగిన్నె బోర్లించినట్టుగా జుట్టు అట్టకట్టుకు పోయింది. నోళ్ళకు ఇరువైపులా తెగినట్టుగా తెల్లని గాట్లు, పెదవులు చిట్లి నెత్తురు గడ్డకట్టి అందులో ఎండ ప్రతిబింబిస్తోంది. కాళ్ళ చర్మం పగిలి ముదురు కోడిపుంజు కాళ్ళ వలె ఉన్నాయి. బటన్లు లేని అంగీలూ, నల్లటి కాళ్ళమీద తెల్లటి గొల్ల గీతలు, దోమ కాట్ల దద్దుర్లూ.. వారిని చూస్తూ ఉన్న లక్ష్మి కళ్ళు చెమర్చాయి.
''సరే ఆడుకో పొండ్రి''
పిల్లలు కోడిపిల్లల్లాగా పరుగెత్తారు. బడికి వెళ్లే పిల్లలూ.. వారి వెంట తల్లిదండ్రులూ...రోడ్డంతా సందడిగా ఉంది.
పిల్లలు అరుగుమీద కూర్చొని ప్లాస్టిక్ కవర్లో అన్నం తింటూ ఉన్నారు. స్కూల్ బస్ లక్ష్మి ఇంటి ముందు ఆగింది. ఆమె పిల్లలూ భర్తా ఎక్కారు. ''మమ్మీ బారు'' అంటూ అరుస్తూ ఉంటే బస్ కదిలింది. ఆమె పిల్లలు కూడా ఈ పిల్లల వయస్సులోనే ఉన్నారు.
''అన్నా మనకు గుతం సేటమ్మ కొడుకుల లెక్క అంగీ లాగూ టయ్యీ బెల్టూ బూట్లూ ఉంటే మంచిగుండు కదా'' అన్నాడు చిన్నోడు.
''మనం ఏమన్నా బడి పిల్లలమా ఆళ్లకే అయ్యి ఉంటయి'' అన్నాడు పెద్దవాడు.
తినడం అయిపోగానే లక్ష్మి ఇంటిముందు నిలబడ్డారు. శాంతవ్వ వచ్చింది.
''గాడిది కొడుకుల్లారా.. మళ్ళొచ్చినారూ.. కాళ్ళు పుంటి కట్టెలోలే ఇరుగాలే..'' అంటూ కఱ్ఱ లేపింది.
''అర్రే.. ఏమో.. కొండ్రీస్ మేకపిల్లల ఎంబడి పడ్డట్టు ఆల్లెంబడి పడవడితివీ'' అంది లక్ష్ష్మి.
''ఎందవ్వో.. పున్యకార్యాలు బహు చెయ్యవడితివీ.. నీకే పొద్దుగాలుంటే పోద్దిమీకి గతుండదిగనీ ''
''నీ ఇంటికి ఏమన్నా పెట్టిపొయ్యిమని ఒత్తున్నమా పెట్టకు తీ..''
''ఆల్లు గలీజుగాళ్ళు.. ఇంటిముందటికి రానియ్యకు.. ఇల్లు కాలీజెపిత్త ఏమనుకున్నవో మరీ..'' అంది శాంతవ్వ.
లక్ష్మి ఏమి పట్టించుకోకుండానే ''అరేరు.. కట్టింగ్ చేయించుకుంటరా.. ఎద్రుంగా షాపుల చెప్తా.. ఆ గోర్లు సుతం తీస్తడు'' అంది.
ముఖాలు చూసుకున్నారు పిల్లలు.
''అంత గాలీజుగున్నరు.. నెత్తిల పుండ్లయితయి మొత్తం బోడగుండు అయితది.. మీ ఇష్టం.. నేను సబ్బిత్త.. ఎండ రాంగానే బోరింగ్ కాడ స్నానం జెయ్యిర్రి''
''సరే సేటమ్మా '' అన్నాడు పెద్దవాడు.
