Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామంలో అందరు సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవతలకు పండగ చేస్తారు. అట్లా చేస్తే ఎలాంటి అరిష్టం రాదని నమ్ముతారు. మనల్ని ఎవరైనా కొట్టడానికీ వస్తున్నారంటే ఆమడదూరం పరిగెడతాం కదా... మరి ఇక్కడ ఎదురెదురుగా నిలబడి 20 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా కొట్టుకుంటారు. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే. చివరికి గ్రామ సర్పంచ్ అయినా సరే ఎదురుగా ఉంటే కొట్టవలసిందే.. దెబ్బలు తగలవలిసిందే! అయ్యోపాపం అనే సమస్యే ఉండదు. ఇట్లా కొట్టుకోడానికీ డప్పులతో అన్ని కులాల పెద్దలను గౌరవంగా ఆహ్వానిస్తారు. ఇది హౌలీ పండగ సంధర్బంగా ఆడే ప్రత్యేక ఆట. పూర్వం నుండి కొనసాగుతున్న ఆచారం! తెలంగాణలో అరుదైన ఈ ఆచారంపై ఇస్తున్న ప్రత్యేక వ్యాసం ఇది.
బోధన్ మండల కేంద్రానికి 12 కి.మీ.దూరంలో గల హూన్స గ్రామంలో హౌలీ ఆట తీరేవేరు. పండగ సంధర్బంగా ఆ రాత్రి కాముడు కాలగానే తెల్లారి రంగులాడుతారు. హౌలీ సందర్భంగా దూరాన ఉన్న బంధువులు ఆడపడుచులు తప్పనిసరిగా ఈ గ్రామానికి రావలసిందే. దాంతో ప్రతి ఇల్లు బంధువులతో కిటకిటలాడుతుంది. అయితే రంగులు ఆడేనాడు మధ్యాహ్నం ఊరి చివరన కుస్తీ పోటీలను నిర్వహిస్తారు. సుమారు గంటకుపైగా కుస్తీ పోటీలు జరుగుతాయి. దాని తర్వాత జరగబోయే ఆట కీలకమైనది. రంగులాట ముగియగానే కొంతమంది గ్రామం నడిబొడ్డులో చెరోవైపు రెండు పెద్ద దుంగలను పాతుతారు. దానికి బలమైన లావుపాటి తాడును రెండు పొరలుగ చేసి రెండు దుంగలను కలిపి కడతారు. అది ఊడిరాకుండా ఒకటికి పదిసార్లు సరిచూసి గట్టిగా బిగిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే జనం ఈ దుంగలకు కడుతున్న తాళ్లను చూసి ఆశ్చర్యపోతారు. ప్రతి చోట హౌలీ సందర్భంగా మాములుగానే జనం ఉంటే ఈ గ్రామంలో ఇసుకవేస్తే రాలనంత జనం తరలివస్తారు. అయితే దుంగలకు తాడు కట్టడం అయిపోగానే కుస్తీ పోటీలు పూర్తవుతాయి. అక్కడి నుంచి నేరుగా డప్పులతో బయలుదేరివస్తూ గ్రామంలోని మాన్ కార్ (ఊరిపెద్ద) ఇంటి వద్దకు వెళ్తారు. అలా గ్రామంలో ఎన్ని కులాల వారు, ఎన్ని మతాల వారు ఉన్నారో వారందరి ఇంటికీ వెళ్లి డప్పులతో ఈ ఆటస్థలానికి ఆహ్వానిస్తారు.
పిడిగుద్దుల వర్షం
ఇలా ప్రతి కులంలో నుంచి మగవారు రాగానే అక్కడ ఏర్పాటుచేసిన తాడును గట్టిగా పట్టుకుంటారు. అంతే ఆ క్షణంలో పిడిగుద్దులాట ప్రారంభమవుతుంది. ఒకవైపు బహుజనులు, మరోవైపై అగ్ర వర్ణాల వారు ఎదురెదురుగా నిలబడి ఒకచేత్తో తాడుని పట్టుకుని ఎదురుగా ఉన్నవారిపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు. సుమారు 20 నిమిషాల వరకు హౌరాహౌరిగా కొట్టుకోవడంతో ఆ ప్రాంతం అంతా ధన్ ధన్ అనే సప్పుడుతో దద్దరిల్లుతుంది. ఎవరికి దెబ్బలు తగిలాయో తెలియని పరిస్థితి. చివరికి దుంగలకు కట్టిన తాడును వదిలేయడంతో ఆట ముగిసినట్లుగా ప్రకటిస్తారు.