కట్టింగ్, స్నానం అయిపోయింది. లక్ష్మి తన పిల్లల బట్టలు ఇచ్చింది. పిల్లలు ఒకరిని ఒకరు చూసుకొని మురిసిపోతున్నారు.
''ముద్దుగున్నర్రా.. స్కూల్ పిల్లలలెక్క''
''కొంచం బువ్వున్నది తింటం సేటమ్మా'' అన్నాడు పెద్దవాడు.
''తిన్నంక ఎంబడే రాండ్లి''
మధ్యాహ్నం రెండు గంటలు దాటింది. పిల్లలు లక్ష్మి ఇంటికి వెళ్లారు.
''అరేరు! ఉత్తగా తిరిగితే ఏమొత్తది.. అ ఆ లు పెట్టిస్తా దిద్దుర్రి''
''ఆ మాకు దిద్దరాదు, మాకిష్టం ఉండది.. మా అమ్మానాయన కొడుతరు'' అన్నాడు చిన్నవాడు.
''అర్రే మీ బట్టలు చూస్తే బడికి పోయే పిల్లల లెక్క ఉన్నరు. మీకు సదువు రాదంటే ఎక్కిరిస్తరు.. సీన్మ పోస్టర్ల మీద పేర్లు చదవరా.. మీకు బట్టలియ్య.. మీరు ఏసుకున్న బట్టలు మల్ల తీసుకుంటా.. మంచిగా దిద్దుతే మా పిల్లల స్వెట్టర్, మంకీ క్యాప్ ఇస్తా..''
''సరే సేటమ్మా'' అన్నాడు చిన్నవాడు.
మూడురోజులు గడిచాయి... రోజూ దిద్దుతున్నారు.
మధ్యాహ్నం వేళ పోషవ్వ శంకరి వచ్చారు. పిల్లల్ని చూసి మురిసిపోయారు, ముద్దులు పెట్టుకున్నారు. లక్ష్మి వద్దకు వెళ్ళింది పోషవ్వ.
''సేటమ్మా.. మమ్ముల సూత్తేనే దూరం గొడుతాండ్లు.. పొలగాండ్ల మీద దయజూపినవ్.. నీ కడుపు సల్లగుండ'' అంటూ దండం పెట్టింది.. కన్నీళ్లు పెట్టుకుంది.
''పిల్లలు ఉషారున్నరు.. బడికి తోలిస్తే తొవ్వకొస్తరు.. ఫుజూలుగ తిరుగుతే ఏమోస్తది''
''మా పాలోళ్ళ పిల్లలు సదువుకుంటాడ్లు.. తండ్రి తాగుడుకు ఎగవడ్డడు.. తాగుడు పాడుగానూ.. ఈ మందు అమ్ముడు బందైతే మంచిగుండు.. ఒక్కరేవు లేదూ, తావు లేదూ.. గిప్పుడు వాళ్ళను ఏ బల్లె తీసుకుంటరూ''
''నువ్ ఊ అను.. మా సారు ఏదో ఒక హాస్టల్లో వేస్తడు..''
''నాలుగొద్దులాగినంక సూతాం సేటమ్మా'' అంటూ పోషవ్వ వెళ్ళిపోయింది.
రాత్రి పన్నెండు గంటలు దాటింది. దూరంగా పెట్రోలింగ్ వాన్ హార్న్ వినపడుతోంది. చలి పులిలాగా వేటాడుతోంది. కీచురాళ్ల రొద వినబడుతోంది.
అరుగుమీద పోషవ్వా పిల్లలూ బ్లాంకెట్ కప్పుకొని నిద్రపోతూ ఉన్నారు. పక్కనే చల్లారిపోతున్న నెగడులో గాలికి మిరుగులు ఎగురుతున్నాయి. రావిచెట్టు కొమ్మల్లోకి రెండు గబ్బిలాలు సంధించిన బాణాల్లాగా దూసుకుపోయాయి. కొమ్మ ఊగింది.
శంకరి తూలుతూ వచ్చాడు. బ్లాంకెట్ లాగిపారేశాడు. ''నీ తల్లీ...'' అంటూ ఆమె వెంట్రుకలు కుడిచేతికి చుట్టుకున్నాడు ''లే! లేవే.. బువ్వపెట్టూ. మిండడు రాలేదని రందిలేదే..''
''అరే ముండకొడుకో.. నీ నోట్లే మన్నువడనో..'' అంటూ నిలబడింది.
పిల్లలు లేచికూర్చోని నిద్ర కళ్ళతో ఇరువుర్నీ చూస్తూ ఉన్నారు.
''ఇడువురా ముండకొడుకా నెత్తి మండుతంది.. పోరాగాండ్లు అడుక్కొచ్చింది బుక్కెడుంటే తిని పన్నం.. బువ్వ యాడిదీ''
''నీ తల్లీ..బువ్వలేదా..'' అంటూ ఆమె పొట్టలోకి పాదం పెట్టి రెండు చేతులతో తల పట్టి వంచి వీపులో బలంకొద్దీ నాలుగు గుద్దులు గుద్దాడు.
నిశ్శబ్ద నిశీధి బద్దలయ్యింది, చెట్టుకొమ్మల్లోంచి పక్షి ఒకటి లేచి వాలింది.
శంకరి కాళ్ళు అస్తవ్యస్తంగా కదిలి చెట్టులాగా కూలిపోయాడు. తల నేలకు తాకిన చప్పుడు అయ్యింది. నిచ్చలంగా ఉండిపోయాడు. పోషవ్వ తల్లడిల్లుతూ వెల్లకిలా అరుగుమీద పడుకుంది.
పోలీస్ వాహనం ఫ్లడ్ల్ లైట్ల వెలుతురు రావిచెట్టును ఆక్రమించాయి. ఇద్దరు పిల్లల సహాయంతో శంకరిని అరుగుమీదకు లాక్కొచ్చి నిండుగా బ్లాంకెట్ కప్పింది. ముగ్గురు గుట్టుచప్పుడు కాకుండా పడుకున్నారు.
తెల్లవారింది... నులివెచ్చని ఎండ స్పర్శకు నేలమ్మ పరవశించిపోతోంది. శంకరి నిద్రపోతూ ఉన్నాడు. పోషవ్వ నిటారుగా నిలబడలేక పోతోంది. ''వీని రెక్కలు ఇరిగిపోనూ.. ఎన్నుపూసమీద గుద్దే... ఊపిరి తీసుకునుడు సుతం అయితలేదాయే, వీని మక్రమ్ కాలిపోనూ'' అంది. కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.
పిల్లలు నెగడు దగ్గర కూర్చోని నిప్పుతో ఆడుతున్నారు. నలుగురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్లు పోషవ్వ దగ్గరకు వచ్చారు.
ఒక మహిళ ''కాట్లే పుర్రె యాడ పారేసిండ్లు'' బెదిరిస్తూ అడిగింది.
''పుర్రె యాడిదవ్వా... నేనే దొరికిన్నా.. పొద్దుగాలనే'' అంది పోషవ్వ.
''ఏహే ఉత్తగ షేప్తాదీ... నాలుగు సప్పరిత్తే అదే షెప్తది..'' అన్నాడు ఒకతను.
''ఏహే ఉండుర్రీ.. ఆడిమనిశి మీద షెయ్యేత్తే తప్పుల పడుతం, పన్నోడు దీని మొగడే ఉన్నట్టున్నది'' అంటూ శంకరిని మరో అతడు వెళ్లి గల్లా పట్టి లేపి కూర్చోపెట్టాడు.
శంకరి నిద్రకళ్ళతో ''ఏ ఎవడ్రా..'' అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు.
''నీ తల్లి.. కాడు పురాంగ కాలక ముందే పుర్రెలు మాయం జేతాండ్లు.. నోట్లే పెట్టిన బంగారమో ముక్కు పుల్లలో ఉంటే తీసుకపోయి అమ్ముకుంటాండ్లు.. షెప్పురా పుర్రె యాడేసిండ్లో..''