కొట్టుకున్న వారే కలిసి కల్లు తాగుతారు
ఈ పిడిగుద్దులాటలో పాల్గొని ఒకరికొకరు కొట్టుకున్నవారే ఆట ముగిసి బయటికి రాగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హౌలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంతేకాదు ఒకరి భుజంపై ఒకరిని ఎక్కించుకుని కల్లుబట్టికి వెళ్తారు. కలిసి కల్లు సేవిస్తారు. నన్ను కొట్టారనే భావన ఎవరిలోను కనపడదు. పండగ ఇనాం పేరిటా మందు, మాంసంతో దావత్ లు చేసుకుంటారు.
పసుపు, బూడిద రాస్తే గాయాలు తగ్గుతాయట
పిడిగుద్దులాట లో తలపడే వారు ఒంటిపై గాయాలతో బయటికి వస్తారు.ముఖంపై, ఒంటిపై దెబ్బలు తగిలి కొంతమందికి రక్తం కారుతుంది. కొంతమందికి ముఖం వాచిపోతుంది. అయినా దెబ్బలు తగిలిన చోట ఎలాంటి ఔషధం పూయరు. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేసుకోరు. దెబ్బలతో బయటికి వచ్చిన వారికి ముందుగా వారి భార్యలు తాగునీటిని అందిస్తారు. తర్వాత పసుపు, సున్నంతో పాటు హౌలీ బూడిదను దెబ్బలు తగిలిన గాయాలపై పూస్తారు. ఇవే గాయాలు మానిపోడానికీ మందులు అంటు నమ్ముతారు.
ఆట నిర్వహించకుంటే అరిష్టమట
గ్రామంలో తరతరాల నుంచి వస్తున్న ఈ పిడిగుద్దులాటను నిర్వహించకుంటే గ్రామానికి అరిష్టమని గ్రామస్థులు తెలిపారు. గతంలో ఒకసారి అందరి మాటలు విని ఆటను నిలిపివేశామని దాంతో ఆపాటికే ఆటను చూడడానికి సమీపంలో గల నీటి ట్యాంకుపై జనం నిండిపోయి ఉన్నారు. ఆట నిలిపివేశామని ఆడటం జరగదని ప్రకటించిన రెండు నిమిషాలకే నీటి ట్యాంకుపై నిచ్చేన కూలిపోయి ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారని గ్రామస్థులు తెలిపారు. అప్పటి నుంచి ఆటను తిరిగి ప్రారంభించడం జరిగిందని వారన్నారు.
పోలీసుల సాక్షిగా కొనసాగుతున్న ఆట
గ్రామాల్లో ఏదైనా గొడవలు జరిగితే కేసులు నమోదు చేసే పోలీసులు వారి ఎదుటనే ఒకరికి ఒకరు భీకరంగా కొట్టుకుంటున్నా ఏం చేయలేని నిస్సాహయ పరిస్థితి పోలీసులది. గతంలో జిల్లా పోలీసు బాస్ వచ్చి గ్రామస్థులకు కౌన్సిలింగ్ నిర్వహించినా ఆటను నిలపడానికి గ్రామస్థులు ససేమిరా అన్నారు. యధావిధిగా పోలీసు అధికారులు ఎదుటే పిడిగుద్దులాట నిర్వహించారు. ఈ ఆటను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే జనంతో గ్రామం కిక్కిరిసిపోతుంది. దానికితోడు మీడియా సైతం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఈ గ్రామానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటవల్ల ఎనలేని పేరు వచ్చింది.
- లింబూరి లక్ష్మణ్,
9912383547
నవతెలంగాణ, బోధన్