''ఓ.. అయ్యా.. గా సోయిలేనోన్ని బద్ధియ్య వడితిరీ.. ఆరం సంది మేం లేనే లేం.. బొందలగడ్డ మోకాన మేం రానేలేదు'' అంది పోషవ్వ.
''ఓ బోడుసొద్.. ఏమో దీర్గాలు తీయవడితివీ''
అంటూ ఒక మహిళ వెంట్రుకలు పట్టుకొని కొట్టడం ఆరంభించింది.. మరో మహిళ కూడా చేయి చేసుకుంటూ ఉంటే, పిల్లలు పోషవ్వ దగ్గరికి వచ్చారు ఏడుస్తూ..
''నా ఇమానంగనుల్లా.. మీ బాంచెనుల్లా.. మేం అటుమొకాన రానేలేదుల్లా.. రాత్రంతా దెబ్బలు వడ్డనుల్లా... ఇగో.. నా పొలగాండ్ల నెత్తిగొడుతాన సూడు'' అంటూ పిల్లల తల మీద కొట్టింది.
''ఏ ఇగ రాండ్లి.. పొల్లగాళ్ల నెత్తి కొట్టింది.. దాని నాశనం దానికే'' అంటూ వెళ్లిపోయారు.
పోషవ్వ తల వెంట్రుకలు గోళ్ళతో దువ్వినట్టు చేసింది. శిగ ముడిశింది, నడుము నుండి సంచి తీసి ముప్పై రూపాయలు పిల్లలకు ఇస్తూ ''ఓరి పోరాగాండ్లు.. పిలేటు ఇడ్లి సెరిసగం తినుర్రి.. నాకు ఒక్క షా తీసుకరాండ్లి'' అంది.
పిల్లలు ఇడ్లీ తింటూ ఉంటే స్కూల్ బస్ లక్ష్మి ఇంటి ముందు ఆగింది. లక్ష్మి పిల్లలూ భర్తా ఎక్కారు. ''మమ్మీ బారు... చిర్రూ బారు. ప్రభాస్ బారు'' అంటూ ఉంటే బస్ కదిలింది.
నోటి నిండా ఇడ్లీ ఉంచుకొని దవడలు బిగవట్టి నవ్వుతూ చేయి ఊపారు.
''అమ్మా ...మాక్కూడా బస్సెక్కి బడికి పోవాలని అనిపిత్తాంది'' అన్నాడు చిన్నవాడు.
''మనకంత నసీవ లేదు బిడ్డా''
పిల్లలు లక్ష్మి వద్దకు వెళ్లి ''సేటమ్మా.. మా అమ్మతోని పనికి పోతాన్నం. మాపటికి ఒత్తమ్'' అన్నాడు చిన్నవాడు.
''ఎక్కడరా పనీ మీ అమ్మ ఒక్కతి పోదా''
''ఊహూ.. మా అమ్మకు ఆసరైతాం.. అవుసులోళ్ళ ఆడకట్టుకు పని''
రెండు ఇనుప తట్టలూ, బట్టలు ఉతికే బ్రష్, చీపురూ, రెండు ప్లాస్టిక్ డబ్బాలు భుజం మీద పెట్టుకొని పోషవ్వ బయలుదేరింది. వెంట మేక పిల్లల్లాగా పిల్లలు పరుగెడుతున్నారు.
నగల షాప్ ముందు రోడ్డుమీద బ్రష్తో రాకుతూ మట్టి కుప్ప చేస్తోంది పోషవ్వ. పెద్దవాడు కాలువలో దిగి అడుగున మట్టి ప్లాస్టిక్ డబ్బాతో తీసి చిన్నవాడికి అందిస్తూ ఉంటే, ఇనుప డబ్బాలో పోస్తూ ఉన్నాడు. పోషవ్వ కాలువలోని నీటిని తట్టలో పోసి మట్టిని గాలిస్తోంది.. పచ్చని లోహం ముక్క దొరికింది. దానిమీద తేజాబ్ చుక్కలు వేసి పరిశీలిస్తోంది.
''అమ్మా.. అన్నా.. సేటమ్మా వత్తుంది..'' అరుస్తూ ఉన్నాడు చిన్నవాడు.
లక్ష్మి కూరగాయలు తీసుకొని వస్తూ ఉంది. పెద్దవాడు కాలువ లోనికి వంగాడు...పోషవ్వ ''సేటమ్మా... మా పొట్టతిప్పలు సూసినవా..'' అంది.
లక్ష్మి నవ్వుతూ ''ఏదో తిప్పలు పడంది ఎట్లా ఎల్లుద్ది పోషవ్వా'' అంది.
సాయంకాలం పిల్లలు లక్ష్మి వద్దకు వెళ్లారు.
''అరేరు.. మోరీల దిగిండ్లు కదా.. స్నానం చేసి రాండ్లి, మీకు మంచి డ్రెస్సులు ఇస్తా..'' అంది లక్ష్మి.
''సేటమ్మా.. మెడకు కట్టుకునే టయ్యి, బెల్టు, బూట్లూ, స్కూలు బ్యాగు కూడా ఇయ్యవా..'' అన్నాడు చిన్నవాడు.
లక్ష్మి గలగలా నవ్వుతూ ''మంచిగా చదువుకుంటే ఇస్తా మరి..'' అంది.
పిల్లలు స్నానం చేసి డ్రెస్సులు వేసుకున్నారు. వాళ్ళ నవ్వుల్లో అమావాస్య నాటి నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ''అచ్చంగా బడిపిల్లల లెక్కనే ఉన్నారు బిడ్డా , బస్సు వత్తె ఎక్కి పోవుడే ఉంటది ఇగ..'' అంటూ పిల్లల్ని హత్తుకుంది పోషవ్వ.
రోజులు గడుస్తూ ఉన్నాయి. పిల్లలు రెండవ తరగతి సిలబస్ అంతా నేర్చుకున్నారు. మే నెల చివరి వారం రోజులు...
పోషవ్వ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. పిల్లలు లక్ష్మి దగ్గర తెచ్చిన పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గడం లేదు. లేచి కూర్చోలేక పోతోంది. సాయంకాలం పిల్లలు లక్ష్మి దగ్గరకు వెళ్లారు.
శాంతవ్వ మూలుగుతూ వచ్చింది. పిల్లలు ఆమె వైపు కోపంగా చూసారు. లక్ష్మి కనుసైగ చేయగానే పిల్లలు బయ్యటకు వచ్చేసారు.
గంట తరువాత లక్ష్మి పిలిస్తే వెళ్లారు. ''అరేరు పెద్దోడా.. ఈ పైసలు తీసుకొని మీ అమ్మను దావుకాణకు తీసుకపోర్రి.. అన్ని పరీక్షలు చేపియిండ్రీ..'' అంది.
వాళ్ళు డబ్బులనీ, ఆమెనూ చూసి నవ్వుతూ వెనక్కి జరిగారు. ఇరువురు ముఖాలు చూసుకున్నారు.
''తీసుకొండ్రా.. మీ అమ్మకు ఏమన్నా అయితే మీరెట్లరా.. మీ అమ్మ మంచిగా అయినంక నాకు ఇయ్యిర్రి..''
పిల్లల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
పోషవ్వకు విషయం చెప్పి డబ్బులు ఇచ్చారు పిల్లలు. ఆమె అనుమానంగా చూస్తూ ''మల్లా ఎట్లిత్తం బిడ్డా...''
''మేమే ఎట్లన్న చేసిత్తం. నీకెందుకమ్మ రంది, నువ్ మంచిగుంటే చాలు'' అన్నాడు పెద్దవాడు.
పోషవ్వ దు:ఖం ఆపుకోలేక పోయింది. పిల్లలు కూడా బోరున ఏడ్చారు...
''పిస్స పొరగాండ్లు... నాకేంగాదు తండ్రులూ..'' అంటూ దగ్గరికి తీసుకుంది.
పోషవ్వ ఆసుపత్రికి వెళ్ళింది, చికెన్ గున్యా అని తేల్చారు వైద్యులు.
రెండురోజులుగా ఇంజెక్షన్లు తీసుకుంటోంది
తెల్లవారింది... ఎండ దావానంలాగా పరుచుకుంది. శాంతవ్వ చనిపోయింది. ఇంటిముందు టెంట్ వేశారు. శవాన్ని బల్లమీద పడుకోబెట్టారు. జనం చాలా వచ్చారు. కార్లు బారులు తీరి వచ్చాయి. భగవద్గీత వినిపిస్తోంది.
పిల్లలు టెంట్ వద్దకు వెళ్లారు.
''అవ్వో ముసల్ది ఎంత పున్నెం చేసుకున్నదో, బంగారం అసొంటి సావు సచ్చింది. అడుతా పాడుతా పోయింది. ఎవ్వలతోటి షేపిచ్చుకోలే ..'' అంది ఒక మధ్యవయస్కురాలు.
''ఓ.. పాపిష్టి ముసల్ది.. నీ తల్లి మేం గద్దెమీద పండుకుంటే మా మీద సల్లటి నీల్లు పోసింది'' అన్నాడు చిన్నవాడు.
సాయంకాలం ఐదు గంటలకు శవం తరలింపు ఏర్పాట్లు మొదలైనాయి. చావుడప్పులు మోగుతున్నాయి. భగవద్గీత అందులో మిళితం అయిపోయింది.
''అన్నా సేటమ్మ బాకీ తీరువాలే మనం'' అన్నాడు చిన్నవాడు.
ఏడు గంటలకు వైకుంఠ రథం కదిలింది. ముందుగా ట్రాలీ వాహనంలో చప్పుళ్ల వాళ్ళు.. చివరగా రైలు డబ్బాల్లాగా కార్లు కదిలాయి.
పిల్లలు రెండు ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు నింపుకొని స్మశానంలోకి వెళ్లి తుమ్మచెట్ల చాటుకు చీకట్లో కూర్చున్నారు.
వైకుంఠ రథం లోపలికి వచ్చింది. సాంప్రదాయ బద్దంగా ఏర్పాట్లు చేసి శవాన్ని చితిమీద ఉంచి నిప్పుపెట్టారు. జనం వెళ్లిపోయారు.
స్మశానంలో జోరుగా గాలులు వీస్తూ ఉన్నాయి. తుఫానులో చిక్కుకొని మునిగిపోతున్న నావ జెండాల్లాగా అగ్నిశిఖలు కదులుతున్నాయి. తుమ్మకొమ్మలు చేస్తున్న హోరూ, కీచురాళ్ల రొదా, మంటల చిటపటలూ, కర్రలు కాలుతూ ఒక్కొక్కటీ కూలుతున్న ఖట్రఖట్ర చప్పుడుతో చీకటి భయానకంగా ఉంది. క్రమంగా మంటల తీవ్రతా తగ్గి, చితి చిన్న రాశిలాగా కుదించుక పోయింది.
పిల్లలు చెట్ల చాటునుండి నెమ్మదిగా నక్కల్లాగా బయటకు వచ్చారు. అంతా కలియచూశారు. తలకి గుడ్డలు కట్టుకున్నారు. పాడె వెదురుబొంగులు తీసుకున్నారు.
''అన్నా గోరీల దిక్కు చూస్తే బుగులైతాంది'' అన్నాడు చిన్నవాడు.
''సేటమ్మ బాకీ తీరలే బుగులుపడకు.. అటుసూడకు... ఈ ముస్సల్ది మనమీద నీల్లు సల్లింది.. జప్పన పనికానిచ్చుకొని ఎల్లిపోదాం.. అమ్మ పరేషాన్ అయితుంటదిరా..''
చెమటలతో తడిచిపోయారు. ముఖాల మీద స్వేదబిందువుల్లో మంటలు ప్రతిబింబిస్తున్నాయి. చితికి దగ్గరగా వచ్చారు. ముఖానికీ, కాళ్ళకీ సెగలు తగులుతూన్నాయి. కపాలం వైపు కర్రల్ని బొంగులతో కదిలించారు. మెడ మీద భాగంలో బొంగులతో పొడిచి తల వేరుచేసి కిందకు తోసి దూరం నెట్టుకు వచ్చి నీళ్లు చల్లారు.. పొగలు రేగుతున్నాయి, రంధ్రాల్లో మరిన్ని పోశారు. తల గుడ్డలు విప్పి కపాలం మీద కప్పి, చేతుల్లోకి తీసుకుని నేల మీద కొట్టారు. అందులోనుండి నల్లగా కమిలిపోయిన బంగారు ముద్దని గుడ్డలో కట్టుకొని, కపాలాన్ని చితివైపు బొంగుతో తోసి కుందేలు పిల్లల్లాగా గంతులువేస్తూ పోషవ్వ దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. ఆమె గాఢ నిద్రలో ఉంది. లేపి ఆమె చేతిలో పెట్టారు.
''అయ్యో.. అయ్యో... గీ పని మీరెందుకు చేసిర్రురా.. రేపు పొద్దుగాల నేను పోకపోదునా.. గీ శీకట్లా... సంటి పోరలూ... ఎందుకు పోయిఱ్ఱురా...'' అంటూ నుదురు కొట్టుకుని ఏడ్చింది.
''నీయమ్మా.. వాడు ఆనేగాళ్ల ఈరి మామ ఇటుదిక్కే తిరుగుతాండూ.. ఆయింత ఆడు అందుక పోతాడూ... సేటమ్మ బాకీ ఎట్లనే... మల్ల పీనుగ ఈ నడుమ ఒత్తయో రావొ...'' అంటూ చిన్నవాడు కాళ్ళు కింద కొట్టాడు.
మరునాడు మధ్యాహ్నం... పోషవ్వా పిల్లలూ డబ్బులు తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్లారు.
''సేటమ్మా..దేవతోలే ఆదుకున్నవు.. ఇగో బాంచెనూ నీ పైషెలూ... నీకు ఇచ్చేదానక పొల్లగాళ్ళు నిర్దపోనియ్యలేదు'' అంది పోషవ్వ.
'' పోషవ్వా.. పిల్లల్ని ఆగం జెయ్యకు. నువ్ ఊ.. అను, పిల్లల్ని గవర్నమెంట్ హాస్టళ్ల మా సారు ఏస్తడు.. ఆయన పని చేసే స్కూల్ హాస్టళ్ల మనుషులు పడుతరట.. నీకు పని చూస్తడూ.. తండ్రికి లేకున్నా నీకు ఉండాలే గదా. .రేపే బల్లు కుల్లయితానయీ... ఆ పైసలు నీ దగ్గరనే ఉండనియ్యి.. పుస్తకాలకు బట్టలకు అక్కరోస్తయీ...'' అంది లక్ష్మి.
''అమ్మా... మేం బడికిపోయి సదువుకుంటమే'' అన్నారు పిల్లలు.
''సేటమ్మా.. నువ్ అన్నట్టే కానియ్యి. కని పైషెలు తీసుకో బాంచెనూ..''
''ఆ పైసలు నాయి సుతం గావు.. మీ గోస చూడలేక... నిన్న సచ్చిపోయిన శాంతవ్వ ముస్సల్ది.. అయ్యో ఆ తల్లికేమన్నయితే ఆ పిల్లలు ఏడిండ్ల పిల్లికూనలైతరు.. ఇప్పటికే పచ్చులోలే అరిగోస పడుతాండ్లు... పొలగాండ్లు బంగారమోలే ఉన్నరూ.. ఏదన్న బల్లె ఏయిండ్రి లచ్చిమీ....ఇంకెమన్న పైసలు అక్కరుంటే అడుగుమని సుతం అన్నది..'' అంది లక్ష్మి. ఆమె కళ్లలోంచి నీటి బిందువులు రాలాయి.
పోషవ్వా, పిల్లలూ... నోళ్లు తెరిచి శిలాప్రతిమల్లాగా నిలబడిపోయారు.
- పర్కపెల్లి యాదగిరి
రచయిత సెల్ : 9299909516